కరోనా దెబ్బ... ఓయోలో 5,000 ఉద్యోగాలు ఉఫ్!
కరోనా వైరస్ చైనా సహా ప్రపంచాన్ని మొత్తం వణికిస్తోంది. గత మూడు నెలలుగా చైనా ఒంటరి పోరాటమే చేస్తోంది. అయితే, ఇటీవల గత 15 రోజులుగా కరోనా మహమ్మారి ఆఫ్రికా మినహా దాదాపు అన్ని ఖండాలను చుట్టేసింది. ఈ నేపథ్యంలో దేశాల మధ్య రాకపోకలు స్తంభించిపోయాయి. వ్యాపారాలు దెబ్బతింటున్నాయి. ట్రావెల్ అడ్వైజరీలు, హెల్త్ ఎమర్జెన్సీ ల రూపంలో దాదాపు అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలపై వ్యతిరేక ప్రభావం కనిపిస్తోంది. ఇక మన దేశం నుంచి సుమారు 80 దేశాలకు విస్తరించి అతి తక్కువ కాలంలోనే ఇండియన్ ఎం ఎన్ సి గా అవతరించిన స్టార్టుప్ కంపెనీ ఓయో రూమ్స్ పై అధిక ప్రభావం పడుతోంది. ముఖ్యంగా దీని కార్యకలాపాలు ఆతిథ్య రంగంలో ఉండటం, నేరుగా ట్రావెల్, టూరిజం తో అనుసంధానమై ఉండటంతో ఓయో పై ప్రతికూల ప్రభావం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో కంపెనీ కరోనా ప్రభావిత దేశాల్లో తన కార్యకలాపాలను పునర్వ్యవస్థీకరించే పనిలో పడ్డట్లు తెలుస్తోంది. చైనా తో ఈ పనిని మొదలు పెట్టినట్లు సమాచారం.
కరోనా వైరస్ ప్రభావం.. మరిన్ని బిజినెస్ న్యూస్
చైనా లో సగం ఉద్యోగాల కోత ...
కరోనా మహమ్మారి దెబ్బకు చైనా లో ఇప్పటికే సుమారు 3,000 మంది మరణించారు. మరో 80,000 మందికి పైగా ఈ వైరస్ సోకి హాస్పిటల్స్ లో చికిత్స పొందుతున్నారు. దీంతో కరోనా బహిర్గతమైన ఉహాన్ నగరం మాత్రమే కాకుండా దాదాపు అన్ని ప్రధాన నగరాల్లోనూ ప్రజలు వణికిపోతున్నారు. కంపెనీల కార్యకలాపాలు దెబ్బతింటున్నాయి. ప్రజలు అధిక భాగం ఇంటికే పరిమితమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఓయో రూమ్స్ చైనా లో తన కార్యకలాపాలను పునర్వ్యవస్థీకరిస్తోంది. ఇందులో భాగంగా సుమారు 3,000 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతోంది. ఈ విషయాన్ని ప్రముఖ వార్తా ఏజెన్సీ బ్లూమ్బెర్గ్ ఒక ప్రత్యేక కథనంలో వెల్లడించింది. చైనా లో ఓయో రూమ్స్ కు సుమారు 6,000 మంది పెర్మనెంట్ ఎంప్లాయిస్ ఉన్నారు. కానీ ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా.. అక్కడ పెద్ద ఎత్తున ఉద్యోగులను తీసేయాల్సి వస్తున్నట్లు సమాచారం. ఇండియా తర్వాత ఓయో కు చైనా నే కీలక మార్కెట్ గా ఉన్న విషయం తెలిసిందే.
మొత్తం 5,000 మందికి ఉద్వాసన...
ప్రస్తుతం ఓయో రూమ్స్ కు ప్రపంచ వ్యాప్తంగా సుమారు 30,000 మంది ఉద్యోగులు ఉన్నారు. వారిలో సుమారు 17% మందికి ఉద్వాసన పలకాలని కంపెనీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా తొలుత సుమారు 5,000 మంది ఉద్యోగులకు పింక్ స్లిప్స్ ఇస్తున్నట్లు సమాచారం. అయితే, ఈ ప్రక్రియ లాభదాయకతతో కూడిన వృద్ధి కోసమే చేపడుతున్నట్లు ఓయో ఫౌండర్ రితేష్ అగర్వాల్ ఒక ఇంటర్వ్యూ లో చెప్పినట్లు బ్లూమ్బెర్గ్ పేర్కొంది. 2020 ఓయో లో కేవలం 25,000 మంది ఉద్యోగులు ఉంటారని అయన తెలిపారని వార్తా సంస్థ వెల్లడించింది. ఇదిలా ఉండగా పేరుకు పునర్వ్యవస్థీకరణ అయినప్పటికీ కరోనా ప్రభావం దీనిపై అధికంగా ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.
10 బిలియన్ డాలర్ల కంపెనీ...
2013 లో ఏర్పాటైన ఓయో రూమ్స్.. ప్రస్తుతం 10 బిలియన్ డాలర్ల వాల్యుయేషన్ కలిగి ఉంది. ఈ విషయంలో ప్రపంచంలోని అతి కొద్ది విజయవంతమైన స్టార్టుప్ కంపెనీల్లో ఒకటిగా ఓయో నిలుస్తోంది. జపాన్ కు చెందిన ప్రముఖ ప్రైవేట్ ఈక్విటీ కంపెనీ సాఫ్ట్ బ్యాంకు ఓయోలో అతిపెద్ద ఇన్వెస్టర్ గా ఉంది. అలాగే సాఫ్ట్ బ్యాంకునకు ఉన్న పోర్ట్ ఫోలియో కంపెనీల్లో కూడా ఓయో రూమ్స్ అతి పెద్దది కావటం విశేషం. అయితే, కొంత కాలంగా ఓయో రూమ్స్ తన హోటల్ పార్టనర్స్ కు సమయానికి డబ్బులు చెల్లించటం లేదని వార్తలు వెలువడుతున్నాయి. దీంతో అవి నెట్వర్క్ నుంచి బయటకు వెళుతున్నాయని సమాచారం. ఓయో కు భారీగా నష్టాలు వస్తుండటంతో అది తన పార్టనర్స్ కు సమయానికి చెల్లింపులు చేయలేకపోతోందని మార్కెట్ వర్గాల సమాచారం. అయితే, హోటల్ పార్టనర్స్ తో సత్సంబంధాలు ఏర్పరచుకోవడం, మెరుగైన కార్పొరేట్ గవర్నెన్స్ పాటించటం తమ లక్ష్యంగా ఉందని ఓయో ఫౌండర్ రితేష్ అగర్వాల్ చెబుతుండటం గమనార్హం.