ఐటీ కంపెనీలను వీడుతున్న టెక్ నిపుణులు, ఎందుకంటే
సాఫ్టువేర్ కంపెనీలు గత కొద్ది సంవత్సరాల్లో ఎప్పుడు లేనంతగా ఉద్యోగ వలసలను (ఆట్రిషన్) సమస్యను ఎదుర్కొంటున్నాయి. కరోనా అనంతరం అన్ని రంగాల్లో డిజిటల్ టెక్నాలజీ వినియోగం, డిజిటల్ ట్రాన్స్ఫార్మేషన్... ఐటీ ఉద్యోగుల వలసలకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. క్లౌడ్ కంప్యూటింగ్, ఓటీటీ, ఏఐ వంటి డిజిటల్ టెక్నాలజీల్లో నైపుణ్యాలు ఉద్యోగులకు ఈ రంగంలో డిమాండ్ను పెంచింది. దీంతో ఈ నైపుణ్యాలు కలిగిన వారిని ఆకర్షించేందుకు ఐటీ సంస్థలు పోటీ పడుతున్నాయి.
ప్రత్యేక ఉత్పత్తులు, సేవలపై దృష్టి కేంద్రీకరించిన స్టార్టప్ కంపెనీలు డిజిటల్ టెక్నాలజీల్లో కోర్ నైపుణ్యం కలిగిన వారికి అధిక వేతనాలు అందిస్తున్నాయి. గత ఆరు నెలల్లో డిజిటల్ నైపుణ్యాలు కలిగిన వారికి డిమాండ్ పెరిగింది. మహమ్మారి అనంతరం డిజిటల్ టెక్నాలజీ వినియోగం పెరిగి, వివిధ రంగాల్లో నైపుణ్యం కలిగిన వారి డిమాండ్కు కారణంగా మారిందని చెబుతున్నారు.
వివిధ రంగాల్లోని కంపెనీలు క్లౌడ్ సేవలపై ఖర్చు చేస్తున్నాయి. దీంతో డేటా సెంటర్స్ కోసం ఐటీ కంపెనీలు భారీగా క్లౌడ్ టెక్నాలజీల్లో నైపుణ్యం కలిగిన వారికి ఎక్కువ వేతనాలు ఇచ్చి నియమించుకుంటున్నాయని చెబుతున్నారు. ఒక్కో సాఫ్టువేర్ కంపెనీలో సగటున గత ఏడాది నాటికి 8 నుండి 10 శాతం ఉన్న డిజిటల్ నిపుణులు, ఇప్పుడు 25 శాతానికి పెరిగారు. సాధారణంగా ఒక కంపెనీ నుండి మరో కంపెనీకి వెళ్లే వలసల రేటు ఇదివరకు 11 శాతం నుండి 12 శాతంగా ఉండేది. కానీ ఇప్పుడు అది 20 శాతం దాటింది. ఇదివరకు ఉద్యోగి కంపెనీ మారినప్పుడు 30 శాతం వరకు అధిక వేతనం ఉండిది. ఇప్పుడు 50 శాతానికి పెరిగింది.