RCEPపై మోడీ ప్రభుత్వం వేచిచూసే ధోరణి, రాహుల్ గాంధీ విమర్శ
న్యూఢిల్లీ: రీజనల్ కాంప్రెహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్(RCEP) ఒప్పందంపై భారత్ సంతకం చేస్తే మేకిన్ ఇండియా కాస్త బై ప్రమ్ చైనాగా మారుతుందని కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ అన్నారు. ఈ ఒప్పందం అమలులోకి వస్తే దేశం మొత్తం చైనా నుంచి వచ్చే చౌక వస్తువులతో నిండిపోతుందని, దీంతో భారత్లో ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితులు వస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు రాహుల్ ట్వీట్ చేశారు.
మేకిన్ ఇండియా కాస్తా బై ఫ్రమ్ చైనాగా మారిపోతోందని, ఇప్పటికే ప్రతి భారతీయుడి కోసం ప్రతి సంవత్సరం రూ.6వేలు విలువైన ఉత్పత్తులు దిగుమతి చేసుకుంటున్నామని, 2014 తర్వాత ఇది రెండింతలు అయిందని, RCEPపై భారత్ సంతకం చేస్తే ఈ దేశం మొత్తం చైనా చవక వస్తువులతో నిండిపోతుందన్నారు. ఉద్యోగాలు పోయి ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అవుతుందన్నారు.
RCEP ఒప్పందంపై కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ కూడా ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఒప్పందం వల్ల రైతులు, చిన్న వ్యాపారుల భవిష్యత్తు అంధకారం అవుతుందన్నారు.
అసోసియేషన్ ఆప్ సౌత్ ఈస్ట్ ఆసియన్ నేషన్స్ (ఆసియాన్)లో 10 సభ్య దేశాలు ఉన్నాయి. భారత్, చైనా, జపాన్, సౌత్ కొరియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ భాగస్వామ్య దేశాలుగా ఉన్నాయి. స్వేచ్ఛా వాణిజ్యానికి సంబంధించి RCEP ఒప్పందంపై సంతకం చేస్తే ఆ మేరకు దిగుమతి సుంకాలను ఆయా దేశాలు తొలగించాల్సి ఉంటుంది.
మూడు రోజుల పాటు బ్యాంకాక్లో జరిగే ఆసియాన్ దేశాల శిఖరాగ్ర సమావేశంలో ప్రధాని మోడీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా RCEP ఒప్పందంపై సంతకం చేయాలని భారత్ తొలుత భావించింది. కానీ చైనా దిగుమతులపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ మోడీ ప్రభుత్వ వాయిదా వేయాలని చూస్తోంది. భారత ప్రయోజనాలకు అనుగుణంగానే మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తుందని దీనిని వాయిదా వేసే ఆలోచన ద్వారా మరోసారి నిరూపితం అయిందని అంటున్నారు.