మేం ధనవంతులం, మాపై పన్ను విధించండి: 102 మంది కుబేరుల బహిరంగ లేఖ
తమకు పన్ను విధించాలని ప్రపంచ దేశాలకు చెందిన వందమందికి పైగా కుబేరులు ప్రపంచ ఆర్థిక సదస్సుకు బహిరంగ లేఖ రాశారు. 2020, 2021 ఈ రెండు కరోనా క్యాలెండర్ సంవత్సరాల్లో ప్రపంచ టాప్ 10 కుబేరుల సంపద ఏకంగా 1.5 ట్రిలియన్ డాలర్లు పెరిగింది. అదే సమయంలో సామాన్య ప్రజలు మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇలాంటి సమయంలో తమపై పన్ను విధించాలని 102 మంది మిలియనీర్లు బుధవారం లేఖ రాశారు. ప్రపంచంలోని సంపన్నులపైన పన్ను వేస్తే 2.52 లక్షల కోట్ల డాలర్లు (భారత కరెన్సీలో రూ.190 లక్షలు) వసూలు అవుతాయని, ఈ మొత్తంతో ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరికీ వ్యాక్సీన్ ఇవ్వవచ్చునని, 230 కోట్ల మంది ప్రజలను పేదరికం నుండి బయటపడవేయవచ్చునని నాన్-ప్రాఫిట్స్ సంస్థ జరిపిన అధ్యయనంలో తేలింది. ఈ నేపథ్యంలో 102 మంది మిలియనీర్లు వరల్డ్ ఎకనమిక్ ఫోరంకు బహిరంగ లేఖ రాశారు.
న్యాయమైన పన్ను
ఈ లేఖ రాసిన వారిలో డిస్నీ వారసురాలు అబిగైల్ కూడా ఉన్నారు. ప్రస్తుత పన్ను విధానం అన్యాయంగా ఉందని, ధనవంతులను మరింత ధనవంతులుగా చేయడానికి ఉద్దేశ్యపూర్వకంగా రూపొందించబడిందని ఆరోపించారు. ప్రపంచం, ప్రతి దేశం, ప్రతి కుబేరుడు తమ న్యాయమైన వాటాను పూర్తిగా చెల్లించాలని డిమాండ్ చేయాలన్నారు. అందుకే ధనవంతులైన తమ పైన పన్ను విధించండని, ఇప్పుడు మాకు మరింత ట్యాక్స్ వేయండని ఆ లేఖలో పేర్కొన్నారు. ప్రపంచంలోని టాప్ 10 బిలియనీర్ల సంపద కరోనా సమయంలో భారీగా పెరిగింది. అదే సమయంలో పేదరికం కూడా పెరిగింది. ఆదాయ అసమానతలు కరోనా తర్వాత మరింత పెరిగాయి.
మాపై పన్ను విధించండి
ధనవంతులుగా, ప్రస్తుత పన్ను విధానం సరైనది కాదని తమకు తెలుసునని పేట్రియాటిక్ మిలియనీర్స్, మిలియనీర్స్ ఫర్ హ్యూమానిటీ, ట్యాక్స్ మీ నౌ, ఆక్స్ఫామ్తో వివిధ గ్రూప్స్కు పంపిన లేఖలో అబిగైల్ అన్నారు. గత రెండేళ్లుగా ప్రపంచం క్లిష్ట పరిస్థితుల్లో ఉందని, మహమ్మారి సమయంలో చాలామంది కుబేరుల సంపద పెరిగిందని, ఇలాంటి పరిస్థితుల్లో న్యాయంగా తమ వాటా పన్ను చెల్లించేందుకు ముందుకు రావాలన్నారు. ఈ బహిరంగ లేఖలో సంతకం చేసిన వారిలో యూనైటెడ్ స్టేట్స్, కెనడా, జర్మనీ, బ్రిటన్, డెన్మార్క్, నార్వే, ఆస్ట్రియా, నెదర్లాండ్స్, ఇరాన్లకు చెందిన సంపన్న పురుషులు, మహిళలు ఉన్నారు.
నిధులు సమకూర్చడం ద్వారా
ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సీన్లకు నిధులు సమకూర్చడం, పేదరికాన్ని తగ్గించడంతో పాటు తక్కువ, మధ్య-ఆదాయ దేశాల్లో 3.6 బిలియన్ల ప్రజలకు సార్వత్రిక ఆరోగ్య సంరక్షణ, సామాజిక రక్షణను అందించేందుకు ఈ పన్ను చెల్లింపులు సరిపోతాయని చెబుతున్నారు. 5 మిలియన్ డాలర్ల కంటే అధిక ఆదాయం కలిగిన వారికి రెండు శాతం, 50 మిలియన్ డాలర్ల కంటే ఎక్కువ సంపద కలిగిన వారికి మూడు శాతం, 1 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ ఆదాయం కలిగిన వారికి ఐదు శాతం పన్ను విధించబడాలన్నారు.