రికార్డ్స్థాయి ఎగుమతుల వైపు భారత్ అడుగులు, ఇవే సంకేతాలు
భారత ఆర్థిక వ్యవస్థ అన్ని రంగాల్లో పుంజుకుంటోందని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ఎగుమతుల్లో చారిత్రక గరిష్టానికి చేరుకుంటోందన్నారు. కరోనా మహమ్మారి తర్వాత ఆర్థిక వ్యవస్థ క్షీణించిన విషయం తెలిసిందే. వ్యాపారంలో మనం తిరిగి పుంజుకుంటున్నామని గోయల్ అన్నారు. ఇందుకు జీఎస్టీ కలెక్షన్స్, ఎగుమతులు, FDI సంఖ్యలు నిదర్శనమని చెప్పారు. వస్తు, సేవల ఎగుమతుల్లో చారిత్రక గరిష్టస్థాయిలను సాధించే దిశగా దేశం పురోగమిస్తోందన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించుకున్న 400 బిలియన్ డాలర్ల ఉత్పత్తుల ఎగుమతుల లక్ష్యాన్ని సాధించే దిశగా ముందుకు సాగుతున్నామన్నారు.
విదేశీ పెట్టుబడులు 62 శాతం అధికం
భారత ఆర్థిక వ్యవస్థ బలంగా పుంజుకుందని, దేశ వస్తు సేవల ఎగుమతులు రికార్డు గరిష్ఠాలకు చేరే క్రమంలో ఉన్నాయన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసేసరికి ఎగుమతులు 400 బిలియన్ డాలర్ల లేదా రూ.30 లక్షల కోట్లుకు చేరుకునే అవకాశముందన్నారు. ఈ మేరకు ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్(ఐఐటీఎఫ్) ప్రారంభోత్సవం సందర్భంగా గోయల్ మాట్లాడారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి 4 నెలల్లో అత్యధికంగా 27 బిలియన్ డాలర్ల విదేశీ పెట్టుబడులు వచ్చాయన్నారు. ఏడాదిక్రితం ఇదే సమయంతో పోలిస్తే ఇవి 62 శాతం అధికమన్నారు. అంతర్జాతీయ సరఫరా వ్యవస్థలను కొనసాగించడంలో భారత్ను ప్రపంచ దేశాలు నమ్మకమైన అంతర్జాతీయ భాగస్వామిగా చూస్తున్నాయని చెప్పారు. దేశంలో లాక్డౌన్ ఆంక్షలు విధించినప్పటికీ, అంతర్జాతీయ వ్యవస్థకు ఎలాంటి అంతరాయం లేకుండా సేవలు అందించడంలో ఏమాత్రం వెనుకబడలేదన్నారు.
జీఎస్టీ వసూళ్ల రికార్డ్
సేవల ఎగుమతులకు సంబంధించి 150 బిలియన్ డాలర్ల లక్ష్యాన్ని సాధించగలమని గోయల్ అన్నారు. దీంతో వస్తువులు, ఉత్పత్తుల విషయంలో రికార్డ్ స్థాయి ఎగుమతులు నమోదు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. దేశం వేగంగా కోలుకుంటోందనేందుకు అక్టోబర్ నెలలో జీఎస్టీ వసూళ్లు రూ.1.3 లక్షల కోట్లకు పైగా నమోదు కావడం నిదర్శనం అన్నారు. భారత్కు ఉన్న సానుకూల అంశాలను పరిగణలోకి తీసుకొని, అంతర్జాతీయ రేటింగ్స్ ఏజెన్సీ మూడీస్ ఇటీవలే భారత సార్వభౌమ రేటింగ్ను నెగిటివ్ నుండి స్టేబుల్కు మార్చిందని గుర్తు చేశారు. ఇన్ఫ్రా, వృద్ధిలో వైవిధ్యం, అభివృద్ధికి డిమాండ్ తదితర అంశాలు ఆర్థిక పునరుజ్జీవానికి దోహదపడతాయన్నారు.
ప్రపంచ ఫ్యాషన్ హబ్
ఆస్ట్రేలియా, బ్రిటన్, యూఏఈ సహా వివిధ దేశాలతో ప్రతిపాదిత స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలకు సంబంధించిన చర్చలు వేగవంతంగా సాగుతున్నట్లు తెలిపారు. ఇవి అమలు చేస్తే దేశీయ ఉత్పత్తులకు మరింత డిమాండ్ పెరుగుతుందన్నారు. ఎందుకంటే మరిన్ని మార్కెట్లకు మన ఉత్పత్తులు విస్తరిస్తుందని చెప్పారు. ఫ్యాషన్ పరిశ్రమ కూడా వేగంగా వృద్ధి చెందుతోందని, ప్రపంచ ఫ్యాషన్ హబ్గా భారత్ అవతరిస్తుందన్నారు.