కొనుగోలుదారులకు షాక్, మరోసారి ధరలు పెంచుతున్న మారుతీ సుజుకీ
దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మారుతీ సుజుకి ఇండియా వాహన కొనుగోలుదారులకు షాకిచ్చింది. ఏప్రిల్ 1వ తేదీ నుండి అన్ని మోడల్స్ పైన ధరలు పెంచుతున్నట్లు ప్రకటించింది. ఏడాది కాలం నుండి తమ వాహనాల తయారీ ఖర్చులు భారీగా పెరిగాయని, ముడి సామాగ్రి ధరలు పెరగడం ఇందుకు కారణమని రెగ్యులేటరీకి సమర్పించిన ఫైలింగ్లో తెలిపింది. ఈ భారంలో కొంత కస్టమర్లపై తప్పనిసరి పరిస్థితుల్లో మోపవలసి వస్తుందని తెలిపింది.
మోడల్స్ను బట్టి ధరల పెరుగుదలలో మార్పులు ఉంటాయని తెలిపింది. అయితే ఈ ధరల పెరుగుదల ఎంత మేరకు ఉంటుందనేది వెల్లడించాల్సి ఉంది. ఉత్పత్తి ధరల పెరుగుదల వల్ల కంపెనీపై పడుతున్న భారాన్ని తగ్గించుకునేందుకు ఎంపిక చేసిన కొన్ని మోడల్ వాహనాల ధరలను రూ.34వేల వరకు పెచుతున్నట్లు జనవరిలోనే ప్రకటించింది. ఇప్పుడు పెంచడం రెండోసారి.
మరో వాహన కంపెనీ మహీంద్రా అండ్ మహీంద్రా తమ పర్సనల్, కమర్షియల్ వెహికిల్స్ ధరలను 1.9 శాతం మేర పెంచాయి. టాటా మోటార్స్ పాసింజర్ వాహనాలపై రూ.26వేల వరకు పెంచాయి. మారుతీ సుజుకీ గత నెలలో కొత్త వర్షన్ హ్యాచ్ బ్యాక్ స్విఫ్ట్ కారును లాంచ్ చేసింది.