లక్షల కోట్ల రూపాయల సంపద ఆవిరి: భారీగా నష్టపోయిన షేర్లు ఇవే
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్ పతనం కొనసాగుతోంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేట్ను పెంచిన తరువాత ఆరంభమైన ఈ క్షీణత ఇవ్వాళ కూడా కనిపించింది. ఇన్వెస్టర్లకు మరో బ్లాక్ ఫ్రైడేలా మారింది. తొలి గంటలోనే సెన్సెక్స్, నిఫ్టీ భారీగా పతనం అయ్యాయి. సెన్సెక్స్లో ఉన్న షేర్లన్నీ రెడ్ జోన్లో కనిపించాయి. గురువారం నాటి ట్రేడింగ్తో పోల్చి చూస్తే.. ఇవ్వాళ అన్నీ నష్టాల్లో ఉన్నాయి. మైనస్లల్లో పడిపోయాయి. దాదాపు అన్ని సెగ్మెంట్స్కు చెందిన షేర్ల పరిస్థితీ ఇంతే. చివరి గంట ఎలా ఉంటుందనేది వేచి చూడాలి.
830 పాయింట్లు నష్టం..
ఇవ్వాళ కూడా పతనం కొనసాగుతోంది. తొలి గంటలోనే 980.45 పాయింట్ల మేర నష్టపోయింది సెన్సెక్స్. ఆరంభం నుంచే రెడ్ జోన్లో ట్రేడింగ్ అవుతూ వచ్చింది. సమయం గడుస్తోన్న కొద్దీ షేర్లన్నీ మైనస్లోకి వెళ్లిపోవడం కనిపించింది. ఏ దశలో కూడా అప్పర్ సర్కుట్కు చేరుకోలేకపోయింది. తొలి గంట ముగిసే సమయానికి 54,721.78 పాయింట్ల వద్ద సెన్సెక్స్ ట్రేడింగ్ నమోదైంది. ఇది కొనసాగుతోంది. సాయంత్రానికి 1200 నుంచి 1300 పాయింట్ల వరకు సెన్సెక్స్ నష్టపోయే అవకాశం లేకపోలేదని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తోన్నాయి.
నిఫ్టీదీ అదే దారి..
నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ కూడా ఇదేరకమైన పతనాన్ని చవి చూసింది. తొలి గంటలో 300.15 పాయింట్లను నష్టపోయింది. 16,382.50 పాయింట్ల వద్ద నిఫ్టీ తొలి గంటలో ట్రేడింగ్ నమోదు చేసుకుంది. బజాజ్, మారుతి, విప్రో, అల్ట్రాటెక్ సిమెంట్స్, హెచ్సీఎల్ టెక్, యాక్సిస్ బ్యాంక్, ఇన్ఫోసిస్, హిందుస్థాన్ యూనిలివర్, టాటా స్టీల్స్ తొలి గంటలో తీవ్రంగా నష్టపోయాయి. ఆయా కంపెనీల షేర్ల ధరలు మూడు శాతం మేర క్షీణించాయి.
అన్ని సెగ్మెంట్లపైనా ప్రభావం..
నిఫ్టీలో టాటా మోటార్స్, హిండాల్కో, అపోలో హాస్పిటల్స్.. నష్టపోయాయి. బోంబే స్టాక్ ఎక్స్ఛేంజ్లో మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఇండైసెస్ అన్నీ 2.2 శాతం మేర నష్టాలను చవి చూశాయి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, బ్యాంకింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆటోమొబైల్స్, ఫైనాన్సియల్ సర్వీసెస్.. ఇలా అన్ని సెగ్మెంట్స్కు చెందిన షేర్లన్నీ రెడ్ జోన్లో ట్రేడ్ అయ్యాయి. వోల్టాస్ షేర్లు- ఏకంగా ఏడు శాతం మేర నష్టపోయాయి. విప్రో 52 వారాల తరువాత కనిష్ఠాన్ని నమోదు చేసుకుంది.
రూ.5.12 లక్షల కోట్లు ఆవిరి..
రెండు రోజుల్లో 5.12 లక్షల కోట్ల రూపాయల సంపదను ఇన్వెస్టర్లు కోల్పోయారు. గురువారం నాడు చోటు చేసుకున్న పతనం సందర్భంగా 259.64 కోట్ల రూపాయల మేర నష్టాన్ని చవి చూశారు మదుపర్లు. అదే తరహా పతనం ఇవ్వాళ కూడా కనిపించిన నేపథ్యంలో మరో 254.52 లక్షల కోట్ల రూపాయలను నష్టపోవాల్సి వచ్చింది. సెన్సెక్స్ టాప్ 30 స్టాక్స్ అన్నీ రెడ్జోన్లో ఉన్నాయి. మొత్తంగా 2,139 కంపెనీల షేర్లు నెగెటివ్ ట్రెండ్లో ట్రేడ్ అవుతున్నాయి. మరో 67 షేర్లల్లో మార్పు లేదు. మరో 383 షేర్లు ఫర్వాలేదనిపించుకుంటున్నాయి.
భారీగా నష్టపోయిన షేర్లు ఇవే..
బజాజ్ ఫైనాన్స్-3.13 శాతం మేర నష్టపోయింది. బజాజ్ ఫైన్సర్వ్-3, ఎఫ్ఎంసీజీ సెగ్మెంట్కు చెందిన హెచ్యూఎల్-2.73, మారుతి సుజుకి-3.3, విప్రో-2.77 శాతం మేర నష్టపోయాయి. గురువారం నాటి ముగింపు లావాదేవీలతో పోల్చుకుని చూస్తే ఈ ఉదయం ఈ మేర ధరలను నష్టపోయాయి. సాయంత్రం వరకూ ఇదే రకమైన నెగెటివ్ ట్రెండ్ కనిపించవచ్చని మార్కెెట్ వర్గాలు విశ్లేషిస్తోన్నాయి.