తప్పకుండా మంచిరోజులొస్తాయి: భారత ఆర్థిక వ్యవస్థ, ఈరంగాల్లో ఉద్యోగాలపై ధీమా
భారత ఆర్థిక వ్యవస్థ తిరిగి కోలుకుంటుందని, మంచి రోజులు వస్తాయని ఎక్కువ మంది ఉద్యోగార్థులు ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు. కరోనా నేపథ్యంలో ప్రపంచ, భారత ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిన్న విషయం తెలిసిందే. చాలామంది ఉద్యోగాలు పోయాయి. కంపెనీలు వేతనాల్లో కోత విధించారు. అయితే మన దేశ ఆర్థిక వ్యవస్థపై ఉద్యోగార్థులు విశ్వాసంతో ఉన్నారు. ఈ మేరకు లింక్డిన్ సర్వేలో వెల్లడైంది.
మైక్రోసాఫ్ట్ అంటే ఇష్టం, సర్వేలో ఇండియా కంపెనీలు మూడు: ఉద్యోగులు ఏం చెప్పారంటే?
ఉద్యోగార్థుల్లో కొత్త ఆశలు
భారత ఆర్థిక వ్యవస్థ తిరిగి త్వరలో కోలుకుంటుందని, మంచిరోజులు వస్తాయని, తమ కెరీర్ బాగుంటుందని ఎక్కువమంది ఉద్యోగార్థులు లింక్డిన్ సర్వేలో విశ్వాసం వ్యక్తం చేశారు. జూన్ ప్రథమార్థంతో పోలిస్తే ద్వితీయార్థంలోనే ఆర్థిక పరిస్థితులపై విశ్వాసం పెరిగినట్లు లింక్డిన్ వర్క్ ఫోర్స్ కాన్ఫిడెన్స్ ఇండెక్స్లో వెల్లడైంది. కరోనా నేపథ్యంలో లాక్డౌన్ విధించడంతో కార్యకలాపాలు ఆగిపోయాయి. జూన్ రెండో వారం నుండి క్రమంగా కార్యకలాపాలు పుంజుకుంటున్నాయి.
ఈ రంగాల్లో ఉద్యోగ అవకాశాలు..
ఈ సర్వేను జూన్ 15వ తేదీ నుండి 28వ తేదీ మధ్య చేశారు. ఈ సర్వేలో 1,303 మంది పాల్గొన్నారు. కాన్ఫిడెన్స్ ఇండెక్స్ అంతకుముందు వారం 48 ఉండగా, ఇప్పుడు 50కి చేరుకుంది. ఆర్థిక వ్యవస్థ కోలుకుంటుందని ఉద్యోగార్థులు, ఉద్యోగులు, ప్రజల్లో ఉన్న విశ్వాసాన్ని ఇది వెల్లడిస్తోందని చెబుతున్నారు. వరుసగా ఆర్థిక కార్యకలాపాలు పుంజుకుంటున్న క్రమంలో ఈ-కామర్స్, ఐటీ సేవలు, బీమా, గేమింగ్ తదితర రంగాల్లో ఉద్యోగావకాశాలు కనిపిస్తుండగా, నిరుద్యోగుల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నట్లు ఈ సర్వేలో వెల్లడైంది.
ఉద్యోగుల్లో పెరిగిన భద్రతాభావం
మొత్తానికి జాబ్ సీకర్స్ ఉద్యోగ భద్రత విషయంలో గతంలో కంటే ఆశావహంగా ఉన్నట్లు ఈ సర్వేలో తేలింది. వ్యాపారాలు క్రమంగా తెరుచుకోవడంతో పాటు కొత్త ఉత్పత్తులు, కొత్త సేవలకు డిమాండ్ ఉండబోతోందని అంటున్నారు. ఏప్రి, మే నెలతో పోలిస్తే జూన్ నెలలో నిరుద్యోగిత రేటు కూడా భారీగా తగ్గిన విషయం తెలిసిందే.