మీ వాటాలు అమ్మి బకాయిలు చెల్లించండి: ఎయిర్టెల్-వొడాఫోన్ ఐడియాకు ముఖేష్ అంబానీ
ప్రభుత్వానికి బకాయిపడిన భారీ మొత్తం చెల్లించాలని ఇటీవల సుప్రీం కోర్టు టెలికం కంపెనీలను ఆదేశించింది. ఈ చెల్లింపుల విషయంలో టెలికోస్కు కాస్త ఉపశమనం ఇచ్చేందుకు ప్రభుత్వానికి సూచనలు, సలహాలు అందుతున్నాయి. అడ్జెస్టెడ్ గ్రాస్ రెవెన్యూ (AGR) రీపెమెంట్స్ కోసం 20 ఏళ్ల కాలపరిమితి పరిశీలనలో ఉంది. ఈ నేపథ్యంలో రిలయన్స్ జియో కేంద్రానికి లేఖ రాసింది. కోర్టు తీర్పు నేపథ్యంలో ప్రత్యర్థి కంపెనీలకు ఎలాంటి ఆర్థిక ఉపశమనం కల్పించడమైనా సరికాదని తెలిపింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత (RIL) ముఖేష్ అంబానీ నేతృత్వంలోని జియో... తన ప్రత్యర్థి కంపెనీలైనా ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియాలకు ఎలాంటి ఉపశమన చర్యలు వద్దని చెబుతూనే, ఆ కంపెనీలకు పలు సూచనలు జారీ చేసింది.
వీరి పట్ల జాగ్రత్త: ఎస్బీఐ, ఈపీఎఫ్ఓ హెచ్చరిక
అన్ని రకాల ఆదాయ వనరులు ఉన్నాయి..
ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియాలకు బకాయిలు చెల్లించేందుకు అన్ని రకాల ఆదాయ వనరులు ఉన్నాయని పేర్కొంది. సదరు కంపెనీలకు ఉన్న ఆదాయ మార్గాలను పేర్కొంటూ కొన్ని సూచనలు చేశారు. ఎయిర్ టెల్ సంస్థకు చెందిన పలు ఆస్తులు, వాటాలను విక్రయించడం ద్వారా 5.7 బిలియన్ డాలర్లు (రూ.40,000 కోట్లు) సమకూర్చుకోవచ్చునని తెలిపారు. అదే సమయంలో వొడాఫోన్ ఐడియా లిమిటెడ్కు కూడా అలాంటి అవకాశాలే ఉన్నాయన్నారు.
వాటాలు విక్రయించుకోండి
ఈ రెండు కంపెనీలు ఇండస్ టవర్స్లోని తమ వాటాలను విక్రయించవచ్చునని ముఖేష్ అంబానీకి చెందిన జియో సూచించింది. వొడాఫోన్ ఐడియా, ఎయిర్ టెల్ కంపెనీలు ప్రభుత్వానికి రూ.49,990 కోట్లు చెల్లించాలని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. జియో రెగ్యులేటరీ అఫైర్స్ అధ్యక్షులు కపూర్ సింగ్ నవంబర్ 1వ తేదీన కేంద్రానికి లేఖ రాశారు. దానిని తాజాగా బహిర్గతం చేశారు. కోర్టు నిర్దేశించిన మూడు నెలల గడువులోగా కంపెనీలు బకాయిలు చెల్లించాలని అభిప్రాయపడింది.
20 శాతం మేర విక్రయిస్తే...
భారతీ ఎయిర్టెల్ తన ఇండస్ టవర్ వ్యాపారంలోని ఆస్తులను 15% నుంచి 20% మేరా విక్రయిస్తే డబ్బులు చెల్లించవచ్చునని పేర్కొంది. అదే సమయంలో ఇండస్ టవర్ బిజినెస్లో వొడాఫోన్ కూడా వాటాలు కలిగి ఉన్న నేపథ్యంలో ఆ షేర్స్ను విక్రయిస్తే నిధులు సమకూర్చుకొని బకాయిలు చెల్లించవచ్చునని సలహా ఇచ్చింది.
సుప్రీం తీర్పుపై అభ్యర్థన
ఎయిర్ టెల్ టవర్స్ బిజినెస్ దేశవ్యాప్తంగా 1,63,000 మొబైల్ ఫోన్ టవర్స్ను ఆపరేట్ చేస్తోంది. కాగా, టెలికం సర్వీస్ ప్రొవైడర్ల నుంచి సుమారు రూ.92వేల కోట్ల మేర AGR వసూలు చేసేందుకు కేంద్రానికి సుప్రీం కోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో ఎయిర్టెల్ రూ.21,682 కోట్లు, వొడాఫోన్ 19,823 కోట్లు చెల్లించవలసి ఉంది. బకాయిల చెల్లింపులో ఉపశమనం కోసం ఈ కంపెనీలు కేంద్రాన్ని అభ్యర్థించాయి. వీరి అభ్యర్థనను పరిశీలించేందుకు కేంద్రం సిద్ధమైంది.