స్వల్పంగా తగ్గిన పెట్రోల్-డీజిల్ ధరలు: గ్లోబల్ మార్కెట్లో దెబ్బ, భారత్లో భారీగా తగ్గాలి.. కానీ!
క్రూడాయిల్ ధరలు ఫిబ్రవరి 2016 స్థాయికి తగ్గిపోయాయి. దీంతో పెట్రోల్, డీజిల్ ధరలు కూడా తగ్గుముఖం పడుతున్నాయి. సౌదీ అరేబియా - రష్యా మధ్య ధరల యుద్ధం కొనసాగుతోంది. మరోవైపు, కరోనా వైరస్ కారణంగా గత కొద్ది రోజులుగా క్రూడాయిల్ ధరలు తగ్గుతున్నాయి. ఈ కారణంగా భారత్లో పెట్రోల్, డీజిల్ రేటు భారం కాస్త తగ్గుతోంది. మంగళవారం పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా 30 పైసలు, 25 పైసలు తగ్గింది.
Russia-Saudi price war: రష్యాతో సౌదీ ఆరామ్కో చమురు యుద్ధం, భారత్కు ఎప్పుడు, ఎలా ప్రయోజనం?
హైదరాబాద్ సహా వివిధ నగరాల్లో ధరల వివరాలు...
పెట్రోల్, డీజిల్ ధరలు ఈ వారంలో కాస్త తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఈ రోజు (మార్చి 10, 2020) ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.70.29, డీజిల్ రూ.63.01గా ఉంది. ముంబైలో లీటర్ పెట్రోల్ రూ.75.99, డీజిల్ రూ.65.97, చెన్నైలో లీటర్ పెట్రోల్ 73.02, డీజిల్ రూ.66.48, బెంగళూరులో లీటర్ పెట్రోల్ రూ.72.70, డీజిల్ రూ.65.16, హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ రూ.74.72, డీజిల్ రూ.68.60గా ఉంది.
ఎనిమిది నెలల తర్వాత తొలిసారి..
పెట్రోల్ ధరలు దాదాపు 8 నెలల తర్వాత మొదటిసారి రూ.71 దిగువకు పడిపోయాయి. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.71కి దిగువకు పడిపోవడం 2019 జూలై తర్వాత ఇదే మొదటిసారి. గత నెల (ఫిబ్రవరి) 27 నుంచి తగ్గుతూ వచ్చాయి.పెట్రోల్ ధరలు క్రమంగా తగ్గుతుండటం సామాన్యుడికి ఊరట కలిగించే అంశం.
తగ్గింపు ప్రభావం ఇప్పుడే ఉండదు..
పెట్రోల్, డీజిల్ ధరలు ఫిబ్రవరి 27వ తేదీ నుండి ఆదివారం నాటికి రూ.5 వరకు తగ్గాయి. డీజిల్ ధరలు 8-9 నెలల కనిష్టానికి చేరుకున్నాయి. రష్యా-సౌదీ చమురు ధరల యుద్ధం కారణంగా నిన్న ప్రపంచ మార్కెట్లు భారీగా పతనమయ్యాయి. చమురు ధరలు తగ్గిపోయాయి. అయితే ఈ తగ్గింపు ప్రభావం భారత్పై ఇప్పుడే ఉండదు.
కారణాలివే..
ప్రపంచ మార్కెట్లో బ్యారెల్ చమురు ధరలు ఒక్క రోజులోనే 30 శాతం పడిపోయాయి. కొద్ది రోజుల్లోనే ఏకంగా బ్యారెల్ 36 డాలర్లకు చేరుకుంది. ఈ ధరలు తగ్గినా భారత్లో ఇప్పుడే తగ్గక పోవడానికి పలు కారణాలు ఉన్నాయి. ఒకటి భారత ఆయిల్ మార్కెట్లు 15 రోజుల బెంచ్ మార్క్ ధరల సగటు ఆధారంగా నిర్ణయిస్తాయి. చమురు, కరెన్సీ మార్కెట్లో విపరీతమైన అస్థిరత నెలకొంది. కాబట్టి ఇంధన పెరుగుదల లేదా తగ్గుదల సంక్షోభం ఉన్న రోజులే ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు ఈ రోజు స్వల్పంగా పెరిగాయి. క్రూడాయిల్ ధరలు 32 డాలర్లకు వచ్చినా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గడం లేదని కాంగ్రెస్ విమర్శించడం గమనార్హం.
ఈ రోజు పెరిగిన ధరలు..
గ్లోబల్ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు నిన్న దాదాపు 30 శాతం పడిపోయాయి. కానీ ఈరోజు 6 శాతం పుంజుకున్నాయి. బ్రెంట్ క్రూడాయిల్ 2.36 డాలర్లు (6.9%) పెరిగి 36.72 డాలర్ల వద్ద ఉంది. వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియేట్ క్రూడ్ 1.87 డాలర్లు (6 శాతం) పెరిగి బ్యారెల్ 33 డాలర్లుగా ఉంది.
చమురు ధరల యుద్ధం వల్లే..
చమురు సరఫరా దేశాలైన సౌదీ నేతృత్వంలోని ఓపెక్, రష్యా మధ్య ధరల యుద్ధం కొనసాగుతోంది. దీంతో ప్రపంచ మార్కెట్లో ధరలు భారీగా పతనమయ్యాయి. 1991 గల్ఫ్ యుద్ధం తర్వాత ఇంతటి స్థాయిలో పతనం కావడంతో చమురు దిగుమతులపై ఎక్కువగా ఆధారపడే భారత్ వంటి దేశాలకు ప్రయోజనమే. అయితే ఇది సుదీర్ఘకాలం ఉంటే లాభం.