OECD Secretary: 'ప్రపంచ దేశాలను ఏకతాటిపైకి తీసుకురాగల సత్తా భారత్ సొంతం'
మాంద్యం, సంక్షోభాలు, రీగ్లోబలైజేషన్, ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కొవిడ్ ఉక్రెయిన్ యుద్ధం పరిణామాలు, వస్తు సరఫరాలో సవాళ్లపై ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కో-ఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ (ఓఈసీడీ) సెక్రటరీ జనరల్ మాథియాస్ కోర్మాన్ మాట్లాడారు. అభివృద్ధిలో పటిష్ఠంగా ఉన్న భారత్.. ప్రపంచ దేశాలను ప్రభావితం చేసే స్థాయిలో ఉందని కొనియాడారు. నిన్న స్విట్జర్లాండ్లోని దావోస్లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ వార్షిక సమావేశానికి హాజరై.. ఓ ఇతర ప్రత్యేక సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు.
దూసుకుపోతున్న భారత్..
''భారత్ చాలా బలంగా ఎదుగుతోంది. భవిష్యత్తులో కొంతమేర వృద్ధి మందగిస్తుందని మేము భావిస్తున్నాము. అంతర్జాతీయ ప్రమాణాలతో పోలిస్తే మాత్రం ఇప్పటికీ దూసుకుపోతోంది. భవిష్యత్తులోనూ ఇదే వేగంతో ముందుకు వెళ్తుందని నా అభిప్రాయం. G20 దేశాల్లో భారత్ చాలా కీలకం. ప్రపంచ స్థాయిలో ఏ మార్పును తీసుకురావాలన్నా ఇండియా నడుం బిగిస్తే సాధించుకునే అవకాశం ఉంది. సమస్యలు, సవాళ్ల పరిష్కారానికి ప్రపంచాన్ని ఏకతాటిపైకి తీసుకురాగలదు"అని కార్మాన్ వ్యాఖ్యానించారు.
వందేళ్లలో చూడని సంక్షోభం:
ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (ఐఎంఎఫ్), వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (డబ్ల్యూఈఎఫ్) లాగా మాంద్యం గురించి ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కో-ఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ (ఓఈసీడీ) అంచనా వేయలేదని కోర్మాన్ అన్నారు . ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభం నుంచి ఇంధన ధరలు, ఆహార సరఫరా, ద్రవ్యోల్బణంలో చోటుచేసుకున్న తీవ్ర పరిస్థితులను చూస్తుంటే మాంద్యం తప్పదని అనిపిస్తున్నట్లు పేర్కొన్నారు. వందేళ్లుగా చూడని దారుణ స్థితిలోకి కొవిడ్ సంక్షోభం ప్రపంచాన్ని నెట్టిందన్నారు.
డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో డేటానే కీలకం:
పలు దేశాల వృద్ధి అంచనాలను ప్రపంచ బ్యాంకు తగ్గించడం గురించిన ప్రశ్నించగా.. పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని సమర్థవంతంగా ఎదుర్కొంటూ, వివిధ రంగాలకు ఆర్థిక సహాయం అందించడం ద్వారా వృద్ధి సాధించడానికి ప్రయత్నించాలని సూచించారు. సమాచార మార్పిడి గురించి ప్రస్తావిస్తూ.. ప్రభుత్వం, ప్రైవేట్ కంపెనీల మధ్య నమ్మకంతో వ్యాపారాలు జరగాలన్నారు.
తద్వారా పౌరుల వ్యక్తిగత సమాచారాన్ని ఎటువంటి ఇబ్బందీ లేకుండా ప్రభుత్వమూ వినియోగించుకోవచ్చని తెలిపారు. పూర్తిస్థాయి డిజిటల్ ఆర్థిక వ్యవస్థ నిర్మాణంలో డేటా కీలకంగా మారనుందని పేర్కొన్నారు. సమాచారాన్ని స్థానికంగా భద్రపరచడంపై భారత్ ఉదారంగా వ్యవహరిస్తేనే డేటా పరిమితులపై తమ సంస్థ ఇచ్చిన ర్యాంకింగ్ను ఇండియా మెరుగుపరచుకోగలదని అభిప్రాయపడ్డారు.