రెండోసారి: ఆరేళ్ల తర్వాత మళ్లీ, రిలయన్స్ ఇండస్ట్రీస్కు TCS చెక్!
దిగ్గజ కంపెనీల్లో భారీ లాభాలు చూస్తున్న వాటిలో రిలయన్స్ ఇండస్ట్రీస్(RIL) ఎప్పుడూ ముందుంటుంది. రిలయన్స్లో ఇన్వెస్ట్ చేస్తే మంచి రిటర్న్స్ ఉంటాయని భావించేవారు ఎందరో. టాప్ ప్రాఫిట్ జాబితాలో ముఖేష్ అంబానీ నేతృత్వంలోని ఈ కంపెనీయే ఫస్ట్ ప్లేస్లో నిలుస్తుంది. చమురు ధరలు భారీగా పతనం కావడంతో రిలయన్స్ లాభాలు గత క్వార్టర్లో తగ్గాయి. అంతేకాదు, దేశంలో అత్యధిక లాభాలిచ్చే కంపెనీలో రిలయన్స్ను ఐటీ దిగ్గజం టీసీఎస్ దాటేసింది.
ముఖేష్ అంబానీ సహా వేతన కోత, రిలయన్స్ ఆదా చేసేది ఎంతో తెలుసా?
రిలయన్స్ను ఇలా దాటేసిన టీసీఎస్
2019-20 ఆర్థిక సంవత్సరం చివరి క్వార్టర్లో (జనవరి - మార్చి) టీసీఎస్ రూ.8,049 కోట్ల లాభాలను నమోదు చేయగా, రిలయన్స్ రూ.6,348 కోట్లు నమోదు చేసింది. రిలయన్స్ లాభాలు చివరి క్వార్టర్లో 39 శాతం క్షీణిస్తే, టీసీఎస్ ప్రాఫిట్ మాత్రం కేవలం 1 శాతం క్షీణించింది. జియో కారణంగా రిలయన్స్ ఆ మాత్రం గట్టెక్కింది. లేదంటే మరింత తీవ్ర నష్టాలు చూసేది. చమురు ధరలు భారీగా పతనం కావడంతో రిలయన్స్పై భారీ ప్రభావం పడింది.
రెండు దశాబ్దాలుగా రిలయన్స్
మోస్ట్ ప్రాఫిటబుల్ దిగ్గజ ప్రయివేటు కంపెనీగా దాదాపు రెండు దశాబ్దాల నుండి రిలయన్స్ అగ్రస్థానంలో ఉంది. మొత్తం ఆదాయం, నిర్వహణ లాభం, నికర విలువ, ఆస్తులు, మార్కెట్ క్యాపిటలైజేషన్ వంటి ఆర్థికపరమైన పారామీటర్స్ విషయానికి వస్తే టీసీఎస్ కంటే రిలయన్స్ చాలా ముందు ఉంది.
ప్రాఫిట్ పరంగా రెండుసార్లు
మోస్ట్ ప్రాఫిటబుల్ కంపెనీగా రెండు దశాబ్దాలుగా ఉంటున్న రిలయన్స్ను టీసీఎస్ ఇప్పటికి రెండుసార్లు దాటేసింది. ఇంతకుముందు 2014 డిసెంబర్ క్వార్టర్లో మొదటిసారి దాటేసింది. మళ్లీ ఇప్పుడు దాటేసింది. చమురు దెబ్బతో రిలయన్స్ 30 క్వార్టర్స్ తర్వాత నెట్ ప్రాఫిట్లో తగ్గుదలను చూసింది.
ఎం-క్యాప్లో టీసీఎస్ గట్టి పోటీ
2012 వరకు దాదాపు దశాబ్దం పాటు రిలయన్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్లో మొదటి స్థానంలో ఉంది. అప్పుడు టీసీఎస్ దానిని దాటేసింది. 2012 నుండి ఐదేళ్ల పాటు టీసీఎస్ అగ్రస్థానంలో కొనసాగింది. 2018లో టెక్ దిగ్గజాన్ని రిలయన్స్ అధిగమించింది. గత మూడేళ్లుగా జియోతో కారణంగా రిలయన్స్ దూకుడు ప్రదర్శిస్తోంది. 2018 చివరి క్వార్టర్లో టీసీఎస్ మళ్లీ ముందుకు వచ్చింది. ప్రస్తుత స్టాక్ ధరల ప్రకారం రిలయన్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.9.3 ట్రిలియన్లు కాగా, టీసీఎస్ ఎం-క్యాప్ రూ.7.6 ట్రిలియన్లు.