ప్రపంచంలో అతిపెద్దది.. హైదరాబాద్లో వన్ప్లస్ ఎక్స్పీరియన్స్ స్టోర్
చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీ వన్ ప్లస్ బుధవారం హైదరాబాద్ సిటీలో అతిపెద్ద ఎక్స్పీరియన్స్ స్టోర్ను ప్రారంభించింది. హిమయత్ నగర్లో ఏర్పాటైన ఈ స్టోర్ ఈ కంపెనీకి ప్రపంచవ్యాప్తంగా చూసినా పెద్దది. వన్ ప్లస్ నిజామ్ ప్యాలెస్ పేరుతో 16,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో దీనిని ఏర్పాటు చేసింది. ఇందులో అతిపెద్ద కస్టమర్ సర్వీస్ సెంటర్ ఉంది. కస్టమర్లు కన్సల్ట్ సర్వీస్ ప్రతినిధులను కలిసేందుకు వీలుగా దీనిని తీర్చిదిద్దారు. కస్టమర్లకు ఇందులో అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశారు. గ్లాస్ క్యూబికల్స్తో కూడి ఉంది.
గుడ్న్యూస్: బ్యాంకు సర్వీస్ ఛార్జీలు పెరగవు.. ఇప్పట్లో పెరగవు కూడా
కొత్తగా లాంచ్ చేసిన వన్ ప్లస్ 8T
వన్ ప్లస్ ఇండియా దేశవ్యాప్తంగా వన్ ప్లస్ స్టోర్స్ విస్తరణ కోసం రూ.100 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించింది. వచ్చే ఏడాది నాటికి 100 నగరాలకు సేవలు విస్తరించాలని భావిస్తోంది. ఆఫ్ లైన్ స్టోర్స్ను 8వేలకు పెంచనున్నారు. వన్ ప్లస్ ఫోన్లను దేశీయంగా తయారు చేస్తున్నామని, టీవీలను వచ్చే జనవరి నుండి ఇక్కడే తయారు చేస్తామని తెలిపింది. కొత్తగా లాంచ్ చేసిన వన్ ప్లస్ 8T 5G స్మార్ట్ ఫోన్ను నేటి నుండి (నవంబర్ 5) అందుబాటులో ఉంచింది.
భారత్తో అనుబంధం బలపడుతోంది
వన్ ప్లస్ ఎక్స్పీరియన్స్ స్టోర్ ప్రారంభం సందర్భంగా వన్ ప్లస్ ఇండియా జనరల్ మేనేజర్ వికాస్ అగర్వాల్ మాట్లాడుతూ... భారత్లో దీర్ఘకాల వృద్ధికి కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. దేశంలో తమ మొట్టమొదటి ఆర్ అండ్ డీ కేంద్రాన్ని లాంచ్ చేయడానికి హైదరాబాద్ను ఎంచుకున్నామని, ఇప్పుడు అతిపెద్ద ఎక్స్పీరియెన్స్ స్టోర్ను ప్రారంభించామన్నారు. భారత్తో తమ అనుబంధం బలపడుతోందన్నారు. ప్రస్తుతం దేశంలో 5000కు పైగా ఆఫ్ లైన్ స్టోర్స్ ఉన్నాయి.
వినియోగం, టెక్నాలజీని వివరించేందుకు ఎగ్జిక్యూటివ్స్
ఈ ఎక్స్పీరియన్స్ సెంటర్లో స్మార్ట్ ఫోన్ వినియోగంలోని సౌకర్యాలను, టెక్నాలజీని కస్టమర్లకు వివరించేందుకు ఎగ్జిక్యూటివ్లను నియమించారు. ఆన్లైన్ మార్కెట్తో పాటు సంప్రదాయ మార్కెట్లో బలంగా నిలబడాలనే లక్ష్యంలో భాగంగా ఈ భారీ స్టోర్ను అందుబాటులోకి తెచ్చినట్లు వన్ ప్లస్ తెలిపింది. ప్రభుత్వ ప్రోటోకాల్కు అనుగుణంగా కఠినమైన భద్రత, పరిశుభ్రమైన పద్ధతులను స్టోర్లో అమలు చేశారు. కరోనా స్టోర్ నేపథ్యంలో పరిసరాల్లో శానిటైజేషన్, సోషల్ డిస్టెన్స్ నిబంధనలు, తరుచూ ఉద్యోగుల టెంపరేచర్ చెకింగ్ వంటివి చేపడుతున్నారు.