2వ స్థానంలోకి... 2030 నాటికి జపాన్ను దాటనున్న భారత ఆర్థిక వ్యవస్థ
ఆసియా రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించనుందని IHS మార్కిట్ నివేదిక పేర్కొంది. తద్వారా ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలుస్తుందని తెలిపింది. అయితే 2030 నాటికి ఇది సాధ్యమవుతుందని వెల్లడించింది. ప్రస్తుతం ఆసియాలో చైనా అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిచింది. ఆ తర్వాత జపాన్, భారత్ ఉన్నాయి. ప్రస్తుతం ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో అమెరికా (1), చైనా (2), జపాన్ (3), జర్మనీ (4), బ్రిటన్ (5) స్థానాల్లో ఉండగా, భారత్ ఆరో స్థానంలో నిలిచింది.
2021లో 2.7 ట్రిలియన్ డాలర్లుగా ఉన్న భారత నామినల్ జీడీపీ 2030 నాటికి 8.4 ట్రిలియన్ డాలర్లకు చేరుకోవచ్చునని, ఈ వేగవంతమైన వృద్ధి కారణంగా జపాన్ జీడీపీని భారత జీడీపీ అధిగమించి ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో రెండో స్థానంలోకి వెళ్లవచ్చునని పేర్కొంది. 2030 వరకు అతిపెద్ద పశ్చిమ ఐరోపా ఆర్థిక వ్యవస్థలైన జర్మనీ, ఫ్రాన్స్, బ్రిటన్లను కూడా భారత ఆర్థిక వ్యవస్థ అధిగమించే అవకాశాలు లేకపోలేదని, దశాబ్ద కాలంలో ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి సాధిస్తున్న ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ఒకటిగా ఉందని తెలిపింది.
భారత ఆర్థిక వ్యవస్థను 5 ట్రిలియన్ డాలర్ల స్థాయికి తీసుకు వెళ్లాలని నరేంద్ర మోడీ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఎస్బీఐ మాజీ చీఫ్ రజనీష్ కుమార్ కూడా 2025 నాటికి రూ.5 లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థకు తీసుకు వెళ్లడానికి అవసరమైన ఆర్థిక వృద్ధి రేటు అవసరమని అభిప్రాయపడ్డారు. వినియోగదారు వ్యయం పెరిగేందుకు భారత్లోని అతిపెద్ద, వేగవంతమైన మధ్య తరగతి భారత్కు అతి ముఖ్యమైన సానుకూల అంశంగా మారుతోందని, 2020లో 1.5 లక్షల కోట్ల డాలర్లుగా ఉన్న కస్టమర్ వ్యయాలు 20.30 నాటికి రెట్టింపై 3 లక్షల కోట్ల డాలర్లకు చేరుకోవచ్చునని ఐహెచ్ఎస్ పేర్కొంది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి భారత్ వాస్తవ జీడీపీ వృద్ధి 8.2 శాతంగా నమోదు కావొచ్చునని అంచనా.