ఈ-అసెస్మెంట్, 44,285 మందికి ఆదాయపు పన్ను శాఖ నోటీసులు: ఏమిటిది, ప్రయోజనలేమిటి?
గత బడ్జెట్లో ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ-అసెస్మెంట్ స్కీం కింద 44వేల మందికి ఆదాయపు పన్ను నోటీసులు పంపించింది. పన్ను లెక్కల్లో పారదర్శకత తెచ్చేందుకు ప్రభుత్వం 2019 బడ్జెట్లో ఈ అసెస్మెంట్ పథకాన్ని ప్రవేశ పెట్టింది. ఈ మేరకు అప్పుడు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. అక్టోబర్లో దీనిని ప్రారంభించారు.
ఆదాయపు పన్ను గురించి మరిన్ని కథనాలు
44వేల మందికి నోటీసులు
గుర్తించిన 58,322 కేసులకు గాను 44,285 కేసుల్లో ఆదాయపు పన్ను శాఖ నోటీసులు జారీ చేసింది. ముఖ్యంగా పన్ను చెల్లింపుదారులకు అధికారుల నుంచి వేధింపులు తప్పించేందుకు ఈ స్కీంను తీసుకు వచ్చారు. పన్ను రిటర్న్స్ పరిశీలనల్లో వ్యక్తుల జోక్యాన్ని తగ్గించేందుకు, అవినీతిని నివారించేందుకు దీనిని ప్రవేశపెట్టారు. టెక్నాలజీని ఉపయోగించుకొని మానవ జోక్యాన్ని తగ్గించి భారత్ను సరికొత్త శిఖరాలకు చేర్చినట్లు ఐటీ శాఖ తెలిపింది.
ఏమిటీ ఈ-అసెస్మెంట్
పన్ను చెల్లింపుదారులకు జారీ చేసిన నోటీసుకు ప్రత్యుత్తరం ఇచ్చే ఈ-అసెస్మెంట్ స్కీం కింద ఎవరైనా వ్యక్తి లేదా పన్నుచెల్లింపుదారు వ్యక్తిగతంగా లేదా అధికార ప్రతినిధి ద్వారా ఇన్కం ట్యాక్స్ అథారిటీ ముందు ప్రత్యక్షంగా హాజరు కావాల్సిన అవసరం లేదు.
ఈ-అసెస్మెంట్ ప్రయోజనాలు
- సెంట్రలైజ్డ్ ఈ-అసెస్మెంట్ సెంటర్ నుంచి పన్ను చెల్లింపుదారులకు అందే నోటీసులకు డిజిటల్ విధానాలలోనే సమాధానాలు ఇవ్వాలి.
- పన్ను చెల్లింపుదారులను టెక్స్ట్ సందేశాల రూపంలో అప్రమత్తం చేస్తారు.
- పన్ను చెల్లింపుదారులు తమ సమాధానాలను ఈ మెయిల్ రూపంలో పంపించవచ్చు.
- వ్యక్తులు, అధికారుల జోక్యం తగ్గిపోతుంది. ఆఫీస్ల చుట్టూ తిరిగే పరిస్థితి తగ్గుతుంది.
ఆటోమేటిక్ విధానం
- కేసులను దేశంలోని వివిధ ప్రాంతాల్లోని 8 ఈ-అసెస్మెంట్ కేంద్రాలకు పంపిస్తారు. ఆటోమేటిక్ విధానంలో జరుగుతుంది. తద్వారా పారదర్శకత ఉంటుంది.
- ఈ పథకం కింద జాతీయ ఈ-అసెస్మెంట్ సెంటర్ ఆదాయపు పన్ను శాఖ కింద ప్రాంతీయ ఈ-అసెస్మెంట్ సెంటర్లు ఉంటాయి.