LIC Housing Finance కీలక నిర్ణయం: ఆ లోన్లపై కనీస వడ్డీరేటు పెంపు: ఈఎంఐ మోత
ముంబై: భారతీయ రిజర్వుబ్యాంక్ రేపోరేటును పెంచిన ప్రభావం ఈజీ మంత్లీ ఇన్స్టాల్మెంట్లపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. దాదాపుగా బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు తమ వడ్డీ రేట్లను పెంచడం ఆరంభించాయి. ఇప్పటికే పలు కార్పొరేట్ బ్యాంక్స్ ఈ దిశగా చర్యలు తీసుకున్నాయి కూడా. బ్యాంకులు, ఎన్బీఎఫ్సీల నుంచి రుణాలను తీసుకున్న వారిపై ఈఎంఐల అదనపు భారం పడింది. ఈ జాబితా మరింత పెరుగుతూ పోతోంది.
తాజాగా నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ కేటగిరీకి చెందిన ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్- అదే బాటలో నడిచింది. కనీస రేటును పెంచింది. ఈ మేరకు ఈ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ విశ్వనాథ గౌడ్ ఓ ప్రకటన విడుదల చేశారు. కనీస రేటు 6.90 శాతానికి పెంచినట్లు తెలిపారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన రేపోరేట్ బేసిస్ పాయింట్లను 40కి పెంచడం వల్ల ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని వివరించారు.
ఇకపై గృహాల నిర్మాణానికి ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ నుంచి తీసుకున్న రుణానికి కనీసం 6.90 శాతం మేర వడ్డీని చెల్లించాల్సి ఉంటుంది. ఇదివరకు ఈ మొత్తం 6.70 శాతంగా ఉండేది. దీన్ని సవరించిందా కంపెనీ. 20 పాయింట్లను జత చేసింది. పెంచిన కనీస వడ్డీ రేటు తక్షణమే అమల్లోకి తీసుకొచ్చినట్లు విశ్వనాథ గౌడ తెలిపారు. చాలాకాలం తరువాత తాము పాలసీ రేట్లను సవరించాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ఈఎంఐల భారం పెద్దగా పడకపోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.
సిబిల్ స్కోర్ 700 పాయింట్లు, అంతకుమించి ఉన్న రుణగ్రహీతలకు 20 బేసిస్ పాయింట్సే వర్తిస్తాయని ఆయన వివరించారు. తమ తాజా నిర్ణయం వల్ల గృహ నిర్మాణ అవసరాల కోసం రుణాలను తీసుకున్న వారు చెల్లించే ఈఎంఐల్లో చెప్పుకోదగ్గ మార్పు ఉండకపోవచ్చని అన్నారు. ప్రజల నుంచి లభిస్తోన్న ఆదరణలో మార్పు కూడా ఉండబోదని, కనీస రేటును పెంచిన ప్రభావం తమ సంస్థపై ఉండదని విశ్వనాథ గౌడ్ పేర్కొన్నారు.