పేటీఎం ఢీలా, లిస్టింగ్ రోజే 26% పతనమైన షేర్: విజయ్ శేఖర్ శర్మ కన్నీళ్లు!
పేటీఎం మాతృసంస్థ వన్97 కమ్యూనికేషన్స్ షేర్ లిస్టింగ్ సమయంలోనే భారీగా నష్టపోయింది. దేశంలోనే ఇది అతిపెద్ద ఐపీవో. ఆరంభంలోనే ఢీలా పడింది. గురువారం ఈ సంస్థ లిస్టింగ్కు వచ్చింది. ఇష్యూ ధర కంటే 9 శాతం తక్కువతో ట్రేడింగ్ను ప్రారంభించింది. స్టాక్ మార్కెట్లో పేటీఎం షేర్ ఇష్యూ ధరను రూ.2150గా నిర్ణయించారు. ఈ రోజు ఎన్ఎస్ఈలో ఇష్యూ ధర కంటే 9 శాతానికి పైగా క్షీణించి రూ.1950 వద్ద లిస్ట్ అయింది. బీఎస్ఈలో కూడా తొమ్మిది శాతం మేర క్షీణించి రూ.1955 వద్ద ట్రేడింగ్ను ప్రారంభించింది. పేటీఎం షేర్లు ఓ సమయంలో 26 శాతం మేర క్షీణించాయి. ఉదయం గం.11 సమయానికి రూ.1671 వద్ద ట్రేడ్ అయిన పేటీఎం షేర్, మధ్యాహ్నం గం.2.45 సమయానికి మరింత క్షీణించి రూ.1567 వద్ద ట్రేడ్ అయింది. రోజులో ఎక్కువగా కిందకు పడిపోయింది. ఏ దశలోను కోలుకోలేదు. పైగా రూ.1,950.00 వద్ద ప్రారంభమై, రూ.1,955.00 వద్ద మాత్రమే గరిష్టాన్ని తాకింది. 1,562.10 వద్ద కనిష్టాన్ని తాకింది. కనీసం రూ.2000 సమీపానికి కూడా చేరుకోలేదు.
అతిపెద్ద ఐపీవో కానీ
రూ.18,300 కోట్ల భారీ సమీకరణ లక్ష్యంతో వచ్చిన పేటీఎం ఐపీవోకు లభించిన సబ్స్క్రిప్షన్ స్పందన అంతంత మాత్రమే. ఈ ఐపీఓకు 1.89 రెట్లు అధికంగా బిడ్డింగ్స్ వచ్చాయి. కేవలం భారత్లోనే కాదు ఆసియా పసిఫిక్ ప్రాంతంలో ఇది అతిపెద్ద ఐపీఓ. పేటీఎం కంటే ముందు 2010లో కోల్ ఇండియా రూ.15,200 కోట్ల అతిపెద్ద ఐపీవోతో వచ్చింది. పేటీఎం మాతృసంస్త వన్97 కమ్యూనికేషన్ 2000లో ప్రారంభమైంది. మొదట మొబైల్ టాప్-అప్స్, బిల్లు చెల్లింపులు సేవలను అందించింది. 2009లో డిజిటల్ చెల్లింపుల కోసం పేటీఎం మొబైల్ యాప్ను ప్రారంభించింది. ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ విజయ్ శేఖర్ శర్మ పేటీఎంను 2010లో మొబైల్ రీచార్జ్ కోసం ఈ ప్లాట్ఫాంను తీసుకు వచ్చారు. అప్పటి నుండి విశేష ఆదరణ లభించింది. పేటీఎంకు 333 మిలియన్లకు పైగా కస్టమర్లు ఉన్నారు. 21 మిలియన్లకు పైగా లిస్టెడ్ వ్యాపారులు ఉన్నారు. కంటర్ బ్రాండ్జ్ ఇండియా 2020 నివేదిక ప్రకారం పేటీఎం బ్రాండ్ వ్యాల్యూ 6.3 బిలియన్ డాలర్లు. ప్రతి సంవత్సరం 114 మిలియన్ల మంది ఇందులో ట్రాన్సాక్షన్స్ నిర్వహిస్తున్నారు.
మార్కెట్ క్యాప్ రూ.1 లక్ష కోట్లు
పేటీఎం షేర్లు నష్టాల్లో ఉన్నప్పటికీ ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1 లక్ష కోట్లకు పైగా ఉంది. పేటీఎం అధిక షేర్ వ్యాల్యూయే తక్కువ స్పందనకు కారణమని నిపుణులు చెబుతున్నారు. పేటీఎం ఫ్రెష్ ఇష్యూ రూ.8300 కోట్లు, ఆఫర్ ఫర్ సేల్ ద్వారా రూ.10,000 కోట్ల సమీకరణ లక్ష్యంతో ఐపీవోకు వచ్చింది. రూ.8235 కోట్ల షేర్లు 100 ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్టర్లకు కేటాయించారు. 122 మంది ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఆసక్తి చూపారు. రూ.2150 వద్ద 3.83 కోట్ల షేర్లు కొనుగోలుకు మొగ్గు చూపారు.
విజయ్ శేఖర్ శర్మ ఉద్వేగం
పేటీఎం ఫౌండర్ విజయ్ శేఖర్ శర్మ ఓ స్కూల్ టీచర్ తనయుడు. ఇప్పుడు బిలియనీర్గా నిలిచారు. ఫోర్బ్స్ ప్రకారం అతని సంపద 2.4 బిలియన్ డాలర్లు. పేటీఎం లిస్టింగ్ సమయంలో శర్మ ఉద్వేగానికి గురయ్యారు. ఇంగ్లీష్ మీడియాలో వచ్చిన కథనాల ప్రకారం అతను కన్నీళ్ల పర్యంతమయ్యారు. యువ భారతం ఆశలు, ఆకాంక్షలను తాను స్టాక్ మార్కెట్కు తీసుకు వెళ్తున్నట్లుగా ఉందని, పదకొండేళ్లలో కోల్ నుండి ఫిన్ టెక్ వరకు భారత్ ఎంతో మార్పు చెందిందని, ప్రతి పేటీఎం వినియోగదారు భారత్ మార్పులో భాగస్వామి అయ్యారని పేర్కొన్నారు.