డబ్బులున్నా ఇన్వెస్ట్ చేయట్లేదు...అందుకే వారి పన్ను తగ్గించొద్దు:నోబెల్ అవార్డు గ్రహీత కీలక వ్యాఖ్య
ఆర్థిక శాస్త్రం లో నోబెల్ అవార్డు పొందిన అభిజిత్ బెనర్జీ ఇండియన్ కార్పొరేట్ సెక్టార్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. 2020 బడ్జెట్ సందర్భంగా భారత ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ కు ఏమైనా సలహా ఇస్తారా అన్న ప్రశ్నకు బదులిచ్చిన ఆయన ... ఇకపై కార్పొరేట్ పన్ను రేటు తగ్గించ కూడదు. వారి వద్ద డబ్బులున్నా పెట్టుబడులు పెట్టటం లేదు అని సూచించారు. ఆర్థిక వ్యవస్థలో డిమాండ్ సృస్త్రించాలని అయన చెప్పారు. కార్పొరేట్ వర్గాలు డిమాండ్ లేకపోవటం వల్లే పెట్టుబడులకు ముందుకు రావటం లేదని వ్యాఖ్యానించారు. భారత సంతతికి చెందిన అభిజిత్ బెనర్జీ...
ఆర్థిక శాస్త్రం లో అనేక పరిశోధనలు చేశారు. ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ కేంద్ర బడ్జెట్ ను ప్రవేశ పెట్టనున్నారు. 2020-21 సంవత్సరానికి గాను పలు రంగాలకు కేటాయింపులు చేస్తారు. అలాగే వ్యక్తిగత ఆదయ పన్ను రేటు, కార్పొరేట్ పన్ను రేట్లను మరింతగా సవరించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నా నేపథ్యంలో అభిజిత్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఈ మేరకు ది ఎకనామిక్ టైమ్స్ లో ఒక కథనం ప్రచురితమైంది. అభిజిత్ భార్య ఎస్తేర్ కూడా ఆర్థికవేత్తలే. దంపతులిద్దరూ ... ప్రభుత్వం ప్రజల వద్దకు డబ్బులు చేరేలా చూడాలని, ముఖ్యంగా పేదవారి చేతికి అవి చేరితే వినియోగం పెరుగుతుందని చెప్పారు.
జగన్ శుభవార్త:1,000 దాటితే, 5లక్షలలోపు ఆదాయం ఉంటే ఆరోగ్యశ్రీ
కార్పొరేట్ పన్ను 22 శాతమే...
ప్రపంచంలోనే అత్యధిక కార్పొరేట్ పన్ను రేటు కలిగిన దేశాల్లో ఇండియా కూడా ఒకటిగా ఉండేది. కంపెనీల ఆదాయంపై ఇప్పటివరకు 30% కార్పొరేట్ పన్ను వసూలు చేసేవారు. సెస్సులు, సర్చార్జీలు కలిపి అది కాస్త 33% మేరకు ఉండేది. అయితే, దేశంలో పెట్టుబడులను పెంచాలని, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకరిషించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. తద్వారా దేశంలో ఉపాధి కల్పన మెరుగుపడుతుందని, ఆ వెంటనే డిమాండ్ పెరుగుతుందని ఆశించింది. ఇదే ఆలోచనతో కార్పొరేట్ పన్ను రేటును 30 శాతం నుంచి 22% నికి కుదించింది. అది కూడా వెంటనే అమల్లోకి వస్తుందని ప్రకటించింది. పన్నులు, సెస్సులు కలిపినా కూడా ప్రస్తుతమున్న పన్ను రేటు 25% నికి మించదు. గత బడ్జెట్ లో ప్రకటించకపోయినా.... ప్రస్తుత ఆర్థిక వ్యవస్థ పరిస్థితి గమనించిన ప్రభుత్వం దీర్ఘకాలిక లక్ష్యంతో ఏడాది మధ్యలో ఈ నిర్ణయాన్ని వెలువరించింది.
కొత్త కంపెనీలకు 15% ...
దేశంలో తయారీ రంగాన్ని ప్రోత్సహించాలని, పలు కారణాలతో చైనా వదిలి వెళుతున్న మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలను భారత్ కు రప్పించాలని కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. 2019 అక్టోబర్ 1 తర్వాత ఏర్పాటు చేసిన తయారీ రంగ కంపెనీలకు కేవలం 15% కార్పొరేట్ పన్ను వర్తిస్తుందని ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రకటించారు. దీంతో ఒక్కసారిగా ఇండియన్ కార్పొరేట్ రంగం పండగ చేసుకుంది. కానీ ఆశించ స్థాయిలో పెట్టుబడులు మాత్రం రాలేదు. ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఒక మెలిక పెట్టింది. ఈ పన్ను రేటు వర్తించాలంటే ప్రభుత్వం నుంచి మారె విధమైన రాయితీలు, మినహాయింపులు పొందకూడని షరతు విధించింది. 15% పన్ను రేటు పలు ప్రపంచ దేశాలతో పోటీ పడే విధంగా ఉంది. చాలా అభివృద్ధి చెందిన దేశాల కంటే కూడా మెరుగ్గా ఉండటం, ఆసియా లోని ఇతర పోటీ దేశాలతో పోలిస్తే మెరుగ్గా ఉండేలా రూపొందించారు. అయినా కూడా ఇటు దేశీయ పెట్టుబడులు, అటు అంతర్జాతీయ ఇన్వెస్ట్మెంట్స్ ఏమి రాకపోవటం గమనార్హం.
సి ఏ ఏ పై అనుమానం...
నోబెల్ ప్రైజ్ గ్రహీత అభిజిత్ బెనర్జీ... దేశంలో సంచలనం సృష్టించిన సిటిజెన్షిప్ అమెండేమేంట్ ఆక్ట్ పై కూడా స్పందించారు. అది పవర్ ఉన్న వారి చేతిలో పావుగా మారె అవకాశం ఉందన్నారు. తనకైతే తగిన పవర్ ఉందని వ్యాఖ్యానించారు. కానీ ఎవరైనా లిస్ట్ తయారు చేసే వారు దాన్ని అడ్డం పెట్టుకుని రూ 10,000 అడిగే అవకాశం లేకపోలేదని చెప్పారు. ముఖ్యంగా బోర్డర్ జిల్లాల్లో ఈ పరిస్థితి మరింత అధికంగా ఉండొచ్చని అభిప్రాయపడ్డారు.