చైనాకు చెక్: ఆటో విడిభాగాల తయారీ ఇక ఇండియాలోనే! మారుతి సుజుకి, మహీంద్రా కంపెనీల చేయూత
సరిహద్దుల్లో కవ్విస్తున్న పొరుగు దేశం చైనా కు గట్టిగా బుద్ధి చెప్పేందుకు ఇండియా అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే చైనా కు చెందిన 59 మొబైల్ ఆప్స్ ను ఇండియా లో నిషేధించింది. ఇందులో టిక్ టాక్ వంటి ఆప్ కూడా ఉండటం తెలిసిందే. ఇప్పుడు తాజాగా ఆటోమొబైల్ రంగం మరో కీలక ముందడగు వేస్తోంది. ప్రస్తుతం మన దేశ ఆటోమొబైల్ రంగం భారీ స్థాయిలో ముడి సరుకులు, విడి భాగాల కోసం చైనా పైనే ఆధారపడుతూ వస్తోంది. తక్కువ ఖర్చులో ఎంత పరిమాణం లో నైనా వాటిని సరఫరా చేసే సత్తా చైనా కు ఉంది కాబట్టి, అన్ని కంపెనీలు ఆ దేశంపైనే ఆధారపడేవి.
కానీ కరోనా వైరస్ వ్యాప్తి తర్వాత ప్రపంచ వ్యాప్తంగా సరికొత్త పరిణామాలు చోటు చేసుకున్నాయి. కరోనా విషయంలో చైనా దాగుడు మూతలు ఆడుతోందని, వైరస్ కు పుట్టినిల్లు అదే అని అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ పదే పదే బాహాటంగానే చెబుతున్నారు. ఈ సందేహం ప్రపంచంలోని ఇతర దేశాల్లో కూడా ఉంది. కానీ అవి బయటకు చెప్పటం లేదంతే. ఇదిలా ఉండగానే.. మన దేశ సరిహద్దులను ఆక్రమించి సుమారు 20 మంది భారత సైనికులను పొట్టనబెట్టుకున్న చైనాకు సరైన రీతిలో చెక్ పెట్టాల్సిందేనని ఇండియా దృఢనిశ్చయం తో ఉంది.
చైనాకు బ్యాంకు కస్టమర్ల భయాందోళన షాక్, లార్జ్ మనీ తీసుకోవాలంటే.. కొత్త నిబంధనలు
భారీ స్థాయిలో దిగుమతులు...
ఇప్పటి వరకు మనం ఆటో మొబైల్ రంగంలో వినియోగించే మెజారిటీ ముడిసరుకులు, విడి భాగాలను చైనా నుంచే దిగుమతి చేసుకుంటున్నాం. దీని విలువ 2019 లో సుమారు 4.5 బిలియన్ డాలర్లు (సుమారు రూ 35,000 కోట్లు) ఉండటం గమనార్హం. అంతక్రితం ఏడాది తో పోల్చితే 2019 లో ఆటోమొబైల్స్ కు సంబందించిన దిగుమతులు 7% పెరగటం విశేషం. అయితే, కరోనా వైరస్ తర్వాత పరిస్థితులు మారిపోయాయి కాబట్టి, అమ్మకాలు తగ్గిపోయాయి కాబట్టి దిగుమతులు కూడా తక్కువగానే ఉన్నాయి. అయితే, వీటిని వీలైనంత అధిక పరిమాణంలో తగ్గించేందుకు మన దేశీయ ఆటోమొబైల్ దిగ్గజాలు మహీంద్రా అండ్ మహీంద్రా, మారుతి సుజుకి తో పాటు టొయోట కిర్లోస్కర్ వంటి కంపెనీలు చేయూత నివ్వబోతున్నాయి. ఆ మేరకు విడిభాగాలను తయారు చేసే సంస్థల నుంచి కొనుగోలు హామీ ఇచ్చి మరీ వాటిని ప్రోత్సహిస్తున్నాయి.
ప్రభుత్వంతో చర్చలు...
ఇదే అంశంపై ప్రభుత్వం త్వరలోనే ఇండియా లోని ఆటోమొబైల్ సంఘాలతో చర్చలు జరపనుంది. సొసైటీ అఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరర్స్ (సియాం), ఆటోమోటివ్ కంపోనెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (ఏసిఎంఏ), ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఏఆర్ఏఐ) వంటి సంస్థలు ఇందులో పాల్గొననున్నట్లు సమాచారం. ఈ మేరకు ది ఎకనామిక్ టైమ్స్ ఒక ప్రత్యేక కథనం ప్రచురించింది. ఇండియా లో ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్ల తో కలిసి ఇండియా లో పూర్తి స్థాయి ఆటోమొబైల్ విడిభాగాల తయారీ వాతావరణాన్ని సృష్టించేందుకు సమాయత్తమవుతున్నాయి. దీంతో చైనా పై ఆధారపడటం భారీగా తగ్గించుకోవచ్చు అనేది ప్రణాళికగా ఉంది.
కొరియా, వియాత్నం...
ఒక వైపు స్వదేశీ తయారీకి ఊతమిస్తూనే మరోవైపు దిగుమతి ప్రత్యామ్నాయాల కోసం కూడా భారత్ ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. మనకు బ్యాటరీలు, డ్రైవ్ ట్రాన్స్మిషన్, స్టీరింగ్, ఎలెక్ట్రికల్స్, ఎలక్ట్రానిక్స్, ఇంటీరియర్స్, కూలింగ్ సిస్టమ్స్, సస్పెన్షన్, ఇంజిన్ కంపోనెంట్స్, చాసిస్, బాడీ వంటి విభాగాల్లో అధికంగా దిగుమతులు ఉంటున్నాయి. అలాగే భారత్ -6 కాలుష్య నియంత్రణ నిబంధనలు అమల్లోకి రావటంతో దానికి తగ్గట్లు విడిభాగాలు తయారు చేసే కంపెనీల సంఖ్య ఇండియా లో తక్కువగా ఉంది. ఈ కొరతను అధిగమించేందుకు ప్రస్తుతం ప్రభుత్వం, పరిశ్రమ కలిసికట్టుగా ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాయి. దక్షిణ కొరియా, వియాత్నం వంటి దేశాల నుంచి కూడా విడి భాగాలను దిగుమతి చేసుకోవాలని చూస్తున్నాయి. జపాన్ కూడా ఆటోమొబైల్ పరిశ్రమ కు పెద్ద కేంద్రం కాబట్టి అక్కడి నుంచి కూడా కొంత మేరకు విడిభాగాలు రానున్నాయి.