క్షీణించిన అమ్మకాలు, 300 ఎగ్జిక్యూటివ్స్కు మహింద్రా కంపెనీ షాక్
దేశీయ ఆటో దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా దాదాపు 300 మంది మేనేజ్మెంట్ ఎగ్జిక్యూటివ్స్ను తొలగించింది. ఈ ఏడాది ప్రారంభం నుండి ఇంతమందిని తొలగించడం గమనార్హం. అంతకుముందు మందగమనం, గత ఏడాది కరోనా కారణంగా ఆటోమోటివ్ పరిశ్రమలో వృద్ధి మందగించింది. దీంతో ఆటో రంగ కంపెనీలు ఖర్చులు తగ్గించే దిశగా అడుగులు వేశాయి. ఇందులో భాగంగా ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న మహీంద్రా అండ్ మహీంద్రా వందలాదిమంది ఎగ్జిక్యూటివ్స్ను తొలగించింది.
మహీంద్రా మొబిలిటీ సర్వీసెస్ అధ్యక్షుడు గ్రూప్ ఎగ్జిక్యూటివ్ బోర్డ్ సభ్యుడు పార్థసారధి సహా పలువురు సీనియర్ మేనేజ్మెంట్ ఎగ్జిక్యూటివ్స్ ఇందులో ఉన్నారు. మహీంద్రా బిజినెస్ ప్లానింగ్ హెడ్ ప్రహ్లాదరావు, ఇతర సీనియర్ స్థాయి ఉద్యోగులు ఉన్నారు. మహీంద్రా అండ్ మహీంద్రా అధికారికంగా స్పందించాల్సి ఉంది.
వాహనాల విక్రయాల్లో క్షీణత కారణంగా మహీంద్రా ఈ నిర్ణయం తీసుకుంది. పునర్నిర్మాణ చర్యల్లో భాగంగా ప్రస్తుతానికి ఆటో, వ్యవసాయ విభాగానికి పరిమితమైన ఈ కోతలు మహీంద్రా రీసెర్చ్ వ్యాలీని తాకుతుందని అంటున్నారు. మహీంద్రా ఆటోమోటివ్ విభాగం ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు అమ్మకాల్లో 27.52 శాతం క్షీణించింది. పరిశ్రమల పరిమాణం 13.2 శాతం తగ్గింది. ఫిబ్రవరిలో పాసింజర్ వెహికిల్ రిటైల్ సేల్స్ 10.6 శాతం పెరిగాయి. బైక్స్ విక్రయాలు 16.08 శాతం తగ్గాయి.