కొత్త ఐటీ ఈ-ఫైలింగ్ పోర్టల్లో సాంకేతిక సమస్య, ఇన్ఫోసిస్కు నిర్మల ట్వీట్
ఆదాయ పన్ను శాఖ కొత్త వెబ్ సైట్లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఇన్ఫోసిస్ దృష్టికి తీసుకు వెళ్లారు. ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు మరిన్ని మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా ఆదాయపు పన్ను విభాగం కొత్త వెబ్ సైట్ను అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే. అయితే దీంట్లో సమస్యలు తలెత్తుతున్నాయని యూజర్లు భారీ ఎత్తున నిర్మలమ్మకు ట్విట్టర్ వేదికగా ఫిర్యాదు చేశారు.
దీనిపై స్పందించిన నిర్మలమ్మ సమస్యను ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకులు, చైర్మన్ నందన్ నీలేకని దృష్టికి తీసుకెళ్లారు. మెరుగైన సేవలు అందించడంలో ఇన్ఫోసిస్, నీలేకని పన్ను చెల్లింపుదారులను నిరాశకు గురి చేయరని భావిస్తున్నామని ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.
పాత వెబ్సైట్లో ఉన్న ప్రతికూలతలను తొలగిస్తూ తర్వాత తరం ఐటీ ఇ-ఫైలింగ్ వెబ్సైట్ను అభివృద్ధి చేసే బాధ్యతను ప్రభుత్వం ఇన్ఫోసిస్కు 2019లో అప్పగించింది. రిటర్న్స్ ప్రక్రియను 63 రోజుల నుండి ఒక్కరోజు తగ్గించడమే లక్ష్యంగా కొత్త సైట్కు రూపకల్పన చేశారు. గతంలో జీఎస్టీఎన్, జీఎస్టీ పేమెంట్ అండ్ రిటర్న్ ఫైలింగ్కు కూడా ఇన్ఫోసిస్ వెబ్సైట్ను రూపొందించింది. 2017లో జీఎస్టీ వెబ్సైట్ విడుదల చేసిన సమయంలో కూడా సాంకేతిక సమస్యలు తలెత్తాయి.