క్రిప్టోకరెన్సీని బ్యాన్ చేయడం కాదు, నియంత్రించాలి: గీతా గోపినాథన్
క్రిప్టో కరెన్సీలకు సంబంధించి ఐఎంఎఫ్ చీఫ్ ఎకనమిస్ట్ గీతా గోపినాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధి చెందుతున్న దేశాలు క్రిప్టో కరెన్సీని బ్యాన్ చేయడానికి బదులు నిబంధనలు రూపొందించాలన్నారు. అంతేకాదు, క్రిప్టో కరెన్సీ కోసం అంతర్జాతీయ పాలసీ ఉండాలన్నారు. క్రిప్టోను నిషేధించడం సవాళ్లతో కూడుకున్నదన్నారు. కాబట్టి నిషేధించడానికి బదులు నియంత్రించడం అవసరమన్నారు. దేశాల మధ్య పరస్పర సహకారంతో కూడిన అంతర్జాతీయ విధానాలు రూపొందించడం అవసరమని చెప్పారు. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనమిక్ రీసెర్చ్ ఆధ్వర్యంలో జరిగిన సదస్సులో ప్రసంగించారు.
నియంత్రణ కీలకం
క్రిప్టో కరెన్సీలు, క్రిప్టో ఆస్తుల నియంత్రణ చాలా కీలకమని, ఇందుకు ప్రపంచ దేశాలు భిన్న ప్రయత్నాల్లో ఉన్నాయని, వీటిని నిషేధించడం మాత్రం సవాలేనని గీత గోపినాథన్ అన్నారు. ఆర్బీఐ అధికారిక డిజిటల్ కరెన్సీని ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం ప్రయివేట్ క్రిప్టో కరెన్సీలను నియంత్రించేందుకు త్వరలో పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టే ఆలోచనలో ఉందన్నారు. కేబినెట్ ఆమోదం తర్వాతే బిల్లును సభలో ప్రవేశపెడతామని ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ ఇటీవల వెల్లడించారు.
సొంతగా పరిష్కరించలేదు..
ఏ ఒక్క దేశం కూడా ఈ సమస్యను సొంతగా పరిష్కరించలేదని గీతా గోపినాథన్ అన్నారు. అభివృద్ధి చెందే దేశాల ఆర్థిక వ్యవస్థలకు క్రిప్టోకరెన్సీలు ప్రత్యేక సవాలుగా నిలుస్తాయన్నారు. అభివృద్ధి చెందిన దేశాల ఆర్థిక వ్యవస్థలతో పోలిస్తే అభివృద్ధి చెందుతున్న మార్కెట్లకు క్రిప్టోకరెన్సీలు మరింత ఆకర్షణీయంగా ఉన్నాయన్నారు. అయితే అభివృద్ధి చెందుతున్న దేశాలు మారకపు రేటు నియంత్రణలను కలిగి ఉంటాయని, మూలధన ప్రవాహ నియంత్రణలను క్రిప్టోకరెన్సీలు ప్రభావితం చేసే అవకాశం ఉందన్నారు.
పెట్టుబడి ఆస్తిలా
క్రిప్టోను ఇన్వెస్టర్లు ఒక పెట్టుబడి ఆస్తిలాగా ఉపయోగిస్తున్నారని గీతా గోపినాథన్ అన్నారు. ఆయా దేశాల్లో పెట్టుబడికి సంబంధించిన నియమాలను డిజిటల్ కరెన్సీపై కూడా వర్తించేలా చూడాలన్నారు. వర్థమాన దేశాల్లో క్రిప్టోకరెన్సీలను, ఆస్తులను అందిపుచ్చుకోవడమనే అంశం ఎక్కువ ఆకర్షణీయంగా కనిపిస్తోందని, ఈ రంగంపై కచ్చితంగా నియంత్రణ ఉండలన్నారు. భారత ప్రభుత్వం క్రిప్టోకరెన్సీలకు సంబంధించిన బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టాలని చూస్తున్న తరుణంలో గోపీనాథ్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.