జీఎస్టీ పెంపు, ఏప్రిల్ 1 నుండి మొబైల్ ధరలు భారీగా పెరుగుదల: ఆ వ్యాపారులకు ఊరట
కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో జరిగిన 39వ జీఎస్టీ కౌన్సిల్ భేటీలో శనివారం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మొబైల్ ఫోన్లు, కొన్ని విడిభాగాలపై జీఎస్టీ రేటును 18 శాతానికి పెంచారు. ప్రస్తుతం ఆ రేటు 12 శాతంగా ఉంది. అంటే ఆరు శాతం వరకు పెరిగినట్లు.
నిమిషాల్లోనే ఉచితంగా పాన్కార్డు తీసుకోండి, ఇలా చేయండి
ఏప్రిల్ 1 నుండి పెరగనున్న మొబైల్ ధరలు
జీఎస్టీ కొన్సెల్ మొబైల్ ఫోన్లు, కొన్ని విడిభాగాలపై జీఎస్టీ రేటును 18 శాతానికి పెంచడంతో మొబైల్ ధరలు కూడా పెరగనున్నాయి. ఈ పెరగనున్న ధరలు ఏప్రిల్ 1వ తేదీ నుండి అమలులోకి వస్తాయి. జీఎస్టీ కౌన్సెల్లో తీసుకున్న నిర్ణయాలను సీతారామన్ ఆ తర్వాత మీడియాకు వెల్లడించారు.
మొబైల్స్ కొనుగోళ్లపై ప్రభావం
మొబైల్స్ పైన జీఎస్టీ పెంపు కస్టమర్ల కొనుగోళ్ల సెంటిమెంట్ పైన ప్రభావం చూపుతుందని ఇండియన్ సెల్యులార్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ ఆందోళన వ్యక్తం చేసింది. దేశీయంగా ఫోన్ల తయారీకి ఇది ప్రతికూలంగా మారే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించింది.
ఇప్పటికే కరోనా దెబ్బ..
కరోనా వైరస్ విజృంభణతో చైనా నుంచి ఎలక్ట్రానిక్ విడిభాగాల సరఫరా నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో మొబైల్ హ్యాండ్ సెట్ మార్కెట్ తీవ్ర ఒత్తిడిలో ఉందని సెల్యులార్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ ఆర్థిక శాఖకు లేఖ కూడా రాసింది. ఈ తరుణంలో జీఎస్టీ రేటు పెంపు తగదని పేర్కొంది.
హేతుబద్దీకరణ
యంత్రాలు, చేత్తో తయారు చేసే అగ్గిపుల్లలపై వేర్వేరుగా ఉన్న జీఎస్టీని మొత్తంగా 12 శాతానికి హేతుబద్దీకరించారు. ఎయిర్ క్రాఫ్ట్స్కు సంబంధించిన మెయింటెన్స్, రిపేర్, ఓవర్ హాల్ (ఎంఆర్వో) సేవలపై ఉన్న 18 శాతం జీఎస్టీని 5 శాతానికి తగ్గించారు.
వ్యాపారులకు గుడ్న్యూస్
రూ.2 కోట్ల కంటే తక్కువ టర్నోవర్ కలిగిన వ్యాపారులు 2018-2019 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన ఆలస్యంగా దాఖలు చేసిన రిటర్న్స్పై లేట్ ఫీజును రద్దు చేస్తూ గుడ్ న్యూస్ చెప్పారు. జీఎస్టీ కింద రిజిస్టరయిన ప్రతి వ్యక్తి తన వ్యాపారానికి అనుగుణంగా సరఫరాదారుల ప్రాథమిక సమాచారం తెలుసుకునేందుకు వీలుగా త్వరలో నో యువర్ సప్లయిర్ సౌకర్యం రానుంది. జీఎస్టీ నెట్ వర్క్ సామర్థ్యాన్ని పెంచేందుకు మరింత నైపుణ్యవంతమైన మానవ వనరులను సమకూర్చనున్నారు. జూలై నాటికి దీనిని మెరుగుపరుస్తారు.
కరోనా ప్రభావంతో ఇవి వాయిదా..
మొబైల్స్తో పాటు వస్త్రాలు, పాదరక్షలు, ఎరువులపై పన్ను రేట్లు పెరగవచ్చని జీఎస్టీ మండలి సమావేశానికి ముందు మార్కెట్లో ఊహాగానాలు వచ్చాయి. కరోనా ప్రభావం, ఆర్థిక మందగమనం నేపథ్యంలో వీటిపై జీఎస్టీ పెంపు నిర్ణయాన్ని మండలి వాయిదా వేసింది. తాజాగా సవరించిన రేట్లు అన్నీ ఏప్రిల్ 1వ తేదీ నుండి అమలులోకి వస్తాయి.