ఇండియాకు పెను కుదుపు, ఆ రంగంలో 20 లక్షల ఉద్యోగాలకు ముప్పు
కరోనా మహమ్మారి వివిధ రంగాలపై ప్రభావం చూపిస్తోంది. ఎక్కువగా విమాయానం, పర్యాటకం, రెస్టారెంట్ రంగాలపై భారీ ప్రభావం చూపిస్తోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా విమానాలు ఎక్కడికి అక్కడ నిలిచిపోయాయి. ఉద్యోగులు ఇంటికే పరిమితమయ్యారు. కొన్ని కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తే, మరికొన్ని కంపెనీలు వేతనాన్ని కట్ చేశాయి. కరోనా ప్రభావం భారత విమాన రంగంపై దారుణమైన ప్రభావం చూపించనుందని గ్లోబల్ ఎయిర్ లైన్స్ గ్రూపింగ్ IATA వెల్లడించింది
ఇళ్లు కొనాలనుకుంటున్నారా.. అదిరిపోయే న్యూస్
20 లక్షల ఉద్యోగాలు పోవచ్చు
కరోనా కారణంగా విమానయానం, అనుబంధ రంగాల్లో 20 లక్షలకు పైగా ఉద్యోగాలకు ముప్పు ఉన్నదని IATA అంచనా వేసింది. ఇప్పటికే 11 వేలమందికి పైగా ఉపాధి కోల్పోయారని తెలిపింది. ప్రయాణికుల డిమాండ్ 36% క్షీణించడంతో ఆదాయాలు 880 కోట్ల డాలర్లు లేదా రూ.66 వేల కోట్లు పడిపోతాయని అంచనా వేసినట్లు IATA ఆసియా పసిఫిక్ ప్రాంత అసిస్టెంట్ డైరెక్టర్ ఆల్బర్ట్ జోయెంగ్ అన్నారు.
విమానరంగానికి పెద్ద కుదుపు
కరోనా కారణంగా భారీ సంక్షోభంలో ఉన్న విమానరంగాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు ఆ రంగానికి కొత్త రుణాలు, రుణ గ్యారంటీలు, కార్పొరేట్ బాండ్ మార్కెట్కు వెళ్లడానికి అనుమతి వంటి ప్రోత్సాహకాలు కల్పించాలని సూచించారు. పన్ను మినహాయింపులు, ప్రోత్సాహకాలతోపాటు ఏరోనాటికల్ ఛార్జీలు పూర్తిగా లేదంటే పాక్షికంగా రద్దు చేయాలని కేంద్రానికి సూచించారు. దేశీయ విమానయాన రంగాన్ని కరోనా కుదిపేస్తోందని తెలిపారు.
వేతనాలు లేక.. ఉద్యోగాల కోత
కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు కేంద్రం లాక్ డౌన్ను మే 3వ తేదీ వరకు పొడిగించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆదాయాలు లేక ఈ రంగంలోని సంస్థలు ఉద్యోగులకు వేతనాలు చెల్లించడం సవాల్గా మారిందని IATA తెలిపింది. వేతనాల్లో కోత, ఉద్యోగాల తొలగింత వరకు వెళ్లిందని ఆందోళన వ్యక్తం చేసింది. ఇప్పటికే చాలా సంస్థలు వేతనాలులేని సెలవులు ఇచ్చాయని గుర్తుచేసింది. ప్రస్తుతం కార్గో విమానాలు మినహా ప్యాసింజర్ విమానాల కార్యకలాపాలు లేవు.
రూ.70వేల కోట్ల ఆదాయం కోల్పోయింది
లాక్ డౌన్ కారణంగా విమానయాన రంగానికి రూ.70వేల కోట్ల మేరకు నష్టం వాటిల్లిందని అంచనా వేస్తోంది. ప్యాసింజర్ డిమాండ్ 36% పడిపోయింది. ఈ క్రమంలో లక్షల ఉద్యోగాలు ప్రమాదంలో పడ్డాయని తెలిపింది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలని IATA కోరింది.
రూ.3.77 కోట్లు నష్టం
కరోనా కారణంగా విమానయాన రంగానికి నిమిషానికి రూ.3.77 కోట్ల నష్టం వాటిల్లినట్లు IATA తెలిపింది. గత నెల 42,94,685 విమానాలు తిరిగినట్లుగా గుర్తించారు. గత ఏడాది మార్చితో పోలిస్తే ఇది 21.9% తక్కువ. వాణిజ్య విమానాల విషయంలో ఈ తగ్గుదల 27.7% నమోదయ్యాయి. మొత్తంగా పరిశ్రమ 314 బిలియన్ డాలర్ల ఆదాయం కోల్పోయింది. మార్చి చివరి వారంలో ప్రారంభమైన నష్టం ఈ ప్రభావం ఏప్రిల్ ప్రథమార్థం కొనసాగింది. లాక్ డౌన్ కొనసాగింపు నేపథ్యంలో ఇంకా కొనసాగుతోంది.