వారికి నిర్మలా సీతారామన్ కొత్త ఏడాది గుడ్ న్యూస్, జనవరి 1 నుంచి ఈ ఛార్జీలు రద్దు
జనవరి 1, 2020 నుంచి మర్చంట్ డిస్కంట్ రేట్ (MDR) ఫీజును ఎత్తివేస్తున్నట్లు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ శనివారం ప్రకటించారు. ఫిబ్రవరి 1వ తేదీన బడ్జెట్ ప్రవేశ పెట్టనున్న నేపథ్యంలో సీతారామన్ వివిధ రంగాల ప్రతినిధులతో చర్చిస్తున్నారు. ఇందులో భాగంగా శనివారం పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ టాప్ ఎగ్జిక్యూటివ్లతో చర్చించారు. ఈ సందర్భంగా కొత్త సంవత్సరం బహుమతి ఇచ్చారు!
గృహసిద్ధి: హోమ్ లోన్ తీసుకునే వారికి LIC సూపర్ ఆఫర్, వడ్డీ రేటు, అర్హత, లోన్ టర్మ్...
MDR ఛార్జీలు ఎత్తివేత
ఎంపిక చేసిన నగదు ట్రాన్సాక్షన్లపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) ఛార్జీలను ఎత్తి వేస్తున్నట్లు తెలిపారు. జనవరి 1వ తేదీ నుంచి ఈ ఛార్జీల రద్దు అమలులోకి వస్తుందన్నారు. త్వరలో ఎంపిక చేసిన నగదు ట్రాన్సాక్షన్స్ను నోటిఫై చేస్తామని చెప్పారు. డిజిటల్ ట్రాన్సాక్షన్స్ను ప్రోత్సహించే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.
వీటిపై ఎత్తివేయవచ్చు
రూపే కార్డు, క్యూఆర్ కోడ్తో చేసే ట్రాన్సాక్షన్లపై ఈ ఛార్జీలు ఎత్తి వేయనున్నారని అంటున్నారు. నోటిఫికేషన్ ప్రకారం రూ.50 కోట్ల టర్నోవర్ కలిగిన కంపెనీలు రూపే డెబిట్ కార్డు, యూపీఐ క్యూఆర్ కోడ్ ద్వారా చెల్లింపు సౌకర్యాన్ని కల్పించాలి.
ఏమిటీ MDR?
ఒక కస్టమర్ పాయింట్ ఆఫ్ సేల్ (PoS) టెర్మినల్లో కార్డు ద్వారా స్వైప్ చేసినప్పుడు సర్వీస్ ప్రొవైడర్లకు మర్చంట్లు చెల్లించే ఫీజునే ఎండీఆర్ అంటారు. ఆన్ లైన్లో క్యూఆర్ కోడ్తో ట్రాన్సాక్షన్స్ జరిపినప్పుడు కూడా ఈ ఛార్జీలు చెల్లించవలసి ఉంటుంది. ఇది 0.2 శాతం వరకు ఉంటుంది. వాస్తవానికి కొందరు వ్యాపారులు దీనిని కస్టమర్ల నుంచి వసూలు చేస్తారు. నోట్ల రద్దు అనంతరం డిజిటల్ ట్రాన్సాక్షన్స్ను ప్రోత్సహించేందుకు MDR ఛార్జీల భారాన్ని కేంద్రం కొన్నాళ్లు భరించింది.
త్వరగా పరిష్కరించుకోండి
ఇదిలా తమ అధికారులపై నమోదైన విజిలెన్స్ కేసులు కూడా త్వరగా పరిష్కరించుకోవాలని బ్యాంకు అధిపతులకు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ సూచించారు. కాగా, నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1, 2020న వచ్చే ఏడాదికి సంబంధించిన బడ్జెట్ ప్రవేశ పెట్టే అవకాశముంది.