సెప్టెంబర్ 15 నాటికి రూ.1.06 లక్షల కోట్ల పన్ను రీఫండ్స్
2020-21 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు(ఏప్రిల్ 1వ తేదీ నుండి సెప్టెంబర్ 15వ తేదీ మధ్య) 30 లక్షల మంది పన్ను చెల్లింపుదారులకూ రూ.1.06 లక్షల కోట్లకు పైగా పన్ను రీఫండ్స్ జారీ చేసినట్లు ఆదాయపు పన్ను శాఖ తెలిపింది. ఇందులో వ్యక్తిగత ఆదాయపు పన్ను రీఫండ్స్ 29.17 లక్షల మంది కాగా, కార్పోరేట్ పన్ను చెల్లింపుదారులు 1.74 లక్షల మంది ఉన్నారు. వ్యక్తిగత ఆదాయపు పన్ను కింద ఇచ్చిన రీఫండ్స్ రూ.31,741 కోట్లు అని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (CBDT) తెలిపింది. కార్పోరేట్ పన్నుల రీఫండ్స్ వ్యాల్యూ రూ.74,729 కోట్లుగా ఉంది.
కరోనా నేపథ్యంలో పెండింగ్లో ఉన్న రీఫండ్స్ జారీని ప్రాధాన్య అంశంగా పరిగణిస్తూ సత్వర మంజూరుకు ప్రయత్నిస్తోంది ఐటీ శాఖ. ఆదాయపు పన్ను విభాగం పంపే ఈ-మెయిల్స్కు సత్వరమే పన్ను చెల్లింపుదారులు స్పందిస్తే రీఫండ్స్ను సాధ్యమైనంత త్వరగా జారీ చేసింది. రీఫండ్స్ అన్నింటినీ ఆన్ లైన్ ద్వారా లేదంటే నేరుగా పన్ను చెల్లింపుదారుల ఖాతాల్లోకి జమ చేస్తోంది.
కాగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుండి సెప్టెంబర్ 15వ తేదీ వరకు పన్ను వసూళ్లు భారీగా తగ్గిన విషయం తెలిసిందే. కరోనా వైరస్ నేపథ్యంలో ఆర్థిక కార్యకలాపాలు మార్చి నుండి జూన్ వరకు పూర్తిగా నిలిచిపోయాయి. అనంతరం నుండి క్రమంగా కోలుకుంటున్నాయి. ఏప్రిల్ నుండి సెప్టెంబర్ (15వతేదీ) వరకు పన్ను వసూళ్లు 22.5 శాతం మేర తగ్గాయి. 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఇదే కాలంలో రూ.3,27,320.20 కోట్లు కాగా, ఈసారి రూ.2,53,532.30 కోట్లుగా ఉంది.
కస్టమర్లకు SBI గుడ్న్యూస్: క్రెడిట్ కార్డు బిల్లు కట్టలేకపోతే ఆఫర్!