2019-20 మూడో త్రైమాసికంలో స్వల్పంగా పెరిగిన జీడీపీ..ఎంతశాతమంటే..?
న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వృద్ధి కాస్త మెరుగుపడిందని ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల ద్వారా తెలుస్తోంది. 2019-20 ఆర్థిక సవంత్సరంలో మూడో త్రైమాసికంలో ఇండియన్ ఎకానమీ 4.7శాతం వృద్ధిని నమోదుచేసిందని ప్రభుత్వం గణాంకాలను విడుదల చేసింది. ఆర్థిక నిపుణులు అంచనా ప్రకారమే దేశ స్థూలజాతీయోత్పత్తి (జీడీపీ) గత డిసెంబర్లో పెరిగిందని ప్రభుత్వం చెప్పుకొచ్చింది. రెండో త్రైమాసికంలో నమోదైన జీడీపీ కంటే మూడో త్రైమాసికంలో జీడీపీ 0.2 శాతం మేరా పెరిగి 4.5శాతంకు చేరిందని వెల్లడించింది. ఆరేళ్ల తర్వాత తొలిసారిగా పెరుగుదల నమోదైంది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గాను భారత ఆర్థిక వృద్ధి 5శాతంగా ఉంది. గత 11 ఏళ్లలో ఇదే అత్యంత తక్కువగా నమోదైన వృద్ధి రేటు.పడిపోయిన వృద్ధి రేటు తిరిగి పుంజుకునేది మాత్రం 2021 ఆర్థిక సంవత్సరంలోనే అని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. అదే సమయంలో వృద్ధి రేటు 6 శాతం నుంచి 6.5శాతం ఉంటుందని అంచనా వేస్తున్నారు. అయితే చాలామంది ఆర్థికవేత్తలు మాత్రం ఈ సంఖ్యతో ఏకీభవించలేకున్నారు. వృద్ధి రేటు పెరగాలంటే అనేక అంశాలపై దృష్టి సారించాల్సి ఉంటుందని అందుకే ఈ సంఖ్యను టచ్ చేసే అవకాశం లేదని చెబుతున్నారు.
ఇక కరోనావైరస్ దెబ్బకు వాణిజ్య రంగం కుదేలైంది. ఇప్పటికే మార్కెట్లు విపరీతమైన నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. భారత్కు ఇది పెద్ద దెబ్బే అని ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఈ దెబ్బ నుంచి మార్కెట్లు కోలుకునేందుకు మరికాస్త సమయం పడుతుందని జోస్యం చెబుతున్నారు.
ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ బారిన పడి 2800 మంది మృతి చెందగా 83వేల మంది చికిత్స పొందుతున్నారు. ఇక ప్రపంచ దేశాలకు ఈ వైరస్ విస్తరిస్తుండటంతో ఆ ప్రభావం భారత మార్కెట్లపై పడుతోంది. ముందుగా ఒక్క చైనాకే ఈ ప్రాణాంతక వైరస్ పరిమితమవుతుందని అంతా భావించినప్పటికీ అది మరో 57 దేశాలకు విస్తరించడం భారత మార్కెట్లను కలవరపాటుకు గురిచేస్తోంది.
మరోవైపు ప్రపంచ వ్యాప్తంగా కరోనావైరస్ వ్యాప్తి చెందడం అదే సమయంలో ప్రపంచ మార్కెట్లపై ఈ ప్రభావం పడుతుండటంతో ఎంత వరకు నష్టం వాటిల్లుతుందనేదానిపై ఆర్థికనిపుణులు అంచనా వేయలేకున్నారు. ఇదిలా ఉంటే భారత్కు మాత్రం ఈ సమయంలో ఒక ఊరటనిచ్చే అంశం బయటకొచ్చింది.
భారత ఆర్థిక వ్యవస్థకు మూలకారణంగా నిలిచే 8 రంగాలు జనవరి 2020లో 2.2శాతం మేరా వృద్ధిని నమోదు చేశాయి. మౌలిక సదుపాయాల రంగం జనవరి నెలలో 1.5శాతం వృద్ధిని రికార్డ్ చేసింది. అయితే మొత్తంగా చూస్తే దేశ ఆర్థిక వృద్ధి మాత్రం పలురంగాల్లో కరోనావైరస్ ఎఫెక్ట్ ఏమేరకు చూపుతుందనే దానిపైనే ఆధారపడి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ద్రవ్యోల్బణం డిమాండ్పై కూడా ఆర్థిక వృద్ధి ఆధారపడి ఉంటుందని చెప్పారు.