బాయ్కాట్ చైనా దెబ్బ: శాంసంగ్కు కలిసొచ్చిన యాంటీ చైనా సెంటిమెంట్!
మన సరిహద్దుల్లో చైనా కుయుక్తుల నేపథ్యంలో భారతీయులు పెద్ద ఎత్తున డ్రాగన్ ఉత్పత్తులను బహిష్కరణ కోసం ఉద్యమిస్తున్నారు. ప్లాస్టిక్ వస్తువుల నుండి మొబైల్ ఫోన్స్ వరకు ఇప్పుడు చాలామంది తొలుత మేడిన్ ఇండియా వస్తువులకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆ తర్వాత ఇతర దేశాల వస్తువుల కోసం చూస్తున్నప్పటికీ, తప్పనిసరి అయితేనే చైనా వస్తువుల వైపు మొగ్గు చూపేవారు చాలామంది కనిపిస్తున్నారు. వివిధ వస్తువుల కోసం రిటైల్ షాప్స్కు వెళ్తున్న చాలామంది మేడిన్ చైనా చూపించవద్దని చెబుతున్నారు.
తప్పనిసరి అయితేనా చైనీస్ వస్తువు
సాధారణంగా మన దేశంలోని టాప్ 5 మొబైల్ కంపెనీల్లో మూడో స్థానంలో ఉన్న శాంసంగ్ మినహా మిగతా నాలుగు చైనా కంపెనీలే. ఇందులో షియోమీ మొదటి స్థానంలో ఉంది. మన మొబైల్ మార్కెట్లో చైనీస్ వాటా 75 శాతం వరకు ఉంది. అయినప్పటికీ ప్రస్తుతం మొబైల్స్ విషయంలోను చైనా మొబైల్స్ వద్దని చాలామంది చెబుతున్నారట. ఈ మేరకు స్వయంగా ఆల్ ఇండియా మొబైల్ రిటైలర్స్ అసోసియేషన్ (AIMRA) జాతీయ అధ్యక్షుడు అరవింద్ ఖురానా వెల్లడించారు. చాలామంది చైనా వస్తువులు లేదా మొబైల్స్ చూపించవద్దని కోరుతున్నారని ఖురానా అన్నారు. చైనా వస్తువులు కాకుండా కాస్త ఖరీదైనా పర్లేదు ఇతర వస్తువులు చూపించమని చెబుతున్నారట. ఖరీదైన మొబైల్స్ విషయంలోనే ఇలా కాదు. ఇతర రిటైలర్స్ షాపుల్లోను అదే పరిస్థితి ఉంది. తప్పనిసరి అయితే తప్ప చైనీస్ వస్తువులు ముట్టుకోవడానికి చాలామంది ఆసక్తి చూపించడం లేదట.
బాయ్కాట్ చైనా దెబ్బ.. శాంసంగ్కు కలిసొచ్చింది
చాలామంది కస్టమర్లు చైనా మొబైల్స్ను చూపించవద్దని కోరుతున్నారని, దీంతో నాన్-చైనీస్ బ్రాండ్ శాంసంగ్ వంటి వాటికి డిమాండ్ పెరిగిందంటున్నారు. అయితే ఇలాంటి వైఖరి ద్వారా మన భారతీయ కంపెనీలకు ప్రయోజనం చేకూరితే బాగుంటుందని చాలామంది భావిస్తున్నారు. ఇలా అయితే మన దేశ కంపెనీలు బాగుపడి, మన దేశంలో ఉద్యోగాలు పెరుగుతాయి. కేవలం చైనా కాదని, వివిధ రంగాల్లో మన ఉత్పత్తులు పెరగాలని, ఇందుకు చైనా ప్రభుత్వం వలే మన ప్రభుత్వం కూడా మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు. మన దేశంలో టాప్ 5 మొబైల్ కంపెనీల్లో 4 చైనావే. సౌత్ కొరియాకు చెందిన శాంసంగ్ మాత్రమే 15.6 శాతం షిప్మెంట్తో 3వ స్థానంలో ఉంది. దాదాపు 76 శాతానికి పైగా చైనా మొబైల్ కంపెనీలదే.
శాంసంగ్, ఆపిల్, నోకియా, ఆసుస్.. మార్కెట్ దక్కించుకునే దిశగా
ఏదేమైనా ప్రస్తుతానికి నాన్-చైనీస్ సెంటిమెంట్ కారణంగా కొరియాకు చెందిన శాంసంగ్తో పాటు ఆపిల్, నోకియా, ఆసుస్ తదితర మొబైల్ కంపెనీలకు డిమాండ్ పెరుగుతోందని అంటున్నారు. చైనీస్ మొబైల్స్ రాకముందు నోకియా, శాంసంగ్ వంటి వాటికి మంచి మార్కెట్ ఉండేది. క్రమంగా అవి పడిపోయాయి. ప్రస్తుత పరిస్థితిని పరిశీలిస్తున్న నాన్-చైనీస్ మొబైల్ కంపెనీలు గత మార్కెట్లో కొంతభాగాన్ని అయినా అందుకునేందుకు ప్రయత్నాలు చేయవచ్చునని అంటున్నారు.
శాంసంగ్ ఆఫర్లు..
కౌంటర్ పాయింట్ రీసెర్చ్ ప్రకారం భారత్కు షిప్మెంట్లో 2020 జనవరి - మార్చి క్వార్టర్లో శాంసంగ్ మూడో స్థానంలో ఉంది. ఈ బ్రాండ్ తన గెలాక్సీ నోట్ 10 లైట్ 6జీబీ వేరియంట్ స్మార్ట్ఫోన్ పైన రూ.4,000 తగ్గింపు ప్రకటించింది. అంతకుముందు శాంసంగ్ గెలాక్సీ M11, గెలాక్సీ M01 ఫోన్లను లాంచ్ చేసింది. వీటి ధరలు రూ.15వేల లోపు ఉన్నాయి. గెలాక్సీ A21s స్మార్ట్ఫోన్ ధర రూ.16,500 నుండి ఉంది.
భావోద్వేగ సమయం..
కౌంటర్ పాయింట్ ప్రకారం క్వార్టర్ 1లో ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ద్వారా ఆపిల్ ఐఫోన్ 11 షిప్మెంట్ గత ఏడాదితో పోలిస్తే 78 శాతం పెరిగాయట. ప్రస్తుతం ఎక్కువమంది భారతీయ కస్టమర్లు ప్రత్యామ్నాం కోసం చూస్తున్నారని, ఇది నాన్ చైనా-దేశాల బ్రాండ్స్కు, భారతీయ బ్రాండ్స్కు ప్రయోజనం చేకూరుస్తోందని చెబుతున్నారు. అయితే ఇది భావోద్వేగంతో కూడుకున్న సమయం కాబట్టి నాన్-చైనీస్ బ్రాండ్స్ వ్యూహాత్మకంగా ముందుకు వెళ్లడం తప్ప, దూకుడుగా వెళ్లవని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అదే సమయంలో చైనీస్ బ్రాండ్స్ మాత్రం దూకుడు ప్రదర్శించే అవకాశాలే ఎక్కువగా ఉంటాయని చెబుతున్నారు.