కీలక నిర్ణయం, LICలో చైర్మన్ పోస్ట్ రద్దు: ఇక సీఈవో, ఎండీ పోస్టులే
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పబ్లిక్ ఆఫర్(IPO)కు వస్తోన్న లైఫ్ ఇన్సురెన్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా(LIC)కు ఇకపై చైర్మన్ ఉండరు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం మార్పులు చేసింది. ఇకపై ఎల్ఐసీకి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్(CEO), మేనేజింగ్ డైరెక్టర్(MD) పోస్టులు మాత్రమే ఉంటాయి. ఈ పోస్టులను కేంద్ర ప్రభుత్వం భర్తీ చేస్తుంది. ఆర్థిక మంత్రిత్వ శాఖ నేతృత్వంలోని ఆర్థిక సేవల విభాగం ఈ మేరకు LIC చట్టం 1956 నిబంధనలను మార్చింది. జులై 7వ తేదీన గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
LIC నమోదును సులభతరం చేసేందుకు వీలుగా అధీకృత మూలధనాన్ని రూ.25,000 కోట్లకు పెంచేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. లిస్టింగ్ సమయంలో రూ.లక్ష కోట్లకు పైగా మార్కెట్ వ్యాల్యూ కలిగిన కంపెనీలు ఐదు శాతం వాటా మాత్రమే విక్రయించవచ్చుననే నిబంధన సవరణ కూడా LIC ఐపీవోను దృష్టిలో పెట్టుకొని చేసింది.
ఇదిలా ఉండగా, జొమాటో పబ్లిక్ ఇష్యూ ఈ నెల 14న ప్రారంభమవుతోంది. 16వ తేదీన ముగియనుంది. ప్రతిపాదిత ఇష్యూలో భాగంగా విక్రయించే షేర్లకు రూ.72 నుండి రూ.76ను ధరల శ్రేణిగా నిర్ణయించారు. ఈ ఇష్యూ ద్వారా జొమాటో రూ.9375 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. ఐపీవోలో భాగంగా రూ.9000 కోట్ల వ్యాల్యూ కలిగిన కొత్త షేర్లను జొమాటో జారీ చేస్తుంది.