ఇక ‘వన్ నేషన్-వన్ పే డే’ వ్యవస్థ దిశగా మోడీ సర్కారు!
ఉద్యోగులు, కార్మికుల సంక్షేమం కోసం అనూహ్య నిర్ణయాలు తీసుకుంటోన్న కేంద్ర ప్రభుత్వం త్వరలోనే వారికి మరో తీపికబురు అందించేందుకు సిద్ధమవుతోంది. దేశ వ్యాప్తంగా ఉన్న సంఘటిత రంగ ఉద్యోగులు, కార్మికులందరికీ ఒకే రోజున వేతనాలు అందించాలని యోచిస్తోంది. ఇదే గనుక అమలులోకి వస్తే.. ఉద్యోగులు, కార్మికులకు పండగే!
అవును, కేంద్రంలోని మోడీ సర్కారు త్వరలోనే 'ఒకే దేశం.. ఒకేరోజు వేతనం'(వన్ నేషన్-వన్ పే డే) విధానాన్ని అమలులోకి తీసుకురావాలని చూస్తోంది. కేంద్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్ గంగ్వార్ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ అంశానికి ప్రధాని మోడీ అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు.
‘వన్ నేషన్-వన్ పే డే’...
కేంద్రంలో మోడీ సర్కారు అధికారంలోకి వచ్చినప్పట్నించే కార్మిక చట్టాలను సరళంగా మార్చేందుకు ప్రయత్నిస్తోంది. తాజాగా ఉద్యోగులు, కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ‘వన్ నేషన్.. వన్ పే డే' విధానం అమలుకు ప్రణాళికలు రచిస్తోంది. ఇది గనుక అమలులోకి వస్తే.. దేశంలో ప్రైవేటు రంగంలోని ఉద్యోగులందరికీ ప్రతి నెలా ఒకే రోజున వేతనాలు అందుతాయి.
‘కనీస వేతనం’పైనా తీవ్ర చర్చ....
ఇప్పటికే ‘కోడ్ ఆన్ వేజెస్' (వేతనాల కోడ్) బిల్లు పార్లమెంటు ఆమోదం పొందింది. అయితే దీనికి సంబంధించిన విధివిధానాలు ఇంకా ఖరారు చేయాల్సి ఉంది. మరోవైపు వివిధ రంగాల్లోని ఉద్యోగులు, కార్మికులకు మినిమం శాలరీ(కనీస వేతనం) అంశంపై కూడా కేంద్రం దృష్టి సారించింది. ఏయే రంగాల్లో ఉద్యోగులు, కార్మికులకు కనీస వేతనం ఎంతెంత ఉండాలన్నదానిపై సీరియస్గా చర్చిస్తోంది.
13 కార్మిక చట్టాలు ఒకే కోడ్ కిందకు...
2014లో మోడీ సర్కారు కేంద్రంలో అధికారంలోకి వచ్చినప్పట్నించే కార్మిక చట్టాలను సరళంగా మార్చేందుకు ప్రయత్నిస్తోంది. దాదాపు 44 కార్మిక చట్టాలను నాలుగు వర్గాలుగా విభజించి సరళమైన చట్టాలుగా చేయాలని మోడీ ప్రభుత్వం సంకల్పించింది. అందులో భాగంగా 13 కార్మిక చట్టాలను ఒకే కోడ్ కిందకు తీసుకొస్తూ ‘ఆక్యుపేషనల్ సేఫ్టీ, హెల్త్ అండ్ వర్కింగ్ కండీషన్స్(ఓఎస్హెచ్) కోడ్ బిల్లును సిద్ధం చేసింది.
‘ఓఎస్హెచ్’ కోడ్ అమలులోకి వస్తే...
ఈ ‘ఓఎస్హెచ్' కోడ్ను ఈ ఏడాది జూలై 23న పార్లమెంటులో ప్రవేశపెట్టినప్పటికీ వివిధ అభ్యంతరాల నేపథ్యంలో ఇది ఆమోదం పొందలేదు. ఈ కోడ్ గనుక అమలులోకి వస్తే.. ఉద్యోగంలో చేరేటప్పుడే ప్రతి ఉద్యోగికి కంపెనీ యాజమాన్యం నుంచి అపాయింట్మెంట్ లెటర్తోపాటు ప్రతి సంవత్సరం ఉచిత మెడికల్ చెకప్ తదితర సదుపాయాలు లభిస్తాయి.
అసంఘటిత రంగ కార్మికుల కోసం...
దేశంలోని అసంఘటిత రంగంలో పని చేస్తోన్న కార్మికులు, కూలీల సంక్షేమం దిశగా కూడా మోడీ సర్కారు చర్యలు తీసుకుంటోంది. త్వరలోనే ఈ రంగంలోని కార్మికులందరికీ రూ.3 వేల పెన్షన్, వైద్య బీమా వంటివి అందించేందుకు ప్రణాళికలు రచిస్తోంది. అలాగే భవిష్యత్తులో అసంఘటిత రంగ కార్మికులు, కూలీలకు మరింత మెరుగైన సామాజిక, ఆర్థిక భద్రత కల్పించేందుకు కూడా మరిన్ని పథకాలు కేంద్ర ప్రభుత్వం తీసుకురాబోతోంది.