శ్రీలంకకు భారత్ భారీ రుణం: ఇంధన ధరలు ఆకాశాన్నంటడంతో
కొలంబో: శ్రీలంకలో ఆర్థిక సంక్షోభానికి తెర పడట్లేదు. రోజురోజుకూ మరింత ముదురుతోంది. ప్రజల జీవనం దుర్భరంగా మారింది. పెరిగిన ధరలతో లంకేయులు తీవ్ర ఇక్కట్ల పాలవుతున్నారు. ఎప్పుడు దేని రేటు ఆకాశాన్నంటుతుందో తెలియని ఆందోళనలో గడుపుతున్నారు. ఇప్పటికే నిత్యావసర సరుకుల ధరలు రాకెట్లా దూసుకెళ్లాయి. పాలు, కోడిగుడ్లు మొదలుకుని.. ప్రతి వస్తువు ధర కూడా ముట్టుకుంటే షాక్ కొట్టేలా ఉంటోంది.
ఈ పరిస్థితిలో శ్రీలంక చమురు కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను భారీగా పెంచేశాయి. ప్రభుత్వ ఆధీనంలోని సిలోన్ పెట్రోలియం కార్పొరేషన్ ఒక్క రోజు వ్యవధిలో లీటర్ పెట్రోల్ ధరను అమాంతం పెంచింది. ఆ దేశ కరెన్సీలో లీటర్ ఒక్కింటికి 84 రూపాయల మేర పెంచింది. ఫలితంగా- పెట్రోల్ లీటర్ ధర 338 రూపాయలు పలుకుతోందక్కడ. 95 ఆక్టేన్ పెట్రోల్ లీటర్ ధర 95 రూపాయల మేర పెరిగి 373 రూపాయలకు చేరింది. ఆటో డీజిల్ లీటర్ ధర 113లతో 289 రూపాయల వద్ద నిలిచింది.
అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ రేటు పెరగడం, డాలర్తో పోలిస్తే శ్రీలంక కరెన్సీ విలువ మరింత దిగజారడం వంటి పరిణామాలు దీనికి కారణం అయ్యాయి. లీటర్ రేటు ఆ స్థాయికి పెంచితే గానీ- సిలోన్ పెట్రోలియం కార్పొరేషన్ ఇంధనాన్ని కొనుగోలు చేయలేని దుస్థితి శ్రీలంకలో ఏర్పడింది. సిలోన్ పెట్రోలియం కార్పొరేషన్, లంక ఇండియన్ ఆయిల్ కంపెనీ ఒకే ధరకు పెట్రో ఉత్పత్తులను విక్రయిస్తోన్నాయి. పెరిగిన పెట్రో ధరలు ఇప్పటికే ఆర్థికంగా చితికిపోయిన లంక ప్రజలకు మరింత భారంగా మారింది.
ఈ పరిణామాల మధ్య శ్రీలంకకు భారీగా రుణాన్ని అందజేయడానికి భారత్ ముందుకొచ్చింది. 500 డాలర్ల రుణాన్ని ఇవ్వడానికి అంగీకరించింది. అంతర్జాతీయ మార్కెట్ నుంచి అవసరమైన ఇంధనాన్ని కొనుగోలు చేయడానికి ఈ మొత్తాన్ని తాము వినియోగిస్తామని శ్రీలంక ఆర్థికశాఖ మంత్రి అలీ సబ్రీ తెలిపారు. అంతర్జాతీయ ద్రవ్యనిధి బెయిల్ అవుట్ ప్యాకేజీని ప్రకటించిన నేపథ్యంలో- రావాల్సిన ఆర్థిక సహాయంలో జాప్యం ఏర్పడినందున భారత్ 500 మిలియన్ డాలర్ల రుణాన్ని ఇవ్వడానికి ముందుకొచ్చిందని చెప్పారు.