మార్చి 31 గడువు: పాన్-ఆధార్ కార్డ్ లింక్ కోసం మరో వారం రోజులే గడువు
పర్మినెంట అకౌంట్ నెంబర్ (PAN) కార్డును, ఆధార్ కార్డును మార్చి 31 తేదీ లోపు లింక్ చేసుకోవడం తప్పనిసరి. పాన్-ఆధార్ను మరో ఐదు రోజుల్లో లింక్ చేయకుంటే రూ.1000 వరకు జరిమానా పడే అవకాశాలు ఉన్నాయి. అంతేకాదు, మీ పాన్ కార్డు కూడా చెల్లకుండా పోతుంది. ఈ మేరకు మంగళవారం ఫైనాన్స్ బిల్ 2021 సందర్భంగా ప్రభుత్వం దీనిని పేర్కొంది.
ప్రభుత్వం కొత్త సెక్షన్ (సెక్షన్ 234H)ను ఇన్కం ట్యాక్స్ యాక్ట్, 1961లో ఇన్సెర్ట్ చేసింది. మార్చి 31, 2021 నాటికి పాన్-ఆధార్ లింక్ చేయకుంటే పెనాల్టీ ఉంటుందని పేర్కొంది. గరిష్టంగా పెనాల్టీ రూ.1000 వరకు ఉంటుందని పేర్కొనడంతో పాటు పాన్ కూడా ఏప్రిల్ 1వ తేదీ నుండి చెల్లదని పేర్కొంది.
పాన్-ఆధార్ లింకింగ్ గడువును కేంద్ర ప్రభుత్వం పలుమార్లు పొడిగించింది. ఇప్పటికే చాలాసార్లు పొడిగించినందున మరోసారి పొడిగించే అవకాశాలు కనిపించడం లేదు. కాబట్టి ఎవరైనా పాన్-ఆధార్ లింక్ చేయకుంటే ఈ 31వ తేదీ లోపు చేసుకోవాలి. ఏప్రిల్ 1వ తేదీ నుండి పాన్ కార్డు చెల్లకుంటే మరిన్ని సమస్యలు వస్తాయి. అప్పుడు ఆదాయపు పన్ను ఫైల్ చేయడం ఇబ్బందికరం. నాన్-కాంప్లియెన్స్కు అధిక ఫైన్ ఉంటుంది.
ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయడానికి ఆధార్ నెంబర్ను తప్పనిసరిగా పేర్కొనవలసి ఉంటుంది. ఇన్-ఆపరేటివ్ పాన్ కార్డు కారణంగా అధిక టీడీఎస్ రేటును ఎదుర్కోవాల్సి ఉంటుందని ట్యాక్స్ నిపుణులు చెబుతున్నారు. ఆదాయపు పన్ను శాఖ యాక్ట్ ప్రకారం పాన్ నెంబర్ ఇవ్వని లేదా పని చేయని పాన్ వివరాలను ఇచ్చే వ్యక్తికి అధిక టీడీఎస్ లేదా టీసీఎస్ వర్తిస్తుంది.