బంగారం అమ్ముకుని స్వదేశానికి- గల్ఫ్ కార్మికుల కష్టాలు..
దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించలేదంటే ఇదే అనిపిస్తుంది గల్ఫ్ దేశాల్లో భారతీయ వలసకార్మికుల పరిస్ధితి చూస్తుంటే. కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా గల్ఫ్ దేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం వందే భారత్ పేరుతో ప్రత్యేక విమానాలను నడుపుతోంది. మే 7వ తేదీనే ఈ విమానాల రాకపోకలు ప్రారంభమయ్యాయి. వాస్తవానికి ఈ విమానాల్లో గల్ఫ్ దేశాల నుంచి భారతీయులు స్వదేశాలకు చేరుకునే వీలుంది. కానీ ఇప్పుడు గల్ఫ్ కార్మికుల వద్ద డబ్బులు లేకపోవడంతో వారి పరిస్దితి దయనీయంగా మారింది.
గల్ఫ్ దేశాల్లో భారతీయుల వెతలు..
గల్ఫ్ దేశాల్లో భారతీయుల సంఖ్య లక్షల్లోనే ఉంది. వీరిలో వలస కార్మికుల సంఖ్య చాలా ఎక్కువ. కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా ప్రస్తుతం గల్ఫ్ దేశాల్లో పరిశ్రమలు పనిచేయడం లేదు. ప్రధానంగా చమురు ఎగుమతులపై ఆధారపడిన అక్కడి పరిశ్రమలు ప్రపంచ దేశాల్లో చమురు డిమాండ్ పడిపోయిన నేపథ్యంలో సహజంగానే మూతపడ్డాయి. దీంతో వీటిలో పనిచేస్తున్న భారతీయ వలస కార్మికుల పరిస్ధితి దారుణంగా మారింది. అలాగని స్వదేశానికి వెళ్లిపోదామంటే పరిస్ధితులే కాదు ఆర్ధిక పరిస్ధితీ సహకరించడం లేదు.
యూఏఈలో బంగారం అమ్ముకుంటున్న కార్మికులు.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో లాక్ డౌన్ కారణంగా చిక్కుపోయిన భారతీయ వలస కార్మికులను వెనక్కి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక విమానాలను పంపిం౦ది. అయితే ఇవి ఉచితం కాదు. వీటిలో భారత్ వెళ్లాలంటే వేలాది రూపాయలు ఛార్జీలు చెల్లించాల్సిందే. అయితే లాక్ డౌన్ కారణంగా పనుల్లేక చేతుల్లో డబ్బులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న భారతీయ కార్మికులు తమ వద్ద ఇంతకాలం కూడబెట్టుకున్న బంగారాన్ని అమ్ముకోవాల్సిన పరిస్దితి నెలకొంది.
దుబాయ్ మార్కెట్లో భారీగా అమ్మకాలు..
భారత్ వెళ్లేందుకు చేతిలో చిల్లిగవ్వ లేకపోవడంతో దుబాయ్ లోని మీనాబజార్, డేరా ప్రాంతాల్లోని చిన్నచిన్న బంగారు దుకాణాల్లో అమ్మకాలకు భారతీయులు ఎగబడుతున్నారు. సాధ్యమైనంత త్వరగా తమ వద్ద ఉన్న బంగారాన్ని అందిన కాడిని అమ్మేసుకుని భారత్ వెళ్లిపోవాలన్న ఆతృత వారిది. దీంతో ఇప్పుడు దుబాయ్ మార్కెట్లు అమ్మకాలతో కిటకిటలాడుతున్నాయి. గల్ఫ్ దేశాల్లో మిగతా రంగాలన్నీ ఉపాధి కరవై ఉసూరుమంటుంటే బంగారం షాపులు మాత్రం కళకళలాడుతున్నాయి.
భారత్ కంటే 12 శాతం తక్కువ రేటుకు...
గల్ఫ్ దేశాల్లో కొనుగోలు చేసే బంగారం భారత్ కు తీసుకొచ్చి అమ్ముకుంటే ఎక్కువ ధర వస్తుంది. అదే అక్కడే అమ్మేసుకుంటే కనీసం 12 శాతం తక్కువ ధరకు అమ్ముకోవాల్సి వస్తుంది. అయినా సరే తాము వెంటనే భారత్ వెళ్లిపోవాలంటే ఏదో ఒక ధరకు బంగారం అమ్ముకోక తప్పడం లేదని భారతీయ వలస కార్మికులు చెబుతున్నారు. వెంటనే బంగారం అమ్ముకుని భారత్ బయలుదేరకపోతే ప్రత్యేక విమానాల రాకపోకలు నిలిచిపోతే తమ పరిస్ధితి ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. మరికొన్ని రోజులు ఇదే పరిస్దితి కొనసాగే అవకాశముంది.