భారత్ ఉల్లి ఎఫెక్ట్, బంగ్లాదేశ్లో భారీగా పెరిగిన ధరలు
భారత్ ఉల్లి ఎగుమతులను నిషేధించడంతో ఇతర దేశాలపై ప్రభావం పడింది. బంగ్లాదేశ్లో ఉల్లి ధరలు ఏకంగా 50 శాతం పెరిగాయి. భారత్ ఎక్కువగా ఉల్లిని బంగ్లాదేశ్కు సరఫరా చేస్తుంది. భారీ వర్షాలు, పంటనష్టం, ధరలు పెరగడం, చాలాచోట్ల కొరత వంటి వివిధ కారణాలతో కేంద్రప్రభుత్వం నిన్న కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. విదేశాలకు అన్ని రకాల ఉల్లి ఎగుమతులపై తాత్కాలిక నిషేధం విధించింది. కేంద్ర వాణిజ్య మంత్రిత్వశాఖ పరిధిలోని డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డీజీఎఫ్టీ) విభాగం ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.
మూడేళ్లలో సగానికి పైగా తగ్గిన చైనా పెట్టుబడులు, కంపెనీలు స్వాధీనం చేసుకోకుండా...
అన్ని వంటల్లో ఉల్లిని
బంగ్లాదేశ్లో ఉల్లి ధరలు మంగళవారం 50 శాతం పెరిగాయి. ఎగుమతులను నిషేధించడం వల్ల దేశంలో ఉల్లి ధరలు నిలకడగా ఉండటం లేదా తగ్గుముఖం పడతాయి. అయితే భారత్ నుండి ఎగుమతులు లేకపోవడంతో బంగ్లాతో పాటు మలేషియా, నేపాల్, శ్రీలంకలలో ధరలు పెరుగుతున్నాయి. ఆసియా దేశాల్లో అన్ని వంటల్లో ఉల్లిని ఎక్కువగా ఉపయోగిస్తారు. ఢాకాలో కిలో ఉల్లి ధర 1.06 డాలర్ల నుండి 1.18 డాలర్ల వరకు పలికింది. అంటే 90 టాకాల నుండి 100 టాకాల వరకు పలికింది. పొరుగున ఉన్న బంగ్లాదేశ్కు ప్రతి సంవత్సరం సగటున 3,50,000 టన్నుల ఉల్లిని ఎగుమతి చేస్తుంది భారత్. 2019లో ఇలాంటి పరిస్థితుల్లోనే ఉల్లి ధర 250 టాకాలు పలికింది. ఈ పరిస్థితుల్లో సరఫరా కోసం బంగ్లాదేశ్ ఇతర దేశాల వైపు చూస్తోంది. ఉల్లిని అతి తక్కువ సమయంలో దిగుమతి చేసుకోవడమే తమ లక్ష్యమని బంగ్లాదేశ్ మంత్రి ఒకరు చెప్పారు. టర్కీ, ఇతర దేశాల నుండి 1,00,000 టన్నులు దిగుమతి చేసుకుంటామన్నారు.
అందుకే ఉల్లి ఎగుమతులపై నిషేధం
ఉల్లి ఎగుమతులపై నిషేధం విధించడానికి కారణాలు ఉన్నాయి. ఉల్లి హోల్ సేల్ ధరల్లో స్థిరమైన పెరుగుదల ఉంది. మార్చి నుండి సెప్టెంబర్ మధ్య లాసల్గావ్లో ధర 100 శాతం పెరిగింది. నాసిక్ జిల్లా నిఫడ్ తాలుకాలో ఉల్లి ధర మార్చిలో క్వింటాల్కు రూ.1500 ఉండగా, ఇప్పుడు రూ.3000కు చేరుకుంది. జూన్ నెలలో కిలో రూ.25 నుండి రూ.30 ఉండగా, ఇప్పుడు రూ.35 నుండి రూ.40కి చేరుకుంది. అంతకుముందు నెలలో ద్రవ్యోల్భణం 6.73 శాతం ఉండగా, గత నెలలో 6.69 శాతంగా ఉంది. ఆర్బీఐ టార్గెట్ 6 శాతానికి మించింది. ఆగస్ట్లో వినియోగదారుల ఆహార సూచీ 9.05గా ఉంది. అంతకుముందు 9.27గా ఉంది. భారీ వర్షాలు కారణంగా పంట నష్టంతో ఉల్లి ధరలు పెరగకుండా అదుపులో ఉంచేందుకు కేంద్రం తాజా నిర్ణయం తీసుకుంది.
పాక్ వంటి దేశాలకు ప్రయోజనమా?
ఉల్లి ఎగుమతులపై నిషేధం అనంతరం దేశంలోని అతిపెద్ద ఉల్లి మార్కెట్ మహారాష్ట్ర లాసాల్గావ్ మార్కెట్లో కిలో ధర రూ.30కి చేరుకుంది. మార్చిలో ఉన్న ధరతో ఇది రెండింతలు. మధ్యప్రదేశ్, గుజరాత్, కర్నాటక, మహారాష్ట్ర సహా వివిధ రాష్ట్రాల్లో భారీ వర్షాల కారణంగా పంట కొట్టుకుపోయింది. తమ ఉత్పత్తులకు మెరుగైన ధర లభిస్తుందని రైతులు భావించారు. ఉల్లి నిషేధంపై శరద్ పవార్ స్పందిస్తూ.. గల్ఫ్ దేశాలు, శ్రీలంక, బంగ్లాదేశ్ వంటి ఇతర దేశాలకు ఉల్లి ఎగుమతులను నిషేధిస్తే మన దేశానికి బదులు పాకిస్తాన్ నుండి దిగుమతులు పెంచుకునేందుకు ఆ దేశాలకు వెసులుబాటు కలిగి, పాక్ వంటి దేశాలకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. లాసాల్గావ్ మార్కెట్లో జూన్ నెలలో ఉల్లి ధర కిలో రూ.20 కాగా, ఇప్పుడు రూ.35 నుండి రూ.40 మధ్య ఉంది.