అసలు విషయం చెప్పిన నిర్మల: ఆదాయపు పన్ను మినహాయింపులు క్రమంగా తగ్గింపు
ఇటీవలి బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఆదాయపు పన్ను వ్యవస్థను తీసుకు వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు ఉన్న పన్ను స్లాబ్స్తో పాటు తాజాగా తీసుకు వచ్చినది ఐచ్ఛికం. కొత్త పన్ను విధానంపై చాలామంది వివిధ రకాల అనుమానాలు లేవనెత్తుతున్నారు. దీనిపై అధికారులు, కేంద్రం ఎప్పటికప్పుడు వివరణ ఇస్తోంది. తాజాగా, కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ మరోసారి స్పందించారు.
ఆదాయపు పన్ను శాఖ.. మరిన్ని కథనాలు
కొత్త ఆదాయపు పన్ను వ్యవస్థ ప్రవేశ పెట్టడం వెనుక..
దేశాన్ని సరళీకృత, మినహాయింపులేని మరియు పన్ను పాలన రేటు తగ్గించే దిశగా తీసుకువెళ్లేందుకే కొత్త ఆదాయపు పన్ను వ్యవస్థను తీసుకు వచ్చినట్లు నిర్మలా సీతారామన్ చెప్పారు. ఐచ్ఛికంగా ఈ వ్యవస్థను ప్రవేశ పెట్టడం వెనుక ఉద్దేశ్యం.. ఆలోచన ఇదే అన్నారు.
మినహాంపుల తొలగింపుపై గడువు లేదు
అన్ని మినహాయింపులను తొలగించేందుకు ప్రభుత్వం ఎలాంటి గడువును నిర్దేశించుకోలేదని నిర్మల చెప్పారు. ఆదాయపు పన్ను ఎక్సెంప్షన్ మినహాయింపుల తొలగింపుపై టైమ్ లైన్ లేదన్నారు. కేంద్ర బడ్జెట్ పైన వాణిజ్య ప్రతినిధులు, మేధావులతో జరిగిన ఇంటరాక్టివ్ సెషన్ అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు.
అసలు లక్ష్యం ఇదే..
ప్రస్తుతానికి తాము కొన్ని మినహాయింపులు మాత్రమే కొత్త పన్ను విధానంలో తొలగించామని నిర్మల చెప్పారు. దీనిని రెండో ప్రత్యామ్నాయంగా ప్రారంభించామని చెప్పారు. అంతిమ లక్ష్యం మాత్రం అన్ని మినహాయింపులు తొలగించి, స్పష్టమైన, సరళీకృత ఆదాయపు పన్ను రేటు తగ్గించడం అన్నారు.
క్రమంగా ఐటీ మినహాయింపుల తగ్గింపు
ఆదాయపు పన్నుకు సంబంధించి మినహాయింపులన్నీ తొలగించడంపై తాము దృష్టి సారించలేదని, దశల వారీగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఇలా ముందుకు సాగుదామని, కానీ నిర్దిష్ట కాలం లేదన్నారు. మొత్తంగా సరళమైన విధానం కోసమే ప్రత్యామ్నాయ స్లాబ్స్ ప్రతిపాదన అన్నారు. క్రమంగా ఐటీ మినహాయింపుల తగ్గింపు ఉంటుందన్నారు.
అలా పన్ను చెల్లింపుదారులపై భారం తగ్గుతుంది..
రెవిన్యూ కార్యదర్శి అజయ్ భూషణ్ పాండే స్పందిస్తూ.. క్రమంగా ఐటీ మినహాయింపులన్నీ తొలగించి పన్ను రేట్లు తగ్గించడం తమ లక్ష్యమని తెలిపారు. ప్రభుత్వానికి పన్ను రాబడులు పెరిగితే పన్ను స్లాబ్స్ మరింతగా తగ్గుతాయని, పన్ను చెల్లింపుదారులపై భారం తగ్గుతుందన్నారు.
మరింత సరళతరం...
రెండో ప్రత్యామ్నాయ స్లాబ్ విధానం ప్రతిపాదించడం పన్ను వ్యవస్థని మరింత సరళం చేసే ప్రక్రియలో భాగంగానే జరిగిందని నిపుణులు కూడా చెబుతున్నారు. ఎలాంటి మినహాయింపులు లేని సరళమైన పన్ను విధానం అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తోంది కేంద్రం. అయితే మినహాయింపులు పూర్తిగా తొలగించేందుకు కాలపరిమితి లేదని, అంచెలంచెలుగా జరుగుతుందని వెల్లడించడం గమనార్హం.