డ్రాగన్ కంట్రీకి భారత్ షాక్, 43 చైనా యాప్స్పై నిషేధం
భారత్-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో భద్రత దృష్ట్యా మన ప్రభుత్వం గత కొన్ని నెలలుగా చైనాకు చెందిన వివిధ యాప్స్ను బ్యాన్ చేస్తోంది. గాల్వాన్ ఘటన అనంతరం టిక్టాక్, హెలో సహా 59 యాప్స్ను నిషేధించింది. ఆ తర్వాత మరిన్న యాప్స్ పైన ఉక్కుపాదం మోపింది. తాజాగా మరో 43 యాప్స్ను నిషేధించింది. భారత సార్వభౌమాధికారం, సమగ్రత, రక్షణ, భద్రతను కాపాడడానికి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ సెక్షన్ 69A కింద ఈ యాప్లను నిషేధించింది.
తాజాగా నిషేధించిన యాప్స్లో చైనా వ్యాపార దిగ్గజ సంస్థ అలీ ఎక్స్ప్రెస్ ఉంది. అలాగే అలీబాబా వర్క్ బెంచ్, హీరోస్ ఎవాల్వ్డ్, డింగ్ టాక్ ఉన్నాయి. ఐటీ సెక్షన్ 69ఏ ప్రకారం ఈ బ్యాన్ విధించినట్లు కేంద్రం ప్రకటించింది. ఈ బ్యాన్ విధించడానికి గల కారణాలను కేంద్రం వెల్లడించింది. భారత సమగ్రతకు, సార్వభౌమాధికారానికి భంగం కలిగే అవకాశం ఉందని, అలాగే రక్షణరంగ, కేంద్ర-రాష్ట్ర ప్రజల భద్రత దృష్ట్యా ఈ అప్లికేషన్లను బ్యాన్ చేసినట్లు తెలిపింది.
కేంద్రం మొదట 59 యాప్స్ను బ్యాన్ చేసింది. ఆ తర్వాత 118 యాప్స్ను, తాజాగా 43 యాప్స బ్యాన్ చేయడంతో మొత్తం అప్లికేషన్ల సంఖ్య 200 దాటి 267కు చేరుకున్నాయి. నిషేధానికి గురైన యాప్స్లో పబ్జీ, టిక్టాక్, హెలో, యూసీ బ్రౌజర్ వంటివి ఉన్నాయి. మొదట గేమింగ్ యాప్స్ను నిషేధించిన కేంద్రం ఇప్పుడు డేటింగ్, కామర్స్ యాప్స్ను బ్యాన్ చేసింది.