పెరుగుతున్న డిజిటలైజేషన్..యంత్రాల ద్వారానే పని..జాబ్ పై ఉద్యోగుల్లో టెన్షన్
కరోనా మహమ్మారి ప్రపంచ దేశాల్లో పని విధానాన్ని మార్చింది. మానవ వనరులు తక్కువ వినియోగిస్తూ, సాంకేతిక పరిజ్ఞానంతో పనులు చక్క బెట్టుకునేందుకు కంపెనీలు శరవేగంగా ఆలోచనలు చేస్తున్నాయి. ఇప్పటికే వర్క్ ఫ్రం హోం చాలా మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. ఇక చాలా సంస్థలు ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేక, తాజా ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో వారి ఉద్యోగాలకు ఉద్వాసన పలుకుతున్నాయి . సాధ్యమైనంతవరకు యంత్రాల ద్వారా, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి పనులు చేసుకోవడానికి ప్లాన్ చేస్తున్నాయి. దీంతో ఉద్యోగుల్లో టెన్షన్ మొదలైంది.
ఉదోగ్య విషయంలో ఆందోళనపై సర్వే
కరోనా సంక్షోభం ప్రపంచాన్ని అల్లకల్లోలం చేసింది. ప్రపంచవ్యాప్తంగా కంపెనీలు మానవ వనరుల కంటే, యంత్రాల ద్వారానే కార్యకలాపాలను నిర్వర్తించాలని వేగంగా అడుగులు వేస్తున్నట్టుగా వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ ఆసక్తికర విషయాలను వెల్లడించింది. ఇక భారతదేశంలోని కంపెనీలలో డిజిటలైజేషన్, యాంత్రికీకరణ ప్రపంచవ్యాప్తంగా ఉన్న సరాసరి కంటే అధికంగా ఉందని పేర్కొంది. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది కాలంలో అసలు ఉద్యోగం ఉంటుందా ఊడుతుందా అని ఆందోళన చెందుతున్న వేతన జీవులపై ఓ సర్వే నిర్వహించింది.
27 దేశాలలో 12 వేల మంది ఉద్యోగులను సర్వే చేసిన డబ్ల్యూఈఎఫ్
27 దేశాలలో 12 వేల మంది ఉద్యోగులను సర్వే చేసింది డబ్ల్యూ ఈ ఎఫ్. ఈ సర్వేలో ప్రపంచవ్యాప్తంగా సగానికి పైగా అంటే 54 శాతం ఉద్యోగులు తమ ఉద్యోగాలు ఉంటాయో పోతాయో అర్థం కాక ఆందోళన చెందుతున్నారని సర్వే పేర్కొంది. భారతదేశంలో ఉన్న ఉద్యోగుల్లో 57 శాతం మంది ఇలా ఆందోళనలో ఉన్నారని సర్వే నివేదిక వెల్లడించింది. రష్యా దేశంలో 75 శాతం మంది ఉద్యోగులు ఉద్యోగాల విషయంలో ఆందోళన చెందుతున్నట్లుగా పేర్కొంది.
ఆన్లైన్ లో నిర్వహించిన జాబ్ రీసెట్ సమ్మిట్ లో డబ్ల్యూఈఎఫ్ నివేదిక
భవిష్యత్తు ఉద్యోగావకాశాలకు అవసరమైన స్కిల్ ట్రైనింగ్ లో తమ యాజమాన్యాలు సహకరిస్తాయని ప్రపంచ ఉద్యోగుల్లో మూడింట రెండు వంతుల మంది నమ్మకంగా ఉన్నారని పేర్కొంది. ఇక భారతదేశంలోని ఉద్యోగుల్లో 80 శాతం కొత్త నైపుణ్యాలను నేర్చుకోగలమంటూ ధీమాతో ఉన్నారు. ఈ మేరకు ఆన్లైన్ లో నిర్వహించిన జాబ్ రీసెట్ సమ్మిట్ లో డబ్ల్యూ ఈ ఎఫ్ ఈ నివేదికను విడుదల చేసింది.
ఉద్యోగాల విషయంలో నో గ్యారెంటీ అని చాలా మంది ఇప్పటి నుండే కొత్త నైపుణ్యాలను మెరుగు పరచుకునే పనిలో ఉన్నట్టు పేర్కొంది .