ప్రధాని పన్నుల భారం వద్దన్నారు, వర్క్ ఫ్రమ్ హోంపై ఆ ఊరట లేదు
బడ్జెట్ పీపుల్ ఫ్రెండ్లీగా ఉండాలని, ప్రజలపై ఎలాంటి అదనపు పన్నులు వేయవద్దని ప్రధాని నరేంద్ర మోడీ తమకు స్పష్టం చేశారని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. మంగళవారం లోకసభలో బడ్జెట్ ప్రవేశ పెట్టిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. కరోనా పరిస్థితుల్లో గత బడ్జెట్ మాదిరి ఈ బడ్జెట్లోను పన్నుల భారం ఉండవద్దని సూచించినట్లు తెలిపారు. అందుకే ఈ బడ్జెట్లోను పన్నుపోటు లేదన్నారు. గత బడ్జెట్ సమయంలోను తమకు ఇదే చెప్పారన్నారు.
ఖర్చులు చేస్తున్నాం.. పన్ను భారం లేదు
కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి ప్రభుత్వం పెద్ద ఎత్తున ఖర్చులు చేస్తోందని, అందుకు అవసరమైన నిధులను సమకూర్చుకునేందుకు ప్రజలపై పన్నుల భారం మోపలేదని నిర్మలమ్మ అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో పన్నులు పెంచకపోవడమే మధ్య తరగతి వర్గాలకు ఊరట అన్నారు. కరోనా సమయంలో ఉద్యోగాలు పోయిన మాట వాస్తవమేనని, వివిధ పథకాల ద్వారా అలాంటి వారిని ఆదుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందన్నారు. నిరుద్యోగం, ద్రవ్యోల్భణ కట్టడికి చర్యలు తీసుకున్నామని చెప్పారు.
పన్ను భారం లేదు
బడ్జెట్లో ఆదాయ పన్ను భారం తగ్గేలా ప్రతిపాదనలు ఉంటాయని మిడిల్ క్లాస్ ఆశించింది. అయితే పన్ను శ్లాబ్లలో ఎలాంటి మార్పులు చేయలేదు. దీనిపై మీడియా ప్రశ్నించగా, నిర్మలమ్మ స్పందించారు. పన్నులు పెంచుతారేమోనని అంచనాలు పెట్టుకొని ఉంటే, నేను ఆ పని చేయలేదని, గత ఏడాది కూడా పన్ను రేట్లు పెంచలేదని గుర్తు చేశారు. అదనంగా పన్ను భారం ఒక్క రూపాయి మోపలేదన్నారు. ఎంఎస్ఎంఈ, అఫోర్డబుల్ హోమ్స్, సీనియర్ సిటిజన్స్, రిటైల్ ఇన్వెస్టర్లు వంటి వారి కోసం చాలా చేశామన్నారు.
స్టాండర్డ్ డిడక్షన్ ఊరట లేదు
ప్రస్తుత బడ్జెట్ పైన ఉద్యోగులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. శ్లాబ్ రేటు అంశం పక్కన పెడితే, ప్రస్తుత వర్క్ ఫ్రమ్ హోమ్ పరిస్థితుల్లో స్టాండర్డ్ డిడక్షన్, హోమ్ లోన్ వడ్డీ రేటు మినహాయింపు, పీఎఫ్ వడ్డీ రేటు మినహాయింపులో ఊరట ఉంటుందని భావించారు. కరోనా కారణంగా ఉద్యోగులు ఇంటి వద్ద ఉండి పని చేస్తున్నారు. ఇంటర్నెట్ బిల్లు, ఫర్నీచర్, విద్యుత్, మొబైల్ ఛార్జీలు పెరిగాయి. దీంతో స్టాండర్డ్ డిడక్షన్ పరిమితి పెంచే అవకాశాలు ఉన్నాయని భావించారు. కానీ ఎలాంటి ఊరట ప్రకటన రాలేదు.