మరో భారీ ఒప్పందం దిశగా..: జియోలో పెట్టుబడికి అమెరికా, సౌదీ కంపెనీల చూపు
ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుబంధ జియో ప్లాట్పామ్స్లోకి గత రెండు మూడు వారాల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా మరిన్ని దిగ్గజ కంపెనీలు జియో వైపు చూస్తున్నాయి. సౌదీ అరేబియా, అమెరికా కంపెనీలు రిలయన్స్ జియోలో వాటాలు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నాయని వార్తలు వస్తున్నాయి.
రిలయన్స్ జియోలో మరో భారీ పెట్టుబడి, రూ.11,367తో అమెరికా టెక్ ఫండ్ కంపెనీ
వాటా కొనుగోలుకు సౌదీ కంపెనీ ఆసక్తి
మెగా ఒప్పందాలతో గత మూడు వారాల్లో హ్యాట్రిక్ కొట్టిన రిలయన్స్ నాలుగో ఒప్పందానికి దగ్గరలో ఉందని అంటున్నారు. పెట్రో కొమికల్స్ వ్యాపార కార్యకలాపాలు విస్తరించేందుకు ప్రయత్నిస్తున్న ముఖేష్ అంబానీ తాజాగా 320 బిలియన్ డాలర్ల ఒప్పందాన్ని చేసుకోనున్నారట. ఈ సౌదీ అరేబియా పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ (PIF)... రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ జియో ప్లాట్ఫాం యూనిట్లో మైనార్టీ వాటాను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తోందని వార్తలు వస్తున్నాయి.
అమెరికా పెట్టుబడుల సంస్థ
ఎయిర్ బీఎన్బీ, ఉబెర్ టెక్నాలజీస్లకు నిధులు సమకూర్చిన అమెరికా పెట్టుబడుల సంస్థ జనరల్ అట్లాంటిక్ కూడా జియో ప్లాట్ఫాంలో దాదాపు 850 మిలియన్ డాలర్ల నుండి 900 మిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టే అంశంపై చర్చలు జరుపుతోందని తెలుస్తోంది. ఒప్పందం ఖరారు కాలేదు. ఈ నెలలో ఒప్పందం పూర్తి కావొచ్చునని భావిస్తున్నారు.
పెట్టుబడుల వెల్లువ
జియో ప్లాట్ఫాంలో ఇటీవలి కాలంలో తొలుత ఫేస్బుక్ 5.7 బిలియన్ డాలర్లు (రూ.43, 574 కోట్లు) ఇన్వెస్ట్ చేసి 9.99 శాతం వాటాను దక్కించుకుంది. సిల్వర్ లేక్ రూ.5,655 కోట్లతో 1 శాతం వాటాను దక్కించుకుంది. ఆ తర్వాత రూ.11,367 కోట్ల పెట్టుబడితో విస్టా ఈక్విటీ 2.3 శాతం వాటాను దక్కించుకుంది. అంటే ఈ రెండు కంపెనీలు 2.25 బిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడి పెడుతున్నాయి. మొత్తం రూ.60,596.37 కోట్లు లేదా దాదాపు 8 బిలియన్ డాలర్లు సమీకరించింది జియో. ఇప్పుడు అమెరికా, సౌదీ కంపెనీలు మరిన్ని పెట్టుబడులు పెట్టనున్నాయి.