COVID 19 ఎఫెక్ట్: ప్రజారవాణా, షేరింగ్కు చెక్! చిన్నకార్లు, యూజ్డ్ కార్లకు భారీ డిమాండ్
కరోనా మహమ్మారి మనిషి గమనాన్ని మార్చివేస్తోంది. ఈ వైరస్ కారణంగా లాక్ డౌన్ ఎత్తివేసిన తర్వాత సామాజిక దూరం పాటించే క్రమంలో భాగంగా చాలామంది వ్యక్తిగత వాహనాలు కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపుతారని ఆటోమొబైల్ కంపెనీలు భావిస్తున్నాయి. ప్రజా రవాణా కంటే పర్సనల్ వెహికిల్స్ మేలు అని భావించే వారి సంఖ్య పెరుగుతుందని చెబుతున్నాయి.
హైదరాబాద్, విశాఖపట్నంల్లోను జియోమార్ట్: ఆకర్షణీయ డిస్కౌంట్, నేరుగా రైతుల నుండే...
చిన్న కార్లకు డిమాండ్ పెరిగే అవకాశం
మారుతీ సుజుకీ, హోండా, టయోటా, టాటా మోటార్స్ సహా వివిధ సంస్థలు లాక్ డౌన్ ఎత్తివేసిన తర్వాత వ్యక్తులు పర్సనల్ వెహికిల్స్ కోసం మొగ్గు చూపడం వల్ల సేల్స్ పెరుగుతాయని అంచనా వేస్తున్నాయి. వ్యక్తిగత, కుటుంబ ప్రయాణం కోసం వాహనాల కొనుగోళ్లు పెరుగుతాయని భావిస్తున్నాయి. లాక్ డౌన్ తర్వాత తక్కువ ధరలలో లభ్యమయ్యే చిన్న కార్లకు డిమాండ్ పెరిగే అవకాశం ఉందని మారుతీ సుజుకీ చెబుతోంది.
సేల్స్ పాయింట్స్ వద్ద ఇది గమనించాం
కరోనా - లాక్ డౌన్ వల్ల ఆర్థిక కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోయాయని, అలాగే ఉద్యోగులకు వేతనాల్లో కోత వంటి ప్రభావం వల్ల కొనుగోలు శక్తిపై ప్రభావం పడిందని, అందుకే తక్కువ ధరలలోని చిన్న కార్లకు ఎక్కువ డిమాండ్ ఉండవచ్చునని, కొద్ది రోజులుగా కార్యకలాపాలు సాగిస్తున్న 1800 సేల్స్ పాయింట్స్ వద్ద తాము దీనిని గమనించామని మారుతీ సుజుకీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మార్కెటింగ్, సేల్స్ శశాంక్ శ్రీవాత్సవ అన్నారు.
ఆర్థిక ఒత్తిళ్లు
గతంలో వినియోగదారులు ఆర్థిక ఒత్తిళ్లు ఎదుర్కొన్న పలు సందర్భాల్లోను ఇదే ధోరణి కనిపించిందని ఆటోరంగ సంస్థలు చెబుతున్నాయి. ప్రజల కొనుగోలు శక్తి తగ్గడం వల్ల ఎంట్రీ లెవల్ కార్లకు డిమాండ్ పెరుగుతుందని హోండా కార్స్, టయోటా తదితర కంపెనీల ప్రతినిధులు కూడా చెబుతున్నారు.
షేరింగ్కు చెక్..!
కరోనా కారణంగా ప్రజారవాణా, షేరింగ్ మొబిలిటీ తగ్గుతుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. అందుకే ఎంట్రీ లెవల్ కార్లతో పాటు ఉపయోగించిన కార్లకు (యూజ్డ్ కార్లు) కూడా డిమాండ్ పెరుగుతుందని మార్కెట్ వర్గాల అంచనా. కొనుగోలుదారులు ప్రస్తుత పరిస్థితుల్లో బ్రాండ్ నేమ్ కంటే మంచి నిర్వహణతో కలిగిన కార్లను ఎంచుకుంటారని చెబుతున్నారు. తక్కువ ధరలో ఉండే ఎంట్రీ లెవల్ కార్లకు డిమాండ్ పెరిగినా పరిశ్రమకు రెవెన్యూ పరంగా నిరాశ తప్పకపోవచ్చునని భావిస్తున్నారు.