కరోనా మాస్క్: రూ.13వేలు జరిమానా కట్టిన ఆ ప్రధాని ఎవరంటే?
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ ఈ రోజు (జూన్, 30) దేశాన్ని ఉద్దేశించి కరోనా మహమ్మారి, లాక్ డౌన్, అన్లాక్ తదితర అంశాలపై మాట్లాడారు. లాక్ డౌన్ వల్ల లక్షలాదిమంది ప్రాణాలు కాపాడినట్లు చెప్పారు. రాబోయేది వర్షాకాలమని, ఫ్లూ సీజన్ కాబట్టి, జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. బయటకు వెళ్లినప్పుడు మాస్క్ తప్పనిసరిగా ధరించాలని చెప్పారు. ఈ సందర్భంగా స్వయంగా ఓ దేశ ప్రధానికే మాస్క్ ధరించనందుకు రూ.13వేలు జరిమానా విధించారని, అలాగే మన వద్ద కూడా నిబంధనలు కఠినంగానే అమలు చేయాలన్నారు.
టిక్టాక్ బ్యాన్, గంటకు లక్షల్లో దూసుకెళ్లిన చింగారీ: చైనాకు రూ.వందల కోట్ల నష్టం
మోడీ ప్రస్తావించిన వ్యక్తి బల్గేరియా ప్రధాని
లాక్ డౌన్ నిబంధనలను మరింత కఠినంగా అమలు చేయాలని చెబుతూ ప్రధాని మోడీ ఓ దేశ ప్రధాని నిబంధనలు అతిక్రమిస్తే రూ.13వేల జరిమానా కట్టారని చెప్పారు. ఆ జరిమానా కట్టిన అతను బల్గేరియా ప్రధాని బోయ్కో బోరిస్సోవ్. జూన్ 23వ తేదీన బల్గేరియన్ ప్రధాని మాస్క్ లేకుండా మాంటెసరీని సందర్శించారు. కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు బల్గేరియా ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. ఇందులో మాస్క్ కచ్చితంగా ధరించాలి. కానీ స్వయంగా ప్రధాని ధరించలేదు. దీంతో అతనికి ఆరోగ్య శాఖ అధికారులు 300 లెవా (150 యూరోలు లేదా 170 డాలర్లు) జరిమనా విధించారు. మన కరెన్సీలో దాదాపు రూ.13వేలు. ప్రధానితో పాటు అతనితో మాస్కు లేకుండా వెళ్లిన సహచరులు, జర్నలిస్టులకు కూడా ఈ జరిమానా విధించినట్లు ఆర్థికమంత్రిత్వ శాఖ ప్రకటించింది.
అధికార, ప్రతిపక్ష పార్టీలకు జరిమానా
ప్రధాని బోయ్కో బోరిస్సోవ్ పార్టీ కన్సర్వేటివ్ జీఈఆర్బీ పార్టీ, ప్రధాన ప్రతిపక్షం లెఫ్ట్ వింగ్ బల్గేరియన్ సోషలిస్ట్ పార్టీలకు కూడా ఇటీవల 3,000 లెవాల చొప్పున జరిమానా విధించారు. మన కరెన్సీలో లక్ష పాతికవేలకు పైగా ఉంటుంది. ఎందుకంటే ఈ పార్టీలు నిబంధనలు ఉల్లంఘించి వీకెండ్ పార్టీలు నిర్వహించాయి. దీంతో జరిమానా విధించారు. కరోనా ప్రభావిత దేశాల్లో బల్గేరియా 86వ స్థానంలో ఉంది. దాదాపు 5వేల కేసులు, 229 మరణాలు ఉన్నాయి. మొదట కేసులు పెరగలేదు. కానీ కొద్ది రోజుల క్రితం రెస్టారెంట్లు, థియేటర్లు, క్రీడావేదికలు, తిరిగి తెరుచుకునేందుకు అవకాశమిచ్చారు. రెండు వారాల క్రితం మాస్క్ తప్పనిసరిని తొలగించారు. దీంతో కేసులు పెరిగాయి. ఇప్పుడు మళ్లీ వాటిని అమలు చేశారు.
ప్రధాని మోడీ సూచనలు
ఇదిలా ఉండగా, ప్రధాని మోడీ జాతిని ఉద్దేశించి మాట్లాడుతూ కరోనాను ఎదుర్కోవడానికి నాలుగు సూచనలు చేశారు. కరోనా బారిన పడేందుకు ఎక్కువ ముప్పు ఉన్న వారిని గుర్తించి మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని, వైద్యులు, నర్సులు, ఆరోగ్య సిబ్బంది, వైద్యేతర కరనా యోధుల వంటి వారు ఈ కోవలోకి వస్తారు.
అలాగే టీకా ప్రతి ఒక్కరికి అందేలా చర్యలు తీసుకోవాలని, దేశంలో ఎక్కడ ఎవరు ఉన్నా ప్రతి ప్రాంతానికి వ్యాక్సీన్ సరఫరా కావాలన్నారు. టీకా పంపిణీకి అడ్డుపడేలా ఎలాంటి ఆంక్షలు ఉండవద్దన్నారు.
టీకా అందరికీ సరసమైన ధరల్లో అందేలా చూడాలన్నారు. అందుకు తగిన ఏర్పాట్లు చేయాలన్నారు.
వ్యాక్సీన్ ఉత్పత్తి నుండి పంపిణీ వరకు టెక్నాలజీ పరిజ్ఞానం సాయంతో నిత్యం పర్యవేక్షణ ఉండాలని, అందుకు తగిన విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. నిర్ణీత సమయంలో సమర్థంగా టీకాలు వేసేందుకు పలు సాంకేతిక సాధనాలు అందుబాటులోకి తీసుకు రావాలన్నారు.
బయటకు వెళ్లినప్పుడు మాస్క్ తప్పనిసరి అన్నారు.