SBIపై ఉద్యోగాలు, వేతనాల కోత ప్రభావం తక్కువ, యోనో ద్వారా ప్రత్యేక పథకాలు
కరోనా మహమ్మారి, లాక్ డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగాల కోత, వేతనాల కోత ఉన్న విషయం తెలిసిందే. మన దేశంలో కోట్లాది మందిపై ఈ ప్రభావం పడింది. అయితే వేతనాల కోత, ఉద్యోగాల తొలగింపు తమపై పాక్షిక ప్రభావం చూపుతుందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) చైర్మన్ రజనీష్ కుమార్ అన్నారు. ఈ మేరకు ఆయన బ్యాంకు షేర్ హోల్డర్స్కు లేఖ రాశారు.
డిస్కౌంట్ తగ్గింది! రికార్డ్ దిశగా.. భారీగా పెరగనున్న బంగారం ధర
కరోనా సవాళ్లను అధిగమిస్తాం
ఆర్థిక ఒత్తిళ్ళు ఎన్ని ఉన్నప్పటికీ, 2019-20 ఆర్థిక సంవత్సరం బలమైన పని తీరును ప్రదర్సించామని, ఈ ఆర్థిక సంవత్సరంలోను అదే ఒరవడి కొనసాగిస్తామని, కరోనా మహమ్మారి సవాళ్లను అధిగమిస్తామని విశ్వాసం ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతానికి 21.8% మంది ఖాతాదారులు మాత్రమే మారటోరియం ప్రయోజనం పొందుతున్నారని, లాక్ డౌన్ సమయంలో 98% శాఖలు, 91% ప్రత్యామ్నాయ ఛానల్స్ కార్యకలాపాలు కొనసాగాయన్నారు.
ప్రభుత్వ శాఖలకు ఎస్బీఐ గుర్తింపు పొందిన బ్యాంకు
ప్రభుత్వానికి సంప్రదాయ ఎంపికగా ఎస్బీఐ ఉంటోందని, కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, విభాగాలకు ఎస్బీఐనే గుర్తింపు పొందిన బ్యాంక్ అన్నారు. ఎస్బీఐకి ఎక్కువగా ప్రభుత్వ, ఖాసీ ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారని, దీంతో ఉద్యోగ కోతలు, తగ్గింపుల ప్రభావం తక్కువగా ఉంటుందన్నారు. ప్రభుత్వం తీసుకు వచ్చిన ఈ-గవర్నెన్స్ కార్యక్రమానికి ఎస్బీఐ తన వంతు సాయం అందిస్తోందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ-సొల్యూషన్స్ అభివృద్ధి చేసేందుకు సహకరిస్తోందన్నారు. ఆన్లైన్ విధానంలోకి మారడం ద్వారా కస్టమర్లకు మరింత ఈజీ అవుతుందన్నారు.
ఆర్థిక వ్యవస్థ క్షీణించే అవకాశం
2019-20 ఆర్థిక సంవత్సరంలో ఎస్బీఐ మొత్తం ప్రభుత్వ వ్యాపార టర్నోవర్ రూ.52,62,643 కోట్లుగా నమోదయిందని, ఎన్నడూ లేని విధంగా గత ఆర్థిక సంవత్సరంలో ఎస్బీఐ రూ.14,488 కోట్ల నికర లాభాన్ని ఆర్జించిందన్నారు. అంతకుముందు ఏడాది నికర లాభం రూ.862 కోట్లు మాత్రమేనని తెలిపారు. కరోనా కారణంగా అనిశ్చితి కొనసాగే అవకాశముందని, ప్రపంచం మొత్తం తీవ్ర ఆర్థిక మాంద్యంలోకి జారుకునే ప్రమాదం లేకపోలేదన్నారు. మన దేశ ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాది క్షీణించే అవకాశముందన్నారు.
యోనో యాప్ ద్వారా ప్రత్యేక పథకాలు
కరోనా కారణంగా ఇకపై అకౌంట్ హోల్డర్స్ ఎక్కువగా డిజిటల్ ట్రాన్సాక్షన్స్ వైపు మొగ్గు చూపే అవకాశాలు ఉంటాయని రజనీష్ కుమార్ అన్నారు. అందుకే తమ యోనో యాప్ను ఎక్కువ మంది వినియోగించుకునేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఆరు నెలల్లో యోనో డౌన్ లోడ్స్ డబుల్ అయ్యేలా చూడటంతో పాటు దీని ద్వారా హోమ్ లోన్, వెహికిల్ లోన్, పర్సనల్ లోన్ వంటి ప్రత్యేక పథకాలు అందించి యాప్ను బలోపేతం చేస్తామన్నారు.