2020లో దారుణ ఆర్థిక పతనం, వచ్చే ఏడాది చైనాను దాటనున్న భారత్
భారత ఆర్థిక వ్యవస్థ 2020 క్యాలెండర్ ఏడాదిలో 10.3 శాతం ప్రతికూలత నమోదు చేయవచ్చునని, 2021 క్యాలెండర్ ఏడాదిలో తిరిగి వేగంగా పుంజుకునే అవకాశాలు ఉన్నాయని ఇంటర్నేషనల్ మానిటరి ఫండ్(IMF) అంచనా వేసింది. వచ్చే క్యాలెండర్ ఏఢాదిలో8.8 శాతం వృద్ధి నమోదు కావొచ్చునని పేర్కొంది. కరోనా మహమ్మారి కారణంగా భారత వృద్ధి రేటు ఈ ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో 23.9 శాతం ప్రతికూలత నమోదు చేసింది. తదుపరి రెండు క్వార్టర్లలోను వృద్ధిరేటు క్షీణిస్తుందని వివిధ రేటింగ్ సంస్థలు అంచనా వేస్తున్నాయి. నాలుగో క్వార్టర్ క్వార్టర్లో కాస్త పుంజుకోవచ్చునని కొన్ని సంస్థలు, నెగిటివ్గానే ఉంటుందని మరికొన్ని సంస్థలు అంచనా వేస్తున్నాయి. అయితే తదుపరి సంవత్సరం మాత్రం మంచి వృద్ధి రేటు నమోదు చేస్తాయని చెబుతున్నాయి.
చైనాను దాటనున్న ఇండియా జీడీపీ, ప్రపంచ ఎకానమీ...
2021 క్యాలెండర్ ఏడాదిలో భారత వృద్ధిరేటు 8.8 శాతంతో చైనా వృద్ధి రేటు 8.2 శాతాన్ని (అంచనా) అధిగమిస్తుందని IMF అంచనా వేసింది. ఈ మేరకు తాజా వరల్డ్ ఎకనమిక్ ఔట్ లుక్ నివేదికలో తెలిపింది. IMF, వరల్డ్ బ్యాంకు వార్షిక సదస్సుకు ముందు ఈ నివేదిక విడుదలైంది. 2020 క్యాలెండర్ ఏడాదిలో ప్రపంచ వృద్ధి రేటు 4.4 శాతం మేర క్షీణిస్తుందని IMF అంచనా వేసింది. 2021 క్యాలెండర్ ఏడాదిలో 5.2 శాతానికి తిరిగి పుంజుకుంటుందని పేర్కొంది.
అంచనాల కంటే క్షీణత
కరోనా కారణంగా భారత జీడీపీ రెండో క్వార్టర్లో అంచనాలకు మించి క్షీణిస్తుందని IMF అంచనా వేసింది. 2019లో భారత్ జీడీపీ 4.2 శాతం నమోదు కాగా, ఈ క్యాలెండర్ ఏడాదిలో 10.3 శాతం ప్రతికూలత, 2021లో 8.8 శాతం వృద్ధి ఉంటుందని తెలిపింది. భారత జీడీపీ ఈ ఆర్థిక సంవత్సరం 9.6 శాతం ప్రతికూలత నమోదు చేస్తుందని వరల్డ్ బ్యాంకు గతవారం అంచనా వేసింది.
అమెరికా డౌన్, చైనా ఒక్కటే అప్
అమెరికా ఆర్థిక వ్యవస్థ 2020లో 5.8 శాతం మేర ప్రతికూలత నమోదు చేస్తుందని, మరుసటి ఏడాది 3.9 శాతం వృద్ధిరేటు నమోదు చేస్తుందని IMF తెలిపింది. అయితే 2020 ఏడాదిలో సానుకూల వృద్ధి రేటు నమోదు చేయనున్న ఏకైక దేశం చైనా (1.9 శాతం వృద్ధి) అని పేర్కొంది. కరోనా కారణంగా ప్రపంచానికి 28 ట్రిలియన్ డాలర్ల మేర నష్టం వాటిల్లిందని IMF అంచనా వేసింది.