చైనాకు వెళ్లాలంటేనే ఇక భయం, అక్కడి కంపెనీ కోసం భారత్ వద్ద ఉన్న ఆయుధం ఇదే!
కరోనా మహమ్మారి నేపథ్యంలో చైనా నుండి పలు కంపెనీలు ఇతర దేశాల వైపు చూస్తున్నాయి. వీటిని ఆకర్షించేందుకు భారత్ సహా వివిధ దేశాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. అమెరికా-చైనా ట్రేడ్ వార్ మొదలు కరోనా వరకు పరిస్థితుల నేపథ్యంలో ఈ పెట్టుబడులను ఆకర్షించడంలో ఎక్కువగా విజయం సాధించింది వియత్నం. చైనాకు దూరం జరగాలనుకుంటున్న దాదాపు వెయ్యికి పైగా కంపెనీలతో భారత్ చర్చలు జరిపింది. అయితే ఇప్పటి వరకు అయితే పెద్దగా ముందడుగు పడింది లేదు. అయితే చైనా నుండి మేజర్ ఆయిల్ కంపెనీలను ఆకర్షించేందుకు భారత్ వద్ద ఉన్న ఆయుధం 'సేల్' అని చెబుతున్నారు.
అమెరికా దుస్థితి, మూణ్నెళ్లలో అమెరికాలో 4.4 కోట్ల ఉద్యోగాలు పోయాయి
చైనాకు వెళ్లాలంటే భయం
చైనాను వీడాలనుకుంటున్న పెట్టుబడిదారుల్లో కొంతమంది చమురు ఇన్వెస్టర్లు భారత్ వైపు చూస్తున్నారట. ప్రపంచం సాధారణ స్థితికి వస్తే చమురు పెట్టుబడులు పరిమితమవుతాయని, అప్పుడు భారత్ మాత్రమే ప్రత్యామ్నాయంగా నిలుస్తుందని చెబుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో చాలా వరకు వెస్టర్న్ దేశాలు చైనాకు వెళ్లేందుకు ఆసక్తి చూపించవని, అక్కడకు వెళ్లేందుకు భయపడతారని, అప్పుడు మిగిలిన ప్రత్యామ్నాయం భారత్ మాత్రమేనని భారత్ పెట్రోలియం కార్పోరేషన్ ఫైనాన్స్ డైరెక్టర్ ఎన్ విజయ్ గోపాల్ అభిప్రాయపడ్డారు.
ఇలా పెట్టుబడుల ఆకర్షణ
అమెరికా సహా చాలా దేశాలు... చైనా అంతర్జాతీయ వాణిజ్యానికి చాలా ప్రమాదకారిగా భావిస్తున్నారని గుర్తుచేస్తున్నారు. పెట్టుబడులు ఆకర్షించేందుకు భారత్కు ఈ కరోనా సరైన సమయంగా చెబుతున్నారు. ఇందులో భాగంగా భారత్ పెట్రోలియం (BPCL) వంటి సంస్థల ఆస్తులు లేదా వాటాల ద్వారా అంతర్జాతీయ ఇన్వెస్టర్లను ఆకర్షించవచ్చునని చెబుతున్నారు. పెట్టుబడుల ఆకర్షణకు ఇది ఉపయోగపడుతుందంటున్నారు.
ఇప్పటికే బీపీసీఎల్ వైపు చూపులు
అంతర్జాతీయ కంపెనీలు కాపెక్స్ను తగ్గించుకుంటున్నాయని, నగదును భద్రపరుచుకుంటున్నాయని, కానీ ఎగ్జాన్ మొబిల్, షెల్, బీపీ లేదా సౌదీ ఆరామ్కోలకు ఇబ్బంది లేదని చెబుతున్నారు. చమురుకు తిరిగి డిమాండ్ పెరిగినప్పుడు వారి వద్ద ఉన్న క్యాష్ రిజర్వ్స్తో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తారని చెబుతున్నారు. 135 కోట్ల జనాభాతో చమురు డిమాండ్లో భారత్ ప్రపంచంలో మూడో స్థానంలో ఉంది. చైనాకు ప్రత్యామ్నాయంగా చూసే చమురు కంపెనీలు భారత్ వైపు చూస్తారని, ఇప్పటికే కొన్ని కంపెనీలు బీపీసీఎల్ వైపు చూస్తున్నాయని చెబుతున్నారు.
భారత్ వైపు ఇన్వెస్టర్లు
ఎగ్జాన్ మొబైల్ కార్పోరేషన్ నుండి రాయల్ డచ్ షెల్ వరకు పెద్దపెద్ద చమురు కంపెనీలు చైనా ఎనర్జీ చైన్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టాయి. ప్రస్తుత పరిస్థితుల్లో చమురు వినియోగం పెరుగుతున్న భారత్ వైపు కూడా ఇన్వెస్టర్లు మరింతగా దృష్టి సారిస్తున్నారు. కరోనా - లాక్ డౌన్ తర్వాత బీపీసీఎల్ సహా చమురు శుద్ధి కర్మాగారాలు ఇప్పుడు కార్యకలాపాలు పెంచుతున్నాయని, సేల్స్ పెరుగుతున్నాయని విజయ్ గోపాల్ తెలిపారు. చమురు ధరల అస్థిరత కారణంగా ప్రపంచవ్యాప్తంగా చమురు కంపెనీల వ్యాల్యు పడిపోయింది. దీంతో బీపీసీఎల్ వ్యాల్యూ ఫిబ్రవరిలో 7.4 బిలియన్ డాలర్లు కాగా, ఇప్పుడు 5.7 బిలియన్ డాలర్లకు తగ్గింది. అయితే ఇది సమస్య కాదని విజయ్ గోపాల్ చెబుతున్నారు. ఇన్వెస్టర్లు కంపెనీ ఆస్తులు వంటి అంశాల ఆధారంగా అంచనా వేస్తారని తెలిపారు.
సుదీర్ఘ చరిత్ర
బీపీసీఎల్ ఇండియాలో మూడో అతిపెద్ద చమురు రిఫైనరీ, రెండో అతిపెద్ద ఇంధన రిటైలర్ సంస్థ. 2019తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి 21 శాతం మార్కెట్ను కలిగి ఉంది. పెట్టుబడిదారులు కేవలం గత ఆరునెలల కాలాన్ని మాత్రమే చూడరని, బీపీసీఎల్కు సుదీర్ఘ చరిత్ర ఉందని చెబుతున్నారు. కాగా, బీపీసీఎల్ను ప్రయివేటీకరించేందుకు ప్రయత్నాలు జరుగుతోన్న విషయం తెలిసిందే. ఈ కంపెనీలో ప్రభుత్వానికి 53.29 శాతం వాటా ఉంది.