క్యాష్ వోచర్, రూ.10వేల అడ్వాన్స్: ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం దీపావళి బంపర్ బొనాంజా
కరోనా నేపథ్యంలో వ్యవస్థలో ఏర్పడిన డిమాండ్ను తిరిగి పెంపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా గతంలో రూ.21 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించింది. ఉద్యోగులకు ఎన్నో వెసులుబాట్లు కల్పించింది. ఎంఎస్ఎంఈలకు ప్రభుత్వ హామీ రుణాలు అందిస్తోంది. తాజాగా ఆర్థిక వ్యవస్థలో ఉత్తేజం, డిమాండును పెంపొందించేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పలు చర్యలు ప్రకటించారు. వినిమయాన్ని పెంచేందుకు ప్రభుత్వ ఉద్యోగులకు పండుగ బంపరాఫర్ ఇచ్చారు.
రాష్ట్రాలకు నిర్మల గుడ్న్యూస్, రూ.12,000 కోట్ల వడ్డీలేని రుణం
ఎల్టీసీ క్యాష్ వోచర్లు, పండుగ అడ్వాన్స్
ప్రభుత్వ ఉద్యోగులకు ఎల్టీసీ (లీవ్ ట్రావెల్ కన్సేషన్) క్యాష్ వోచర్లు, పండుగ ప్రత్యేక అడ్వాన్స్ ఇస్తున్నట్లు నిర్మలా సీతారామన్ సోమవారం ప్రకటించారు. ఎల్టీసీ నగదును 12 శాతం ఆపై జీఎస్టీ విధించే వస్తువులపై ఖర్చు పెట్టాలని విజ్ఞప్తి చేశారు. వాటిని కూడా డిజిటల్ మాధ్యమం ద్వారా వెచ్చించాలన్నారు. వీటికి సంబంధించి జీఎస్టీ ఇన్వాయిస్ సమర్పించవలసి ఉంటుందని తెలిపారు. కరోనా కారణంగా ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిన్నదని, పేదలు, మధ్య తరగతి వారు, చిన్న పరిశ్రమలను ఆదుకునేందుకు ఆత్మనిర్భర్ ప్యాకేజీ ప్రకటించినట్లు గుర్తు చేశారు. ఇప్పుడు డిమాండుకు ఊతమిచ్చే మరోసారి చర్యలు తీసుకున్నామన్నారు.
వోచర్లు ఎక్కడైనా..
ఉత్పత్తులు కొనుగోలు చేసేందుకు వోచర్లు ఉపయోగించే అవకాశాలు కల్పిస్తున్నామని నిర్మల సీతారామన్ అన్నారు. తమకు నచ్చిన ప్రాంతానికి, తమ సొంత ఊరికి వెళ్లేందుకు ఎల్టీసీ సదుపాయం అందుబాటులో ఉందని తెలిపారు. వీటిపై ఎలాంటి ఆదాయపు పన్ను ఉండదని స్పష్టం చేశారు. ఆర్థిక వ్యవస్థలో డిమాండును వేగంగా పెంచేందుకు వినియోగదారుల నుండి డిమాండ్, మూలధన వ్యయం పెరగాల్సి ఉందన్నారు. అందుకే వివిధ రకాల చర్యలు చేపడుతున్నామని అభిప్రాయపడ్డారు.
అందుకే నగదు వోచర్ల రూపంలోకి...
కరోనా కారణంగా డిమాండ్ భారీగా పడిపోవడంతో పండుగ సమయంలో ప్యాకేజీ ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. ఈ వోచర్లతో పాటు ప్రతి ఉద్యోగికి పండుగ అడ్వాన్స్ ఇస్తారు. విహారయాత్రలు లేదా సొంత ఊళ్లకు వెళ్లేందుకు కేంద్రం నాలుగేళ్లకు ఓసారి ఉద్యోగులకు ఇస్తుంది. ఈసారి ప్రయాణాలు కష్టమైన నేపథ్యంలో ఉద్యోగులు వాటిని ఉపయోగించుకొని కన్సెషన్ లేదా డిస్కౌంట్ పొందలేకపోయారు. దీంతో డిమాండ్ పెంచే ఉద్దేశ్యంలో భాగంగా ఎల్టీసీలను నగదు ఓచర్ల రూపంలోకి మార్చింది కేంద్రం. వీటిని ఉద్యోగులు 2021 మార్చి 31వ తేదీ వరకు వినియోగించుకోవచ్చు.
ఎల్టీసీ వోచర్లపై కేంద్రం పరిమితులు.. ఇవే
ప్రస్తుత పరిస్థితుల్లో ఎల్టీసీ ఓచర్లపై కేంద్ర ప్రభుత్వం కొన్ని పరిమితులు విధించింది. కేవలం ఆహారేతర వస్తువులు మాత్రమే కొనుగోలు చేయాలి. అవి కూడా 12 శాతం అంతకంటే ఎక్కువ జీఎస్టీ అమలయ్యే ఉత్పత్తులను కొనుగోలు చేయాలి. వీటిని జీఎస్టీ నమోదిత ఔట్ లెట్లలో డిజిటల్ రూపంలో మాత్రమే కొనుగోలు చేయాలి.ఉద్యోగులు ఫేర్ కంటే మూడు రెట్ల వస్తువులు/సేవలు కొనుగోలు చేయవచ్చు. మార్చి 2021 నాటికే ఈ స్కీం ముగుస్తుంది.
పండుగ అడ్వాన్స్
ఉద్యోగులకు పండుగ అడ్వాన్స్ పథకాన్ని పునరుద్ధరిస్తున్నట్లు నిర్మల తెలిపారు. రూ.10,000 వడ్డీ లేని అడ్వాన్స్ ఇస్తున్నామని, దీనిని 10 వాయిదాలలో చెల్లించాలని తెలిపారు. ఇది కూడా మార్చి 31, 2021 నాటికి ముగియనుంది. ఇది ప్రీ-పెయిడ్ రూపే కార్డుగా ఇవ్వబడుతుందన్నారు. ఫెస్టివెల్ బోనస్ను ఒకేసారి ఇవ్వనున్నారు.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇందుకోసం రూ.4,000 కోట్లు ఇస్తారు. రాష్ట్రాల ఉద్యోగులకు కూడా ఈ ప్రయోజనాలు అందితే రూ.8,000 కోట్లు అవుతుంది. అంటే వ్యవస్థలోకి రూ.8వేల కోట్ల మేర డిమాండ్ పుంజుకుంటుందని నిర్మల తెలిపారు.