మారటోరియం సమయంలో ఈఎంఐలపై వడ్డీ..సుప్రీంలో పిటీషన్..ఆర్బీఐ, కేంద్రానికి నోటీసులు
కరోనా లాక్ డౌన్ సమయంలో ఆర్బీఐ సామాన్య , మధ్యతరగతి ప్రజలకు మూడు నెలల పాటు రుణాలు తాత్కాలిక నిషేధం విధిస్తూ మారటోరియం ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ మారటోరియం సమయంలో ఈ వ్యవధిలో పేరుకుపోయిన రుణ వాయిదాలపై కూడా బ్యాంకులు వడ్డీని వసూలు చేయడాన్ని సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో ఒక పిటీషన్ దాఖలైంది . ఇక అలా దాఖలైన పిటిషన్పై నేడు వాదనలు జరగగా కేంద్ర ప్రభుత్వం, ఆర్బీఐకి సుప్రీంకోర్టు మంగళవారం నోటీసులు జారీ చేసింది.
మారటోరియం సమయంలో చెల్లించని వాయిదాలపై వడ్డీ భారం .. పిటీషన్ దాఖలు
కరోనా లాక్ డౌన్ తో దేశం మొత్తంగా ప్రజలు ఇంటికే పరిమితం అయ్యారు. ఇక ప్రజల ఇబ్బందిని దృష్టిలో పెట్టుకుని ఆర్బీఐ ఈఎంఐల చెల్లింపుపై మారటోరియంను మూడు నెలల పాటు విధించింది. ఇక కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో ఇంకా జనజీవనం సాధారణ స్థితికి రాకపోవటంతో మరోమారు ఆగస్ట్ 31 వరకూ ఆర్బీఐ మారటోరియం ను పొడిగించింది. అయితే ఆ తరువాత మారటోరియం సమయంలో చెల్లించని వాయిదాలపై కూడా వడ్డీ వేస్తున్నారని సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది.
చెల్లించని వాయిదాలపై చక్రవడ్డీతో వెన్ను విరుస్తున్నారని వాదన
ఆర్బీఐ ముందు రుణ వాయిదాల చెల్లింపుపై మూడు నెలల మారటోరియం ప్రకటించి మరో మూడు నెలల పాటు పొడిగించిందని పిటిషనర్ తరపు వాదనలు వినిపించిన సీనియర్ అడ్వకేట్ రాజీవ్ దత్తా పేర్కొన్నారు. కోవిడ్-19 సంక్షోభ సమయంలో ఇప్పుడు ఉపశమనం అవసరమని, చెల్లించని వాయిదాలపై వడ్డీ వేస్తూ చక్రవడ్డీతో వెన్ను విరుస్తున్నారని, ఇక అలా చెయ్యకుండా బ్యాంకులకు ఆదేశాలు ఇవ్వాలని పిటీషనర్ తరపు న్యాయవాది సుప్రీం ధర్మాసనాన్ని అభ్యర్ధించారు.
మారటోరియం సమయంలో రుణ వాయిదాలపై వడ్డీ రాజ్యాంగ విరుద్ధం
దేశవ్యాప్త లాక్డౌన్తో ప్రజల రాబడి పడిపోయిన క్రమంలో మారటోరియం సమయంలో కూడా రుణ వాయిదాలపై బ్యాంకులు వడ్డీ వసూలు చేయడం అన్యాయమని ఆందోళన వ్యక్తం చేశారు. లాక్డౌన్తో ప్రజలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న క్రమంలో మారటోరియం సమయంలో చెల్లించని రుణ వాయిదాలపై వడ్డీ భారం సామాన్యులకు పెను భారం అని ఆయన అన్నారు. ఇది రాజ్యాంగ విరుద్ధమని అన్నారు.
కేంద్ర ప్రభుత్వం, ఆర్బీఐని కోరుతూ నోటీసులు జారీ
ఇక అంతే కాదు కరోనా కష్టకాలంలో ఊహించని విధంగా ప్రజలు ఉద్యోగాలు కోల్పోయారని , కరోనా వైరస్ సంక్షోభంతో వివిధ రంగాల్లో పనిచేసే పలువురు ఉద్యోగులను జీతం చెల్లించకుండా యాజమాన్యాలు సెలవుపై వెళ్లాలని కోరాయని ఆయన పేర్కొన్నారు . ఇలాంటి పరిస్థితిలో వారు ఎలా వాయిదాలు చెల్లిస్తారని అన్నారు. పిటిషన్ను విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు దీనిపై స్పందించాలని కేంద్ర ప్రభుత్వం, ఆర్బీఐని కోరుతూ నోటీసులు జారీ చేసింది. ఈ పిటిషన్పై వచ్చే వారం విచారణ కొనసాగుతుందని కోర్టు స్పష్టం చేసింది.