14% తగ్గిన జీఎస్టీ వసూళ్లు, వారికి ఫైలింగ్కు సెప్టెంబర్ దాకా వెసులుబాటు
గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్(GST) వసూళ్లు జూలై నెలలో తగ్గాయి. కరోనా నేపథ్యంలో వివిధ కారణాల వల్ల ఈ తగ్గుదల నమోదయింది. జూలై నెలలో జీఎస్టీ వసూళ్లు రూ.87,422 కోట్లుగా నమోదయినట్లు కేంద్ర ఆర్థికమంత్రిత్వ శాఖ శనివారం వెల్లడించింది. ఇందులో సీజీస్టీ రూ.16,147 కోట్లు, ఎస్జీఎస్టీ రూ.21,418 కోట్లు, ఐజీఎస్టీ రూ.42,592 కోట్లు ఉంది. ఇందులో గూడ్స్ ఇంపోర్ట్స్ ద్వారా రూ.20,324 కోట్లు వచ్చాయి. సెస్ ద్వారా రూ.7,265 కోట్లు రాగా, ఇందులో రూ.807 కోట్లు గూడ్స్ ఇంపోర్ట్స్ ద్వారా వచ్చినట్లు తెలిపింది.
ప్రభుత్వానికి భారీగా తగ్గిన ట్యాక్స్ రెవెన్యూ, కార్పోరేట్ రెవెన్యూ తగ్గుదల 23.2 శాతం
గత జూలైతో పోలిస్తే 14.3 శాతం తగ్గుదల
రెవెన్యూ కలెక్షన్లు జూన్ నెల నుండి తగ్గుతున్నాయి. గత నెలలో జీఎస్టీ వసూళ్లు రూ.90,917గా నమోదయ్యాయి. 2019 జూలై నెలలో రూ.1.02 లక్షల కోట్లుగా ఉంది. జూన్ నెలతో పోలిస్తే జూలై నెలలో కలెక్షన్స్ 3.8 శాతం తగ్గాయి. గత ఏడాది జూలైతో పోలిస్తే మాత్రం ఏకంగా 14.3 శాతం మేర పడిపోయాయి. కరోనా మహమ్మారి కారణంగా జనాలు బయటకు రావడం తగ్గింది. దీంతో ఆర్థిక కార్యకలాపాలపై ప్రభావం పడింది.
పన్ను చెల్లింపులు
గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఆదాయం 86 శాతం అని కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. గత నెలలో వచ్చిన ఆదాయాలు జూలై నెల కంటే ఎక్కువగా ఉన్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ మాసాలకు సంబంధించిన పన్నులను జూన్ నెలలో పెద్ద సంఖ్యలో పన్ను చెల్లింపుదారులు చెల్లించారని తెలిపింది. అలాగే ఐదు కోట్ల కంటే తక్కువగా టర్నోవర్ కలిగిన పన్ను చెల్లింపుదారులు 2020 సెప్టెంబర్ వరకు రిటర్న్స్ దాఖలు చేసేందుకు సడలింపు ఉన్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది.
జూన్లో 9 శాతానికి తగ్గుదల
సుదీర్ఘ లాక్ డౌన్ కారణంగా 2020-21 ఆర్థిక సంవత్సరం ప్రారంభ నెల నుండి జీఎస్టీ వసూళ్లపై భారీ ప్రభావం పడిన విషయం తెలిసిందే. మార్చి 25వ తేదీన ప్రారంభమైన లాక్ డౌన్ మే 8 వరకు కొనసాగింది. ఆ తర్వాత అన్-లాక్ ప్రారంభమైంది. లాక్ డౌన్ కాలంలోని ఏడాది ప్రాతిపదికన ఏప్రిల్లో జీఎస్టీ వసూళ్లు రూ.72 శాతం పడిపోయి 32,172 కోట్లకు, మే నెలలో 38 శాతం క్షీణించి 62,151కోట్లకు తగ్గింది. జూన్ నెలలో మాత్రం 9 శాతమే తగ్గాయి. అయితే ఈ నెలలో తగ్గుదల 14 శాతానికి పెరిగింది.