ఆ 6 రోజులు అందుబాటులో ఉండదు, జూన్ 7వ తేదీ నుండి కొత్త ఈ-ఫైలింగ్ పోర్టల్
ఐటీ రిటర్న్స్ ఫైలింగ్ను సులభతరం చేసేందుకు కొత్త ఈ-ఫైల్లింగ్ పోర్టల్ను ప్రారంభించనుంది ఆదాయపు పన్ను శాఖ. ఈ మేరకు ఐటీ శాఖ అధికారులు గురువారం వెల్లడించారు. జూన్ 1వ తేదీ నుండి 6వ తేది వరకు ప్రస్తుతం ఉన్న వెబ్ పోర్టల్ పని చేయదని, పన్ను చెల్లింపుదారుల కోసం జూన్ 7వ తేది నుండి కొత్త ఈ-ఫైల్లింగ్ పోర్టల్ అందుబాటులోకి వస్తుందని వెల్లడించారు. పాత పోర్టల్ www.incometaxindiaefiling.gov.in నుండి కొత్త పోర్టల్ www.incometaxgov.inకు మారనుందని తెలిపారు. ఈ కొత్త పోర్టల్ కార్యకలాపాలు జూన్ 7వ తేదీ నుండి ప్రారంభమవుతుందని అధికారులు తెలిపారు.
జూన్ 1వ తేదీ నుండి 6వ తేదీ వరకు కొత్త పోర్టల్తో పాటు పాత పోర్టల్ కూడా పన్ను చెల్లింపుదారులకు, ఆదాయపు పన్ను అధికారులకు అందుబాటులో ఉండదని తెలిపింది. అందుకే ముఖ్యమైన తేదీలను ఈ రోజుల్లో నిర్ణయించవద్దని సూచించింది.
పన్ను చెల్లింపుదారులకు, డిపార్మెంట్ అసెస్సింగ్ ఆఫీసర్ మధ్య ఇప్పటికే షెడ్యూల్ చేసిన పనులను వాయిదా వేసే అవకాశముందని, పన్ను చెల్లింపుదారులు కొత్త పోర్టల్కు అలవాటుపడటానికి కొంత సమయం పడుతుందని, అందుకే జూన్ 10వ తేదీ తర్వాత నాటికి వీటిని వాయిదా వేసుకోవాలని తెలిపింది. వ్యక్తిగత లేదా బిజినెస్ కేటగిరికి సంబంధించి ఐటీ రిటర్న్స్ను ఫైల్ చేసేందుకు, ట్యాక్స్ రిటర్న్స్ విషయంలో తలెత్తే సమస్యలు, ఆదాయపు పన్నుకు సంబంధించి ఇతర పనుల కోసం పన్ను చెల్లింపుదారులు ఈ-ఫైల్లింగ్ పోర్టల్ను వినియోగిస్తారు.