కొత్త కొలువులతో ఆటో రంగం సిద్ధం.. మరి ఐటీ పరిస్థితి ఏమిటి..? 2030 నాటికి..
Auto Sector: రానున్న కాలంలో ఆటో రంగం మంచి ఉపాధి అవకాశాలను అందిస్తుందని తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం సైతం ఇందుకు అనుకూలంగా ఉంది. ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. చమురు దిగుమతులపై ఆదారపడటాన్ని తగ్గించాలని.. తద్వారా విదేశీ మారక నిల్వలను కాపాడాలని భారీ ప్రణాళిక వేసింది.
తాజా సర్వే..
ఈ రంగంలో ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు మంచి ఉపాధిని కల్పించవచ్చని తెలుస్తోంది. మెకెంజీ అండ్ ఆటోమోటివ్ కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ దీనిపై తాజాగా సర్వే నిర్వహించింది. ఎలక్ట్రిక్ వాహనాల కాంపొనెంట్స్ వేరుగా ఉన్నప్పటికీ.. నేక కొత్త రంగాల్లో ఉద్యోగావకాశాలు పెరుగుతాయని నిపుణులు భావిస్తున్నారు. ఆటో కాంపోనెంట్ కంపెనీలు కూడా దీని వల్ల లాభపడుతున్నాయని సర్వే వెల్లడించింది.
కొత్త ఉద్యోగాలు..
దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల పెరుగుదలతో ఐసీ ఇంజిన్ భాగాల ఉత్పత్తి నెమ్మదిస్తుంది. మరోవైపు ఎలక్ట్రిక్ మోటార్లు, బ్యాటరీ సెల్స్ అండ్ బ్యాటరీ సిస్టమ్లకు డిమాండ్ పెరుగుతోంది. అదే విధంగా ఉద్యోగాల పెంపుదల కూడా కనిపిస్తోందని దీన్ని బట్టి స్పష్టమవుతోంది. ఎలక్ట్రిక్ వాహనాలపై భారతీయులకు మక్కువ పెరుగుతున్నందున చాలా కంపెనీలు తమ వ్యాపారాన్ని మార్చుకుంటున్నాయి. ఎలక్ట్రిక్ మొబిలిటీ సొల్యూషన్లను అందించడం ప్రారంభించాయి. టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఎంజీ హెక్టర్ వంటి కంపెనీలు ఇప్పటికే ఈ రంగంలో దూసుకుపోతున్నాయి. తాజాగా టాటా నెక్సన్ కార్ల తయారీ 50000 యూనిట్ల మైరురాయిని కంపెనీ అధిగమించింది.
2030 నాటికి..
ఉద్యోగాలకు సంబంధించిన కన్సల్టెన్సీ కంపెనీ గ్లోబల్ హంట్ సీఈవో సునీల్ గోయెల్ ప్రకారం..ఎలక్ట్రిక్ వాహనాల వృద్ధి ఆటో రంగంలో ఉద్యోగాలపై ఎలాంటి నెగటివ్ ప్రభావాన్ని చూపే అవకాశం లేదని చెప్పింది. 2030 నాటికి దేశంలో కార్ల విక్రయంలో 30 శాతం ఎలక్ట్రిక్ వాహనాలు ఉండేలా చూసుకోవాలని కంపెనీలు లక్ష్యంగా పెట్టుకున్నాయి.
ఐటీ పరిశ్రమ..
ఇప్పటికే చాలా ఐటీ కంపెనీలు కొత్త రిక్రూట్ మెంట్లను నిలిపివేశాయి. అయితే ఇప్పుడు ద్రవ్యోల్బణం వల్ల కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఇంతకు ముందు దేశంలోని టాప్-10 ఐటీ కంపెనీలు సుమారు ఐదు లక్షల కొత్త రిక్రూట్మెంట్లు చేశాయి. విప్రో, టెక్ మహీంద్రా సంస్థలు రెండవ త్రైమాసికంలో సేల్స్, సహాయక సిబ్బంది, సాఫ్ట్వేర్ ఇంజనీర్ల సంఖ్యను క్రమంగా తగ్గించాయి. 2020 తర్వాత ప్రధాన ఐటీ కంపెనీల్లో ఉద్యోగుల సంఖ్య తగ్గటం ఇదే తొలిసారి. L&T టెక్నాలజీ, సైఎంట్, Zensar కూడా ఇవే పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి.
ప్రపంచ మార్కెట్లో మందగమనం..
కరోనా సమయంలో కంపెనీల్లో రిక్రూట్ మెంట్ల హడావిడి నడిచింది. జూలై 2020-సెప్టెంబర్ 2022 మధ్య కాలంలో టాప్-10 ఐటీ కంపెనీలు ఏకంగా 50 లక్షల మంది ఉద్యోగులను చేర్చుకున్నాయి. అయితే ప్రపంచ వ్యాప్తంగా టెక్ కంపెనీలు వరుసగా లేఆఫ్ లను ప్రకటిస్తున్నాయి. మరి కొంత కాలం ఇదే పరిస్థితి కొనసాగుతుందని నిపుణులు అంటున్నారు.