కరోనా మహమ్మారి ప్రభావం: రికార్డు స్థాయిలో క్షీణించిన తయారీ రంగం కార్యకలాపాలు
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి పరిశ్రమలను తీవ్రంగా దెబ్బతీస్తోంది. కరోనా ప్రభావం కారణంగా దేశీయ తయారీ రంగ కార్యకలాపాలు ఏడు నెలల కనిష్టానికి చేరాయి. కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తుండటంతో ఆ ప్రభావం ఉత్పత్తి కార్యకలాపాలపై పడినట్లు ఐహెచ్ఎస్ మార్కెట్ నెలవారీ సర్వే వెల్లడించింది.
ఫిబ్రవరి నెలలో 57.5గా ఉన్న మానుఫ్యాక్చరింగ్ పర్చేజింగ్ మేనేజర్స్ సూచీ(పీఎంఐ) మార్చి నెల 55.4కు తగ్గింది. కాగా, దీర్ఘకాలికంగా కొనసాగుతూ వస్తున్న 53.6 సగటు కంటే ఎక్కువ ఉంది. పీఎంఐ సూచి 50 ఎగువన నమోదైతే వృద్ధి సాధించినట్లు, అంతకంటే తక్కువగా ఉంటే క్షీణించినట్లుగా పరిగణిస్తారు.
కరోనా కేసులు భారీగా పెరుగుతున్న క్రమంలో మార్చిలో కొత్త ఆర్డర్లు తగ్గాయని, దీంతో తయారీ కూడా నెమ్మదించిందని ఐహెచ్ఎస్ మార్కెట్ ప్రతినిధి లిమా తెలిపారు. ఈ క్రమంలో తయారీ కార్యకలాపాలతోపాటు కొనుగోళ్లు కూడా నేలచూపులు చూశాయని పేర్కొన్నారు.
ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో ప్రారంభమైన కరోనా కఠిన ఆంక్షల విధింపు నేపథ్యంలో భారత పరిశ్రమలకు ఏప్రిల్ నెల సవాల్ విసరనుందని తెలిపారు. ఇక ఉద్యోగ కల్పనపై కరోనా ప్రభావం ఇంకా తీవ్రంగానే ఉందని పేర్కొన్నారు.